నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందని ద్రాక్షగా మారిన వేళ

  అమలాపురం ఏప్రిల్ 30 (ప్రజా అమరావతి);

         నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందని ద్రాక్షగా మారిన వేళ


,వికాస సంస్థ వారి పాలిట దిక్సూచిగా ఉండి, జీవితాల్లో వెలుగు నింపుతూ ఆశాదీపంగా నిలుస్తోందని, రాష్ట్ర రవాణా శాఖ  మాత్యులు శ్రీ పినిపే విశ్వరూప్ అన్నారు. శనివారం స్థానిక  మిరియం డిగ్రీ కాలేజ్ నందు రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు శ్రీ పినిపే విశ్వరూప్ మరియు వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనలో వికాస సంస్థ కీలక భూమిక పోషిస్తోoదన్నారు. కష్టపడే మనస్తత్వం ఉన్నప్పుడే నిరుద్యోగ యువత ఆశించిన స్థాయికి చేరుకోగలదని అన్నారు. ప్రతి ఒక్కరు ముందుగా ఒక ఫ్లాట్ ఫాం ఏర్పరచుకొని కష్టపడే తత్వంతో అంచెలంచెలుగా ఎదగాలని సూచించారు.  ప్రస్తుత కోనసీమ జిల్లా కలెక్టర్ వారు ప్రైవేట్ రంగంలో నెలకి 12 లక్షలు ఉద్యోగాన్ని వదులుకొని ప్రభుత్వ సెక్టార్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయాలనే సంకల్పంతో నెలకు కేవలం లక్ష రూపాయల జీతానికి పనిచేస్తూ ఆదర్శంగా నిలిచారన్నారు.  తెలివితేటలకు ఆకాశమే హద్దని ప్రతి ఒక్కరూ తమ ప్రతిభ నైపుణ్యాలు ద్వారా ఉన్నతమైన స్థానాలను చేజిక్కించుకోవాలని ఆయన సూచించారు. ప్రైవేట్ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాటిని నిరుద్యోగ యువత అందిపుచ్చుకొని కష్టపడి గుర్తింపు తెచ్చుకొని జీవితంలో రాణించాలని అన్నారు. నిరుద్యోగ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఇంకా ఎక్కువగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్య నిర్మూలన కొరకు చారిత్రాత్మకంగా 140000 గ్రామ సహాయకులు, 250000 వాలంటీర్ పోస్టులు నియమించి  ఆదర్శంగా నిలిచిందన్నారు. పదో తరగతి నుండి పోస్ట్గ్రాడ్యుయేట్ వరకు చదువుకున్న వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పై, టెక్నాలజీ పైన ఆయా కంపెనీలకు అవసరమైన సాంకేతికత పైన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆయా కంపెనీలకు అవసరమైన ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన నిరుద్యోగ యువత దేశ అభివృద్ధిలో పాల్గొనడానికి వీలుగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్థానికంగా విచ్చేసిన కంపెనీల మానవ  వనరుల ప్రతినిధులను ఆయన అభినందించారు. వికాస సంస్థ నిరుద్యోగ యువత ఉద్యోగాల్లో నిలదొక్కుకోవడానికి ఎంతగానో శ్రమిస్తోoదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరుద్యోగ యువత తమ కాళ్ళపై తాము నిలబడి జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగంలో దిగ్గజాలైన సుమారు 27 కంపెనీల మానవ వనరుల ప్రతినిధులు వారి వారి కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించేందుకు స్థానికంగా రావడం జరిగిందని పేర్కొన్నారు. అర్హత కలిగిన కంపెనీల్లో ఉద్యోగాలలో నిలదొక్కుకునేందుకు వికాస సంస్థ కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఉద్యోగాలు పొందిన యువత యొక్క యోగక్షేమాలను నిరంతరాయంగా పర్యవేక్షించడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే కంపెనీ ప్రతినిధితో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాలో 1150 వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని నిరుద్యోగ యువత సద్వినియోగ పరచుకోవాలని ఆకాంక్షించారు. భారతదేశంలో 18 - 45 మధ్య వయసుగలవారు 50 శాతం మంది