అమరావతి (ప్రజా అమరావతి);
*ఓటీఎస్ లబ్ధిదారులకు మరింత మేలు
*
*ఇళ్లపై భారీగా రుణ సదుపాయం*
*ఒక్కో ఇంటిపై గరిష్టంగా రూ.3 లక్షల వరకూ రుణం*
*చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ముందడుగు*
*ముఖ్యమంత్రి సమక్షంలో లబ్ధిదారులకు రుణాల పంపిణీ*
*త్వరగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగించి లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించాలని అధికారులకు సీఎం ఆదేశం*
*లబ్ధిదారులకు రుణాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి*
ఓటీఎస్ లబ్ధిదారులకు మరింత మేలు జరుగుతోంది. జగనన్న సంపూర్ణగృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకులు భారీగా రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆదేశాలమేరకు... ఓటీఎస్ పథకం ద్వారా క్లియర్ టైటిల్స్ పొందిన వారికి బ్యాంకులు భారీగా రుణ సదుపాయాన్ని కల్పించడం ప్రారంభించాయి. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్.జగన్ చేతులమీదుగా గుంటూరు కార్పొరేషన్కు చెందిన లబ్ధిదారులు చెక్కులు అందుకున్నారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వీరికి రుణాలు మంజూరుచేసింది. కనిష్టంగా రూ.1.5లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఓటీఎస్ లబ్ధిదారులకు ఈ బ్యాంకు రుణాలు ఇస్తోంది.
*సీఎం ఏమన్నారంటే..*
గుంటూరు కార్పొరేషన్కు చెందిన ఈ లబ్ధిదారులు కేవలం రూ.20వేలు ఓటీఎస్ కింద చెల్లించి క్లియర్ టైటిల్స్ పొందారు. ఎలాంటి న్యాయవివాదాలు లేకుండా వారి చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి. ఈ ఆస్తిని మళ్లీ బ్యాంకుల్లో తనఖాపెట్టి... రూ.3లక్షలు చొప్పున రుణం పొందారు. వారి కుటుంబాలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంవల్ల జరుగుతున్న మంచికి ఇది చక్కటి ఉదాహరణ. బ్యాంకులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓటీఎస్ లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడం సంతోషకరం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్డ్యూటీలను పూర్తిగా మినహాయించడం వల్ల వీరిలో ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున మేలు కలిగింది. ఓటీఎస్ పథకం ద్వారా దాదాపు రూ.10వేల కోట్ల రుణం మాఫీ అవ్వడమే కాకుండా, దాదాపు మరో రూ.1600 కోట్ల రూపాయలు స్టాంపు డ్యూటీ మినహాయింపుల ద్వారా మరింత మేలు కలిగింది.
పేదవాడి జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. వారి కాళ్లమీద వాళ్లు నిలబడడానికి ఇవి దోహదం చేస్తాయి. వారి జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయి. నిర్ణీత కాలంలోగా ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
*టి. కామేశ్వర్రావు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఛైర్మన్*
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద లబ్ధిదారులకు ఆస్తికి క్లియర్ టైట్సిల్ ఇవ్వడం చాలా ప్రశంసనీయం. జగనన్న గృహ హక్కు పథకం కింద నలుగురు లబ్ధిదారులకు సీఎం శ్రీ వైయస్.జగన్గారి చేతులుమీదుగా రూ.11,75,000లు రుణాలు ఇస్తున్నాం. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద బ్యాంకు పరిధిలోని నాలుగు జిల్లాల్లో జిల్లాకు లక్ష చొప్పన ఉన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో 228 బ్రాంచీలు ఉన్నాయి. ఓటీఎస్ లబ్ధిదారులు బ్రాంచీలను సంప్రదిస్తే వారికి రుణసేవలు అందిస్తాం.
సమాజంలో దిగువనున్నవారు అధిక వడ్డీల బారిన పడకుండా మా బ్యాంకు ఈ చర్యలను చేపడుతోంది. సీఎంగారి పిలుపుతో మరింత మందికి రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఇది లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరుస్తుంది. సీఎంగారు తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తు తరాలకు మంచి పునాదులను వేస్తున్నాయి.
*వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్*
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా క్లియర్ టైటిల్స్ ఇస్తున్నారు. చిన్న చిన్నవారికి కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు ఇది గొప్ప అవకాశం.
ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్న ముఖ్యమంత్రిగారి ఆలోచన ఇలాంటి వాళ్లు చాలామందికి మేలు జరుగుతోంది. గతంలో డాక్యుమెంట్లు లేక, రుణాలకు తగిన సెక్యూరిటీ లేక బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి పెద్ద సమస్య వచ్చేది
ఇప్పుడు అలాంటి సమస్యలేదు.
addComments
Post a Comment