*- తెలుగుదేశం పార్టీకి కొడాలి నానితోనే సరిపోయిన మూడేళ్ళ కాలం*
*- ఎన్నికల వేళ అయోమయంలో మిగిలిన రెండేళ్ళు*
*- బాబును ఆ స్థాయిలో నిలువరించిన ఏకైక నేత కొడాలి నాని*
*- జగన్ ను తాకాలంటే ముందు కొడాలి నానిని దాటగలమా*
*- సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు*
*- ఆయన ప్రెన్మీట్ పెడితే వైసీపీ శ్రేణులకు ఆ కిక్కే వేరు*
*- టీడీపీ, అనుకూల మీడియాకు చుక్కలు చూపిన కొడాలి నాని*
*- తుప్పు, పప్పులంటూ బాబు, లోకేష్ ను డేమేజ్ చేశారు*
*- విస్తరణలో జగన్ పెట్టే గురిపైనే టీడీపి బోలెడు ఆశలు*
గుడివాడ, ఏప్రిల్ 8 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళ కాలంలో తెలుగుదేశం పార్టీ ముచ్చట అంతా రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తోనే సరిపోయింది. ఎన్నికల వేళ మిగిలిన రెండేళ్ళ పరిస్థితిపై టీడీపీ శ్రేణులు ఏటూ తేల్చుకోలేకపోతున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కొడాలి నాని ఎప్పటికపుడు తన వ్యూహాలను మార్చుకుంటూ వస్తున్నారు. చరిత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును స్థాయిలో నిలువరించిన ఏకైక నేతగా మంత్రి కొడాలి నాని నిలిచారు. మంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ లను నిన్నటి వరకు ఏకిపారేస్తూ వచ్చారు. దీంతో గత మూడేళ్ళుగా టీడీపీ చేస్తున్న యుద్ధం కనీసం సీఎం జగన్మోహనరెడ్డిని కూడా తాకలేదు. సీఎం జగన్ ను పార్టీ, ప్రభుత్వపరంగా ఇరకాటంలోకి నెట్టాలంటే ముందు అడ్డుగోడగా ఉన్న కొడాలి నానిని దాటగలమా, లేదా అనే సందిగ్ధంలో టీడీపీ శ్రేణులు కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన మూడేళ్ళలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అనే సందర్భాల్లో టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ లు చేసే విమర్శలు అన్నింటికీ మంత్రి కొడాలి నాని తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సాక్షిగా మీడియా సమావేశాలను నిర్వహించి తిప్పికొడుతున్నారు. కొడాలి నాని ప్రెస్మీట్ పెడుతున్నారంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులకు ఆ కిక్కే వేరు అన్నట్టుగా ఆ రోజంతా ఉంటుంది. అసెంబ్లీలోనూ, బయట కూడా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించే తీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో తిరుగులేని శక్తిగా ఎదిగేలా చేసింది. చంద్రబాబు చివరగా అసెంబ్లీలో తన భార్యను కించపర్చారంటూ చేసిన రాద్దాంతాన్ని మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో తిప్పికొట్టగలిగారు. జంగారెడ్డిగూడెం సహజ మరణాలపై కూడా అసెంబ్లీలో, బయట టీడీపీ శ్రేణులకు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇదిలా ఉండగా గత మూడేళ్ళ కాలంలో టీడీపీ అనుకూల మీడియాకు కూడా కొడాలి నాని చుక్కలు చూపించారు. సాక్షాత్తు ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 ఛానల్స్ అధినేతలు రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులపై మీడియా సాక్షిగా దుమ్మెత్తి పోశారు. వీరు నిర్వహించే ఛానల్స్, పత్రికలను ఎల్లో మీడియా, డబ్బా ఛానల్స్ అంటూ బహిరంగంగానే తిట్టిపోశారు. టీడీపీ అనుకూల మీడియాపై నేరుగా ఇంతటి స్థాయిలో విమర్శలు గుప్పించడం మంత్రి కొడాలి నానికే చెల్లిందని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయనను తుప్పుగా, లోకేష్ ను పప్పుగా అభివర్ణిస్తూ ప్రభుత్వంపై వారు చేసే విమర్శలను ప్రజాక్షేత్రంలోనే తిప్పికొడుతూ వచ్చారు. సీఎం జగన్మోహనరెడ్డిని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా టార్గెట్ చేయాలని చూసిన ప్రతిసారి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ వచ్చారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ప్రజలకు పదేపదే గుర్తుచేస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులే లోకేష్ ను మంగళగిరిలో ఓడించారంటూ మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలతో టీడీపీకి మింగుడుపడని పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, మూడవ తరానికి ద్రోహం చేస్తున్నారంటూ చంద్రబాబు చర్యలను ఎండగట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, సీఎం జగన్మోహనరెడ్డిపై మాట పడనివ్వని మంత్రి కొడాలి నాని టీడీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. టీడీపీ మాత్రం విస్తరణలోనైనా సీఎం జగన్మోహనరెడ్డి గురి తప్పుతుందేమోనని బోలెడు ఆశలతో ఎదురుచూస్తున్నట్టు స్పష్టమవుతోంది.
addComments
Post a Comment