ఉన్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కెపాసిటీ బిల్డింగ్ కొరకు ఫోకస్ పెట్టి, జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తూ యువతకు ఉద్యోగ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నాయన్నారు. నైపుణ్యాభివృద్ధి కొరకు యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు యోచన చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఇంటర్వ్యూ సమయాలలో అధికారులు అడిగిన ప్రశ్నలను సావధానంగా విని సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంటర్వ్యూలో తెలియని విషయాలను భవిష్యత్తులో నేర్చుకుంటానని సవినయంగా తెలపాలని సూచించారు.  ప్రైవేట్ రంగంలో ఎంట్రీ సులభతరమైన టార్గెట్లు కచ్చితంగా సాధించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ సెక్టార్లో కష్టపడి పని చేస్తే మంచి గుర్తింపుతో రాణించవచ్చునని, నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ యువత రాణించేలా ప్రతిభ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.  ప్రైవేట్ రంగంలో పేరు ప్రఖ్యాతులు గల కంపెనీలలో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సాంకేతికతను ముందుగానే అలవర్చుకొనేందుకు వికాస సంస్థ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో శిక్షణ ఇప్పించడం  జరుగుతుందని, ఆయా ట్రైనింగ్ లను సద్వినియోగ పరచుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు సేవా రంగాల సమన్వయంతో సరైన శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వికాస సంస్థలు పాటుపడుతున్నాయన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ మాట్లాడుతూ కోనసీమ జిల్లా ఏర్పడిన తరువాత మొట్టమొదటి మెగా జాబ్ మేళా ఇదేనన్నారు. నిరుద్యోగ యువత కంపెనీలకు అవసరమైన సామర్థ్యాలను శిక్షణ ద్వారా పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. చదువుకోవాలనే ఆశక్తి ఉన్నా, తండ్రి సంపాదన సరిపోక ,ఆర్థిక పరిస్థితులు అనుకూలించక మధ్యలో చదువులు  మానేసిన నిరుద్యోగ యువత ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థను స్టాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పాటు పడుతోందన్నారు. ఒకవైపు ఉద్యోగాలు అవసరం, మరోవైపు తగిన అభ్యర్థులు దొరక్క కార్పొరేట్ సంస్థలు సతమత మవుతున్నాయని, ఈ రెంటినీ బేరీజు వేసి, నేటి ఆధునిక కార్పొరేట్ అవసరాలకు తగిన విధంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందనన్నారు. తద్వారా ఈ శిక్షణలు  ఉద్యోగ, స్వయం  ఉపాధి అవకాశాలకు ఆలంబనగా మారాయన్నారు. 

పి. గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కష్టపడి  ఒక ప్లాట్ పారాన్ని మొదటగా వచ్చిన ఉద్యోగం ద్వారా ఏర్పర్చుకొని కష్టపడే మనస్తత్వంతో పని చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ జీవితంలో స్థిరపడాలని అన్నారు. ఏ ఉద్యోగానికైనా భావవ్యక్తీకరణ, కంప్యూటర్ పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరమని వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల వాటిని నిరుద్యోగ యువత అందిపుచ్చుకోలేక  పోతున్నారన్నారు. పీజీ డిగ్రీ ఉన్నప్పటికీ భాషా పరిజ్ఞానం భావవ్యక్తీకరణ, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే ఏ సంస్థ కూడా ఉద్యోగంలోనికి తీసుకోదన్నారు. కావున నిరుద్యోగ యువత నైపుణ్యాలకు పదును పెట్టి ఉద్యోగావకాశాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ మెగా జాబ్ మేళాలో వికాస పి డి . కె లచ్చా రావు వారి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments