నేటినుండి ఫాల్గుణ మాసం ప్రారంభం , ఫాల్గుణ మాసం విశిష్టత

 _*నేటినుండి ఫాల్గుణ మాసం ప్రారంభం , ఫాల్గుణ మాసం  విశిష్టత*


ఫాల్గుణం... విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు *"పయోవ్రతం"* ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం , ధనదానం , వస్త్రదానం , గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు , వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా , సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.


*వసంత పంచమి* నుంచి *ఫాల్గుణ పూర్ణిమ* వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు , లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.


*హరిహరసుతుడు అయ్యప్పస్వామి ,  పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు.* ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు , రామకృష్ణ పరమహంస , స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి *‘ఫల్గుణ’* అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు , ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు , దుర్యోధనుడు , దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.


*ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన*


*శ్లో || నరాడోలా గతం దృష్ట్యా గోవిందం         పురుషోత్తమం !* 


*ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్ !!*


శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే , ఆ మాసాన్ని *‘ఫాల్గుణి’* గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు *‘పయోవ్రతం’* విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.


సమీపంలోని నదుల్లో స్నానమాచరించి , సూర్యుడికి అర్ఘ్యమిచ్చి , విష్ణువును షోడశోపచారాలతో పూజించి , పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు , పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. 


ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ , ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి , చతుర్థినాడు అవిఘ్న , పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు.


ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు. దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి , ఆ చెట్టు వద్దనే *‘అమలక ఏకాదశి’* వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని *‘అమృత ఏకాదశి’* గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ , హోలికా పూర్ణిమ , కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి - కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు , మన్మథుడు , కృష్ణుడు , లక్ష్మీదేవి పూజలందుకుంటారు.


ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు *‘సంకట గణేశ’* వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి , సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి , అన్నదానం చేస్తారు.


*ఫాల్గుణ మాస ప్రాశస్త్యం*


పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు , పండుగలూ , ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్తరూపం ఈ మాసం.

ఈ మాసాధిపతి గోవిందుడు కావున , ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోః – వేదాలు , గోవులు విందః – రక్షించేవాడు గోవిందుడు , అంటే ఈ సమస్త జీవకోటికీ పూజనీయమైన వేదాలను , గోవులను రక్షించేవాడు అంతేకాకుండా మనలని రక్షించి ఆత్మతత్త్వాన్ని తెలియచేసేవాడు. ఈ మాసంలో అచ్యుత , అనంత , గోవింద అనే నామస్మరణ ఎంతో శుభఫలితాన్ని ఇస్తుంది. వసంతఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతీ దినమూ ప్రత్యేకమే.ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు , పర్వ దినాలూ , విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


*ఫాల్గుణ శుద్ధ పాడ్యమి* మొదలు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ *పయోవ్రతం* ఆచరిస్తారు. భాగవతం అష్టమ స్కందం ప్రకారం , బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అదితి , కశ్యపుణ్ణి బలి గర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా , కశ్యపుడు ఈ *పయో వ్రతాన్ని* ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందింది. ఈ వ్రతంలో ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకూ లక్ష్మీ నారాయణులని షోడశోపచారాలతో పూజించి , కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి , బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో , వస్త్ర , ధన , దానాలు శక్తి కొలదీ చేస్తారు.


*ఫాల్గుణ మాసం శుద్ధ విదియ* నుండీ *యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.*


*ఫాల్గుణ శుద్ధ చవితి* రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి , సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి , ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.


ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి రెండు రోజులూ స్వామివారికి శ్రీరాముడు , శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత మూడురోజులూ శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తారు.


*ఫాల్గుణ శుద్ధ నవమి* నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.


*అమలక ఏకాదశి* ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక లేదా ధాత్రీ ఫలం గా పిలుచుకునే ఉసిరిని విష్ణుస్వరూపంగా భావించి ఈనాడు ఉసిరివృక్షం క్రింద శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం. ఈరోజు ఏకాదశీ వ్రతం ఆచరించి , విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభపలితాన్నిస్తుంది.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి , నృసింహ ద్వాదశి అంటారు. ఈ నాడు గంగాస్నానం పవిత్రం. కుదరని వారు సమీపం లోని ఏదైనా నది వద్దకు వెళ్లి , గంగను స్మరిస్తూ నదీస్నానం చేయాలి. నృసింహకరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి.


*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మహా పూర్ణిమ , హోళికా పూర్ణిమ , డోలా పూర్ణిమ , కామదహనోత్సవంగా* వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు.


దక్షిణ భారత దేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు. శివకళ్యాణం అనే మహత్తరకార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి , తన మూడో నేత్రంతో భస్మం చేసిందీ ఈనాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెకొక్కదానికే అతడు కనిపించేలాగా వరము ఇచ్చాడు శివుడు. మనలో ఉన్న కామక్రోధాదులనే అరిషడ్వర్గాలని దహనం చేసి , ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ , శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేగాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకుని కూడా ఉత్సవం చేస్తారు.


ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో , అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి , తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది.


ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను , దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.


ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక , విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా , చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోలికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత (చూత కుసుమ భక్షణం) ను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా *డోలా పూర్ణిమ* చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు.


*ఫాల్గుణ బహుళ విదియనాడు* లక్ష్మీదేవి పాలకడలి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆరోజు కనకధారా స్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది.



*ఫాల్గుణ బహుళ అష్టమి*

రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేకమంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు.



*ఫాల్గుణ బహుళ అమావాస్య* రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృ దేవతలకి తర్పణాలు ఇస్తారు.

ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరచుకున్న ఫాల్గుణ మాసంలో , భక్తితత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమవుదాము.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image