మహిళలను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పథకాలు అమలు

 

మహిళలను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దే  లక్ష్యంతో పథకాలు అమలు 


ప్రభుత్వ ప్రజావ్యహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి

అమరావతి, మార్చి 8 (ప్రజా అమరావతి):  మహిళలను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే మహిళలను కేంద్ర బింధువుగా చేస్తూ ప్రభుత్వ పథకాలను అన్నింటినీ అమలు చేయడం జరుగుచున్నదని  రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మల శక్తి పై అచంచల నమ్మకం, విశ్వాసం ఉన్న ముఖ్యమంత్రి             శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతిని  కాంక్షిస్తూ పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు.  చర్చా వేదికల ద్వారా ఈ పథకాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి మహిళల అందరిలో వీటిపై  సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యతను క్రియాశీలక పాత్ర పోషించే ఉద్యోగినులపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆవరణలో  మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.  ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనకై మహిళా కేంద్ర బింధువుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల తీరును వివరించారు. కుటుంబంలో మహిళను ఒక నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పథకాలను మహిళల పేరనే ప్రభుత్వం మంజూరు చేస్తున్నదన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50 శాతం మేర మహిళలనే నియమించడం జరిగింది,  స్థానిక సంస్థల్లోని 50 శాతం రిజర్వేషన్ ను అదిగమించి మహిళకు కేటాయించడం జరిగిందన్నారు. అక్కచెల్లెమ్మల భధ్రతను కాంక్షిస్తూ దిశ చట్టాన్ని ప్రతిపాదించడం జరిగిందని, దిశయాప్ రూపొందించడంతో పాటు దిశ పోలీస్ స్టేషన్లలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు పర్చే సున్నా వడ్డీ పథకం ఫలితంగా డ్వాక్రా పొదుపు సంఘాలు 99 శాతం మేర రీ-పేమెంట్స్ చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలోని మహిళలను ప్రపంచ స్థాయి మహిళలుగా తీర్చి దిద్దేందుకు అవసరమైన అన్ని పథకాలను గత మూడేళ్ల నుండి మన ముఖ్యమంత్రి                                శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 


అంతకు ముందు చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యురాలు ఆర్.కె.రోజ ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంబించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనకై తమ ప్రభుత్వం అనేక పథకాలను మహిళల పేరనే మంజూరు చేస్తున్నదని,  అయితే అవి క్షేత్ర స్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన ప్రభుత్వ ఉత్తరువులను పటిష్టంగా రూపొందించడం ద్వారా సచివాలయ మహిళా ఉద్యోగులు మహిళా సాధికారతకు ఎంతగానో సహకరిస్తున్నారని అభినందించారు. ప్రతి మగవాడి అభ్యున్నతి వెనుక మహిళ ఉన్నట్టుగానే, మహిళా అభ్యున్నతికై ప్రతి మహిళ ప్రక్కన మగవాడు ఉంటాడనేది అంతే సత్యమన్నారు. తాను ఒక నటిగా, రాజకీయవేత్తగా రాణించడానికి తమ తల్లిదండ్రులు, సోదరులు, భర్త ఎంతగానో ప్రోత్సహించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, మహిళలు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ  మానసిక సాధికారతను సాదించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె పిలుపునిచ్చారు.  


రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ  వాణీ మోహన్, లా సెక్రటరీ వి.సునీత, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షులు కె.వెంకటరామి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అద్యక్షురాలు సత్యసులోచన, ఉపాద్యక్షురాలు ఆర్.దీపా భవాని, అదనపు కార్యదర్శులు వెంకట లక్ష్మీ, సత్యవతి, సంయుక్త  కార్యదర్శి మాధవీలతా, కోశాధికారి రాధా తదితరులతో పాటు ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగులు అందరూ ఈ వేడుల్లో పాల్గొన్నారు.

      

Comments