తిరుపతి (ప్రజా అమరావతి);
*జగనన్న విద్యాదీవెన– పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.*
*జనవరి– మార్చి 2022 త్రైమాసికానికి దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ.709 కోట్లను తిరుపతిలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*పద్మావతి చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం*
*తిరుపతి శ్రీనివాస సేతును ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
*మంచి కార్యక్రమం...*
దేవుడి దయతో ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడకు వచ్చిన అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
*పెద్ద చదువులు– చరిత్ర మార్పు..*
ఈ రోజు శుభదినం. దేవుడి దయతో 10.85 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... 9.73 లక్షల మంది పిల్లల తల్లుల ఖాతాల్లోకి నా ప్రసంగం పూర్తైన వెంటనే బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తాను.
పెద్ద చదువులు అనేవి మనిషి చరిత్రనే కాకుండా, కుటుంబ చరిత్రను, ఒక సామాజిక వర్గ చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రనే కాకుండా, దేశ చరిత్రనే మారుస్తాయి. ఈ రోజు మీ అందరి శ్రేయోభిలాషిలా ఈ గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం దేవుడు నాకిచ్చిన అదృష్టం.
*చదువు – పిల్లలకిచ్చే గొప్ప ఆస్తి....*
చదువులు అనేవి మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి. ఏదైనా ఎవరైనా కానీ దొంగతనం చేసుకుపోవచ్చు కానీ, చదువు అనేది మాత్రం ఎవరూ దొంగతనం చేయలేని ఆస్తి. మన తలరాతలను మార్చే శక్తి ఈ చదువుకు మాత్రమే ఉందని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. ఈ రోజు దేవుడి దయతో జగనన్న విద్యాదీవెన అనే గొప్ప పథకానికి శ్రీకారం చుట్టాం.
గతంలో చూస్తే.. ఆ రోజు నాన్నగారు (దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖర్రెడ్డి) హయాంలో మాత్రమే పిల్లల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం మనకు కనిపించింది. ఆ రోజుల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలయ్యేది. ఆతర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఇవ్వాలి? ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు? తల్లిదండ్రులు కష్టనష్టాలు ఏంటి? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ... అని ఆలోచన చేసిన వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నీరుకారుస్తూ వచ్చాయి.
*ఫీజు రీయింబర్స్మెంట్ – విప్లవం*
ఈ రోజు ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మార్పు చేసి గొప్ప విప్లవం తీసుకొచ్చాం. నాన్నగారు ఆ పేదపిల్లల గురించి, ఆ అక్కచెల్లెమ్మల గురించి, తల్లిదండ్రుల గురించి ఒక్క అడుగు ముందుకు వేస్తే.. ఆ తండ్రికి తగ్గ కొడుకుగా... నేను నాలుగు అడుగులు వేస్తున్నాను. మన సమాజ గతినే మార్చగలిగే, పేదరికం నుంచి బయటకు తీసుకుని రాగలిగే చదువులనే మహా విప్లవాన్ని మనం తీసుకు వచ్చాం.
*నా పాదయాత్రలో కళ్లారా చూశా:*
చదువుల విప్లవాన్ని దెబ్బతీయడానికి గతంలో ఎన్నెన్నో ప్రభుత్వాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాయి. పెద్దచదవులు చదువుతున్న పేద విద్యార్థులు, వారి కుటుంబాల క్షోభను ఏ ఒక్కరుకూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే క్షోభను 3648 కిలోమీటర్ల సాగిన నా పాదయాత్రలో నా కళ్లారా చూశాను. ఎప్పుడు విద్యాదీవెన , వసతి దీవెన గురించి మాట్లాడాల్సిన వచ్చినా...నా కళ్లెదుట కనిపించిన ఆ ఘటనలు నేను ఎప్పుడూ మర్చిపోలేను.
ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు, అప్పులు పాలవుతున్న పరిస్థితిని చూడలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నఘటనలు ఇవన్నీ నా పాదయాత్రలో నా కళ్లముందే చూశాను.
*అలాంటి పరిస్థితులు రాకూడదని...*
అటువంటి పరిస్థితులన్నీ ఇకమీదట రాకూడదని... గడిచిన మూడు సంవత్సరాలుగా పూర్తిగా 100 శాతం పూర్తి ఫీజురీయింబర్స్మెంట్... జగనన్న విద్యాదీవెన కార్యక్రమం అమలు చేస్తున్నాం. విద్యాదీవెన అన్న పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకొచ్చిన మార్పులు, వాటిద్వారా వచ్చిన ఫలితాలు గురించి మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను.
*ప్రతి త్రైమాసికం పూర్తైన వెంటనే ఫీజు....*
ఈ రోజు ప్రతి అడుగులోనూ ఆ పిల్లలకు అండగా, తోడుగా నిలబడుతున్నాం. క్రమం తప్పకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకు ఇవ్వడమే కాకుండా.. .ఇచ్చే సొమ్మును పిల్లల తల్లుల చేతుల్లో పెడుతున్నాం. అంతే కాకుండా ప్రతి త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజును చెల్లిస్తున్నాం. ఈ రోజు జనవరి– మార్చి త్రైమాసికానికి సంబధించి... దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులుకు చెందిన 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.709 కోట్లు తిరుపతి వేదికగా బటన్ నొక్కి బదిలీ చేస్తున్నాం.
*కుటుంబాల తలరాతలు మారే రోజులు...*
ఇప్పటివరకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కేవలం ఈరెండు పథకాలకే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా దాదాపుగా రూ. 11వేల కోట్లు ఇవ్వగలిగాం. రాష్ట్రంలో పిల్లల చదువుల బాధ్యతను మీ అన్న, మీ తమ్ముడి ప్రభుత్వం తీసుకుంది. ఈ సొమ్మను మన పిల్లల మీద మనం పెడుతున్న పెట్టుబడిగానే భావిస్తున్నాం. ఈ పెట్టుబడి వల్ల భవిష్యత్తులో పిల్లల తలరాతలు మారుతాయి. కుటుంబాల తలరాతలు మారుతాయి. ఆ కుటుంబాలన్నీ పేదరికం నుంచి బయటకి వస్తాయి. ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, కలెక్టర్ వంటి పెద్ద చదువులు చదువుతున్న పరిస్థితులు వస్తాయి. వారి తలరాతలు మారే రోజులూవస్తాయి. నిండు మనస్సుతో ఈ బాధ్యతను నెరవేరుస్తుండడం చాలా సంతోషాన్ని ఇస్తోంది.
పేద కుటుంబంలోని పిల్లల చదువులకు మనందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి, గత ప్రభుత్వం ఇచ్చిన ఇదే పేద పిల్లల చదువులకోసం ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి ? అని ఆలోచన చేయమని అడుగుతున్నాను ?.
మనం చేస్తున్న మేలు ఏమిటి ? మనల్ని విమర్శిస్తున్నవారు చేసిందేమిటి ? అని ఆలోచన చేయమని అడుగుతున్నాను.
*గతానికి , ఇప్పటికీ మధ్య తేడా ప్రస్ఫుటంగాచూపిస్తూ మిమ్నల్నే కొన్ని ప్రశ్నలడుగుతాను. సమాధానాలు మీరే చెప్పండి. అవునో, కాదో మీరే చెప్పండి.*
(ముఖ్యమంత్రి ప్రశ్నలకు అక్కడకు వచ్చిన వారంతా తమ స్పందనను తెలియజేశారు)
1. గత ప్రభుత్వంలో వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్న జగనన్న విద్యాదీవెన వంటి ఏ పథకమైనా అమలు అయిందా ?
అరకొరగా ఫీజులు ఇచ్చారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడూ లేవు. ఫీజు రియింబర్స్మెంట్కు సంబంధించి 2017–18, 2018–19 కి సంబంధించిన రూ.1778 కోట్ల రూపాయలు బకాయిలు కట్టకుండా గాలికి వదిలేస్తే.. వాటిని సైతం మన ప్రభుత్వం కట్టింది.
2. క్రమం తప్పకుండా ఎప్పుడూ మిస్ కాకుండా... పెద్దచదువులు చదువుతున్న మనపిల్లలకు వసతి, భోజనం కోసం ఆలోచన చేసి ఇంతస్థాయిలో జగనన్న వసతి దీవెనలాంటి పథకం గతంలో చంద్రబాబు పాలనలో ఏనాడైనా అమలు అయ్యిందా ? అని అడుగుతున్నాను.
గతంలో ఫీజులకే దిక్కులేకపోతే..., ఆ పిల్లల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఆలోచన చేసే పరిస్థితులు ఉంటాయా?
3. మన కాలేజీల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ?మన పిల్లలు చదివే చదువులు ఎలా ఉన్నాయా ? జాబ్ ఓరియెంటెడ్గా చదువులు ఉన్నాయా ? లేవా ? ఏ మార్పులు చేయాలి ? అని ఇటువంటి ఆలోచనలు ఒక్కరోజైనా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చేశారా ? చేసిన దాఖలాలు ఉన్నాయా ? అని ప్రశ్నిస్తున్నాను.
గతంలో పిల్లల చదువుల భారాన్ని ఎలా తగ్గించుకోవాలి అన్న దిక్కుమాలిన ఆలోచన చేశారే తప్ప, వారి చదువులు ఎలా సాగుతున్నాయి ? మన కాలేజీలలో పిల్లల చదువులు ఎలా ఉన్నాయి ? వాటిని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులగా చేద్దామన్న ఆలోచనలు ఏ రోజూ చేసిన పరిస్థితులు లేవు.
4. బాబు పాలనలో గవర్నమెంటు స్కూళ్లల్లో సదుపాయాల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా ? ఒక్కసారి ఆలోచన చేయండి అని అడుగుతున్నాను. గవర్నెమెంటు బడులను పూర్తిగా మార్చివేసే నాడు–నేడు లాంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు హయాంలో ఏరోజైనా జరిగిందా అని ప్రశ్నిస్తున్నాను.
కారణం ప్రభుత్వ స్కూళ్ల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవు.. ఎప్పుడెప్పుడు వాటిని మూసేయాలి, మూసేస్తే మనకు భారం తగ్గుతుంది, పిల్లలు, తల్లిదండ్రులు వారి చావు వారు చస్తారు, వాళ్లే ప్రైవేటుగా ఫీజులు కట్టుకుని వాళ్ల బాధలు వారే పడతారు అన్న ఆలోచన చేసే దిక్కుమాలిన రోజుల నుంచి ఈరోజు మన పిల్లలు బాగా చదవాలి, ఆ భారం తల్లిదండ్రులమీద పడకూడదని ఆలోచనే చేసే రోజులు ఇవాళ కనిపిస్తున్నాయి.
5. ఇంగ్లిషు మీడియం చదవులు బాబు హయాంలో ఉన్నాయా ?
ఇంగ్లిషు మీడియంలో చదవడం మొదలుపెడితే ఎక్కడ ఈ పిల్లలు చంద్రబాబునాయుడు గారిని ప్రశ్నిస్తారేమోనని భయపడిపోయి... మన పేద పిల్లలు ఎప్పుడూ కూడా తెలుగుమీడియంలోనే చదవాలి, చంద్రబాబునాయుడు గారి లాంటివాళ్లకు అణిగిమణిగి ఉండాలని చేసే గత ప్రభుత్వపు దిక్కుమాలిన ఆలోచనలకు, ఈరోజు మన ఆలోచనలకు తేడా ఎంతుందో ఆలోచన చేయమని కోరుతున్నాను.
6. ఇంకో ప్రశ్న నేరుగా మిమ్నల్నే అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి లాంటి పథకం ఎక్కడైనా ఉందా? అని అడుగుతున్నాను.
కేవలం పిల్లలను చదువులు బాట పట్టించండి... మీకు తోడుగా మీ అన్న ఉన్నాడని భరోసా ఇస్తూ... పిల్లలను చదువుల బాట పట్టించిన ప్రతి తల్లికి కూడా రూ.15వేలు అందించిన చరిత్ర ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా ?అని ఆలోచన చేయమని మిమ్నల్ని అడుగుతున్నాను.
చదివించే తల్లుల కష్టమేమిటో.. పేదింటి పిల్లలు మ«ధ్యలో ఎందకు చదువులు మానేస్తున్నారో ఏనాడైనా ఆలోచన చేసిన చరిత్ర గత పాలకుల్లో ఉండేదా అని మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతున్నాను.
7. పిల్లలకు యూనిఫామ్, షూస్, సాక్స్, బైలింగువల్ టెక్ట్స్బుక్స్, మన పిల్లలకు ఇంగ్లిషు ఇంకా బాగా అర్ధం కావాలి, ఇంకా మెరుగ్గా తయారవ్వాలని డిక్షనరీ, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగు ఇటువంటివి అన్నీ కలిపి జగనన్న విద్యాకానుక మాదిరిగా ఎప్పుడైనా సరిగ్గా స్కూల్ తెరిచే సమయానికి గతంలో ఏనాడైనా ఇచ్చారా ? ఆని ఆలోచన చేయమని మీ అందరినీ అడుగుతున్నాను ?
గతంలో పాఠ్యపుస్తకాలు ఎప్పుడొచ్చేవో తెలుసా ? స్కూలు తెరిచిన ఆరేడు నెలలు పట్టేవి. అవి కూడా ఒక్కోక్కసారి కొన్ని సబ్జెక్టుల టెక్ట్స్ బుక్స్ వచ్చేవి, కొన్నింటికి టైం పట్టేది. ఇటువంటి దారుణమైన పరిస్థితి.
*8. మధ్యాహ్న భోజన పథకం...*
ఆ రోజుల్లో మధ్యాహ్న భోజన పథకానికైతే ఎనిమిది, తొమ్మిది నెలలు పై చిలుకు బకాయిలు. పిల్లలు ఎప్పుడెప్పుడు చదువులు మానేసి పోతారు? బడులకు రాకుండా పోతారు ? అలా పోతే మంచిది అనుకునే ప్రభుత్వ పనితీరు. ఈరోజుకి, ఆ రోజుకి ఎంత తేడా ఉందో ఆలోచన చేయండి.
గత పాలనలో ఏనాడైనా కూడా మన పిల్లలు ఏం తింటున్నారు.? దాన్ని ఎలా మెరుగుపర్చాలి అని గత పాలనలో ఏనాడైనా మెనూ మార్చి .. రోజుకొక మెనూతో మంచి పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించాలన్న ఆలోచనే గతంలో ఏరోజైనా చేశారా ?
*ఈ రోజు గోరుముద్ద అన్న పథకం తీసుకొచ్చాం.*
గతంలో మధ్యాహ్న భోజనానికి ఖర్చయ్యేది రూ. 600 కోట్లు. ఈ రోజు జగనన్న గోరుముద్దకు ఖర్చవుతుంది రూ.1900 కోట్లు. ఎంత తేదా ఉందో ఆలోచన చేయండి.
ఇవేవీ కూడా బాబుగారు పాలనలో లేవు. మన పాలనలో కనిపిస్తున్నాయి.
*మన పాలనలో కేవలం విద్యారంగం మీద అంటే పిల్లలకు చదువులకు ఉపయోగపడే పథకాలమీద 35 నెలల కాలంలో ఎంత వ్యయం చేశామో క్లుప్తంగా నాలుగు మాటల్లో చెప్తాను.*
మనబడి నాడు–నేడు మొదటి విడతలో 15,715 స్కూళ్ల రూపురేఖలు మార్చడం కోసం రూ.3698 కోట్ల రూపాయలు ఖర్చుచేశాం.
రెండోదశ కింద ఇవాళ 26,451 స్కూళ్లలో జరుగుతున్న నాడునేడు కోసం రూ.8 వేలకోట్లు ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టాం.
జగనన్న విద్యా కానుక ద్వారా 47.32 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ ఇప్పటివరకూ రూ.1500 కోట్లు పైనే ఇచ్చాం. ఈ యేడు విద్యాకానుక కింద స్కూల్ తెరిచే రోజునే పిల్లలకు ఇచ్చే విద్యాకానుకకు మరో రూ.900 కోట్లు పెడుతున్నాం.
జగనన్న గోరుముద్ద కింద మార్చిన మెనూతో 44 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ.... కోవిడ్ సమయంలో కూడా పిల్లలకు మంచి చేస్తూ వారు ఏం తింటున్నారో ఆలోచన చేశాం.ఆ పిల్లలు ఇవాళ ఏం తింటున్నారు, రేపు ఏం తినాలి ? అని ఒక ముఖ్యమంత్రి ఇంతగా ఆలోచన చేసిన చరిత్ర లేదు. అంత లోతుగా ఆలోచన చేసి, జగనన్న గోరుముద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి గతంలో రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితుల నుంచి రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
వైఎస్సార్ సంపూర్ణ పోషణం ద్వారా 34.20 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు, ఆరు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు కూడా వారు సరిగ్గా తినకపోతే వాళ్ల మెదడు సరిగ్గా పెరగదు, దానివల్ల తల్లులు ఇబ్బంది పడతారు.. ఆ పరిస్థితి ఆ పిల్లలకు, తల్లులకు రాకూడని చెప్పి వారి గురించి కూడా ఆలోచనే చేసి, వైయస్సార్ సంపూర్ణ పోషణం పథకం తీసుకొచ్చాం. గతంలో రూ. 5 నుంచి 6 వందల కోట్లు ఖర్చు చేస్తున్న పథకానికి ఏడాదికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తూ... ఇప్పటివరకూ 35 నెలల్లో రూ. 4,900 కోట్లు వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి ఖర్చు చేశాం.
ఈ రోజు రూ.709 కోట్లతో జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండు పథకాలకు రూ. 10,994 కోట్లు ఖర్చు చేసాం.
ఈ 35 నెలల కాలంలో జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి ఖర్చు చేసింది రూ.13,023 కోట్లు చేస్తే..రేపు జూన్ నెలలో అమ్మఒడికి మరో రూ.6400 కోట్లు ఇవ్వనున్నాం.
ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నాం కాబట్టే.. ఈరోజు రాష్ట్రంలో మార్పు కనిపిస్తోంది.
*చంద్రబాబు హయాంలో...*
చంద్రబాబు హయంలోప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 10వతరగతి వరకు చదివే మొత్తం పిల్లల సంఖ్య( 2018–19) 70.43 లక్షల మంది ఉంటే... ఈరోజు ఆ సంఖ్య 73 లక్షలకు చేరింది. ఇక కేవలం ప్రభుత్వ స్కూల్స్ తీసుకుంటే... 2018–19 చంద్రబాబు హయాంలో ఆ సంఖ్య 37.20 లక్షలు అయితే ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పిల్లల సంఖ్య 44.39 లక్షల మంది.
ఈ రకమైన మార్పు ఆ తల్లులకు, ఈ రకమైన నమ్మకం, ఆత్మ విశ్వాసం పిల్లలకు ఎందుకు వచ్చాయో ఆలోచన చేయండి. ఈ రోజు నేను మాట్లాడుతున్నది విద్యారంగం గురించి అది కూడా మనందరి ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాలలో విద్యారంగానికి చేసిన మంచిలో కొన్నింటి గురించి మాత్రమే చెప్పాను.
*మనం ఇంతగా మంచి చేస్తున్నాం కాబట్టే.... వారికి కడుపు మంట, బీపీ:*
మనం ఇంతగా మంచి చేస్తున్నాం కాబట్టే కడుపు మంట కూడా ఎక్కువే. పళ్లున్న∙చెట్టు మీదనే రాళ్లు కూడా పడతాయి. ఇంతగా మంచి చేస్తున్నాం కాబట్టే.. ప్రజలందరి అభిప్రాయం ఒకరకంగా మనకు అనుకూలంగా ఉంటే.. దాన్ని జీర్ణించుకోలేక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈముగ్గురితో పాటు చంద్రబాబునాయుడు గారు ఈ నలుగురూ కలిసి ఒక సిండికేట్.
