నెల్లూరు, ఏప్రిల్ 30 (ప్రజా అమరావతి): యువత అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో భాగస్వాములు కావాలని
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం సాయంత్రం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో తాము అనుకున్న లక్ష్యం, గమ్యం చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం విద్యార్థి జీవితమని, ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం మన కనీస బాధ్యత అని, వారికి మంచిపేరు తీసుకురావడంతోనే అది సాకారం అవుతుందన్నారు. డబ్బులు, హోదాలు ఎప్పుడు మనిషికి సంతోషం ఇవ్వలేవని, విద్యలో రాణిస్తే విద్యా మైదానంలో అందరూ విజేతలేనన్నారు. విద్యాలయంలో హాస్టల్, తరగతి గదులు, నీటి సౌకర్యం ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
ముందుగా మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డిని విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య సుందరవల్లి, రిజిస్టార్ శ్రీ ఎల్ విజయ కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య సుజ ఎస్ నాయర్, కోఆర్డినేటర్ ఎం హనుమారెడ్డి, అధ్యాపకులు మధుమతి, కిరణ్మయి, విజయ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment