జపాన్ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామా : ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది

 






*త్వరలో ఏపీలోని జపాన్ కంపెనీ సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం*


*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జపాన్ లో రోడ్ షోకు ప్రణాళిక*


*ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాదిని కలిసిన జపాన్ ప్రతినిధులు*


*జపాన్ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామా :  ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది


*


అమరావతి, మే, 13 (ప్రజా అమరావతి): ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాదిని  జపాన్ కి చెందిన ప్రతినిధులు కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జపాన్ లో రోడ్ షో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు ఈడీబీ సీఈవో వెల్లడించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని జపాన్ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. జపాన్ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామాగా నిలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. అందుకు తగ్గట్లు త్వరలోనే పరస్పర అవగాహన ఒప్పందం దిశగా కలిసి ముందడుగు వేయనున్నట్లు వారు పేర్కొన్నారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలందించే  అంశంపై జపాన్ ప్రతినిధులు ప్రధానంగా ఏపీఈడీబీ సీఈవోతో చర్చించారు. 


యొకొహమ పరిశ్రమ ఆధ్వర్యంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యమైందన్నారు. నైపుణ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర యువతను పరిశ్రమలకు కావలసినట్లుగా తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకువెళుతున్న తీరు, విధానాలను సుబ్రమణ్యం జవ్వాది వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో  నైపుణ్య వనరులకు కొదవ లేదని, స్కిల్ గ్యాప్ ఉన్నచోట పరిశ్రమలు కోరినట్లు ఉచిత శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు కావలసినట్లు ప్రభుత్వమే తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జైకా, జెట్రో వంటి జపాన్ సంస్థలతో కలిసి ప్రయాణిస్తున్న విషయాన్ని ఈడీబీ సీఈవో ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీ సిటీకి 25 కి.మీ దూరంలో ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ (జిట్) ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకే ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ వెసులుబాటుతో పాటు శ్రీ సిటీలో జపనీస్ భాష అనువాదకులను కూడా ఏర్పాటు చేసినట్లు ప్రస్తావించారు. కోవిడ్ పరిస్థితులను ఏపీ, భారత్ ఎదుర్కొన్న తీరును సుబ్రమణ్యం జవ్వాది చర్చించారు.


 భారత్ లో జపనీస్ కు చెందిన 1400 కంపెనీలు ఏర్పాటయ్యాయని ఎంయూఎఫ్ జీ బ్యాంకు చెన్నై బ్రాంచ్ అధ్యక్షులు హెడ్ యుకిహిరో వెల్లడించారు. దక్షిణ  భారత్ లో వాణిజ్యపరంగా ఏపీ అన్నింటికి అనువైన రాష్ట్రంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


   మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంయూఎఫ్ జీ బ్యాంకు చెన్నై బ్రాంచ్ అధ్యక్షులు హెడ్ యుకిహిరో,  ఢిల్లీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు  కజుయోషి షిబటని , జపనీస్ కార్పొరేట్ బ్యాంకింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ లు  సహిల్ అగర్వాల్, సందీప్ వర్మ, ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్ హాజరయ్యారు.



Comments