చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత..*

 *చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత..* 

అమరావతి (ప్రజా అమరావతి);


Tdpలో చేరిన వైఎస్సార్‌సీపీ నేత కొండ్రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానం పలికిన అధినేత చంద్రబాబు. కొద్దిరోజుల క్రితం రాజంపేట జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలతో రగడ. కొండ్రెడ్డిపై కేసులు నమోదు. అధిష్టానం తీరుపై ఆగ్రహంతో టీడీపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా. ప్రత్యర్థులకు డిపాజిటి్ కూడా రాకుండా పనిచేయాలని పిలుపునిచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.


రాజంపేట జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత టీడీపీలో చేరారు. తంబళ్ల పల్లికి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. మద్దిరెడ్డి భార్య ప్రస్తుతం తంబళ్ల పల్లి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీగా ఉన్నారు. కొండ్రెడ్డి ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆయన తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ని ఈ సారి ఎన్నికల్లో ఓడిస్తామని కొండ్రెడ్డి అన్నారు.


పుంగనూరు, తంబళ్ల పల్లి నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ డిపాజిట్ రాకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి, తంబళ్ల పల్లిలో ద్వారకానాథరెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా పని చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఇప్పుడు దౌర్జన్యాలతో రాజ్యం ఏలుతున్న వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతే గట్టిగా సమాధానం చెబుతామన్నారు. చిత్తూరు జిల్లాలో 14 సీట్లూ గెలిచేలా పార్టీని సిద్ధం చెయ్యడంపై ఫోకస్ పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు.


కొండ్రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు సంచలనంరేపాయి. నియోజకవర్గంలో తాలిబన్‌ రాజ్యం నడుస్తోందని.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి వేధింపులు, అవమానాలే మిగులుతున్నాయన్నారు. ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనకు వ్యతిరేకంగా ఉండేవారిపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తనపై వరుసగా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఆ తర్వాత కొండ్రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లెని తాలిబన్ రాజ్యం చేశారని సొంత పార్టీ నేతనే ఆరోపించారని గుర్తు చేశారు. పాత కేసును తిరగదోడి ఉగ్రవాదిలా అరెస్ట్ చేయించడం వైసీపీ నేతల ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Comments