ఈసారి యువతకు 40 శాతం సీట్లు ఇస్తా : చంద్రబాబు
అనంతపురం (ప్రజా అమరావతి): టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురంలో పర్యటించారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ ... అసెంబ్లీలో తనపై వ్యక్తిగత దూషణలు చేస్తే...శపథం చేసి బయటకు వచ్చానని, మళ్లీ సభను గౌరవ సభగా మార్చి సభకు వెళతానన్నారు. హంద్రీనీవా కాలువ పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు. హంద్రీనీవా పై సిఎం జగన్ గాలి మాటలు చెప్పలేదా ? అని అడిగారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసే ప్రయత్నం చేశానన్నారు. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారని ఆరోపించారు. అనంతపురం జిల్లా లో వేరుశనగ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని ఆవేదన చెందారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదని, ఇన్స్యూరెన్స్ రావడం లేదని చెప్పారు. హంద్రీనీవా కోసం పయ్యావుల, భైరవానితిప్ప కోసం కాలువ శ్రీనివాసులు వెంటపడేవారని తెలిపారు. క్రమశిక్షణ లేని ఇల్లు మనుగడ సాగించలేదనీ... పార్టీ కూడా అంతేనని అన్నారు. పార్టీలో ఎవరైనా విచ్చలవిడిగా మాట్లాడితే తాను కఠినంగా ఉంటానని చంద్రబాబు హెచ్చరించారు. కార్యకర్తలు పార్టీకి లాయల్ గా ఉండాలని కోరారు. పార్టీని నిలబెట్టేది వాళ్లేనన్నారు. కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరనీ..అలాగే కమిటీ వాళ్ల పని వాళ్లు చేయాలని సూచించారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. సమర్థత, పని తీరు చూసి ముందుగా ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబు వెల్లడించారు. పులివెందుల బస్ స్టాండ్ కట్టలేని జగన్....మూడు రాజధానులు కడతారా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసిపి దొంగ ఓట్ల పై క్యాడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ నాయకులు తన చుట్టూ తిరిగితే లాభం లేదనీ....కార్యకర్తల కోసం పని చేయాలని సూచించారు. ఈ సారి యువతకు 40 శాతం సీట్లు ఇస్తానని...కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ అవకాశం ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. తన వయసు 72 ఏళ్లు కానీ 27 ఏళ్ల వాడిలా పని చేస్తానని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ అనే యాప్ ను ప్రారంభిస్తున్నానని తెలిపారు. కార్యకర్తలకు వైద్యం కోసం ప్రముఖ అసుపత్రులతో ఒప్పందం చేసుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు.
addComments
Post a Comment