రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)

 

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 

దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)


అమరావతి, ఏఫ్రిల్ 13 (ప్రజా అమరావతి):   రాష్ట్ర  రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.170  కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి  మంత్రి తొలి సంతకం చేశారు. కృష్ణా జిల్లాలోని ఏటిమొగ-ఎదురుమొండి ఐలెండ్ను అనుసందానం చేస్తూ ఒక బ్రిడ్జిని, జగ్గయ్యపేట-సత్తెనపల్లి మధ్య మరో బ్రిడ్జి నిర్మాణానికి  తమ తొలి సంతకం చేసినట్లు మంత్రి తెలిపారు.  శ్రీ దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) రాష్ట్ర  రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఆయనకు పుష్పగుచ్చాలను అందచేస్తూ అభినందలు తెలిపారు. తదనంతరం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఇ.ఎస్.సి. (అడ్మిన్) వేణుగోపాల రెడ్డి, సి.ఇ.లు నయాముల్లా, రమేష్ కుమార్ తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. 

 ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ  గౌరవ ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మరియు ఆ భగవంతుని దీవెనలతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని రోడ్లు అన్నింటిని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి  ఇప్పటికే తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను నాబార్డు ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ అసిస్టెంట్ (NIDA) పథకం క్రిందకు తీసుకొచ్చి అభివృద్దికి చర్యలను చేపట్టడమైందన్నారు. ఈ పథకం క్రింద తొలిదశలో రూ.1,158 కోట్లతో పలు రోడ్లను అభివృద్దిచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రోడ్లు వేయడానికని రూ.3 వేల కోట్ల మేర నిధులను రుణంగా తీసుకువచ్చి, ఆ నిధులను రోడ్లు వేయడానికి ఉపయోగించకుండా ఎన్నికల్లో ఓటర్లకు తాయితాలు ఇచ్చేందుకు వెచ్చించడంవల్లే రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి బాగోపోవడానికి కారణమన్నారు. వారు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ  ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లే విధంగా గత ప్రభుత్వ పాలకులు ప్రవర్తిస్తున్నారన్నారు.  అయితే తమ ప్రభుత్వం ఆ రుణానికి ఒక ప్రక్క వడ్డీని చెల్లిస్తూ, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుతున్నారన్నారు.  రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని రోడ్లు అన్నింటినీ నాణ్యమైన ప్రమాణాలు ఉండే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  రోడ్లు, భవనాల శాఖకు చెందిన అధికారులు, పలువురు అనధికారులు పాల్గొన్నారు. 


Comments