*అంతా కలిసి ఒక దొంగల ముఠా...*
దొంగలంతా కూడా కలిస్తే.. దుష్టచతుష్టయం అని మహాభారతంలో కూడా అంటాం. ఈ నలుగురిదీ అదే పరిస్తితి. మనం మంచి చేస్తుంటే వీళ్లకు కడుపుమంట. జీర్ణించుకోలేరు. ఆ కడుపు మంటలోనుంచి వక్రీకరణలు తీసుకువస్తారు. అబద్దాలు చెప్తారు. గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఒకే అబద్దాన్ని నలుగురూ కలిసి వందసార్లు చెప్పిందే చెప్పి, అది నిజమని చెప్పి ప్రజలను నమ్మించే కార్యక్రమం, ప్రయత్నం ఈ దుష్టచతుష్టయం చేస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు ఈ విషయాలు మీ అందరికీ చెపుతున్నాను అంటే.. .మంచి జరిగింది మీకు, ఆ మంచి ఏమిటో ఆ నిజాలు మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను.
*ఆ నిజాలేమిటో ఒక్కసారి చెప్తాను....*
వారు గుడులను ధ్వంసం చేస్తే.. మనం గుడులని కట్టాం.
వారు విగ్రహాలను విరిచేస్తే.... మనం విగ్రహాలను పెట్టించాం.
వారు రధాలను తగులబెడితే.. మనం రథాలను మళ్లీ నిర్మించాం.
వారు రైతులను కుంగదీస్తే... మనం మన రైతులను నిలబెడుతున్నాం.
వారు మన పల్లెలను దెబ్బతీస్తే... ప్రతి పల్లెలోకి కూడా ప్రభుత్వ సేవలను, గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకెళ్లాం. వాలంటీర్లు వ్యవస్ధ తీసుకొచ్చాం.
పూర్తిగా వికేంద్రీకరణచేసి గడప వద్దకే సుపరిపాలన తీసుకొచ్చే విధంగా దేశానికే మార్గనిర్దేశం చేశాం.
వారు మన బడిని, గవర్నమెంటు ఆసుపత్రిని అన్నింటినీ కూడా శిధిలావస్థకు తీసుకుని వస్తే.. ఈరోజు మనం వాటిని నాడు–నేడుతో ఆసుపత్రులు, స్కూళ్లను నిలబెడుతున్నాం.
వారు మన పేద పిల్లలు ఎదగకూడదు అని చెప్పి తెలుగుమీడియం మాత్రమే చదివించాలని ఎన్ని ఆటంకాలు కలిగించినా...మనం ఆ పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప విప్లవ పోరాటం చేస్తున్నాం.
*ఎన్నికల వేళలో కోటలు దాటే మాటలు వారివి....* *తీరా అధికారంలోకి వచ్చాక గడపకూడా దాటవు:*
ఎన్నికల వేళ వారి మాటలన్నీ కూడా కోటలు దాటుతాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఆ మాటలు నెరవేర్చారా ? లేదా ? అన్నది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి.
ఎన్నికలప్పుడు మాట ఇస్తారు.. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పనులు గడప కూడా దాటవు.
ఎన్నికలు అయ్యేవరకు మేనిఫెస్టో ప్రణాళిక. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ల మేనిఫెస్టో చెత్తబుట్టలోనికి పోతుంది. ఎన్నికల తర్వాత వాళ్ల మేనిఫెస్టో ఎక్కడ ఉందో వెదికినా కూడా వాళ్ల ఇంటర్నెట్లో, వెబ్సైట్లో కూడా దొరకని పరిస్థితుల్లోకి వాళ్ల మేనిఫెస్టోను మాయం చేస్తారు.
*ఒక్కసారి ఆలోచన చేయండి...*
–మన పేదవాళ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల పట్ల అగ్రవర్ణాల్లోని మన పేదలన వాడుకునే కార్యక్రమం చేసారు. బలహీన వర్గాలు అంటే కేవలం ఓటుబ్యాంకుగా చూసిన ఆ రోజుతో, ఈ రోజును పోల్చిచూడండి.
నిండుమనస్సుతో కేవలం బటన్ నొక్కితే కాలు డీబీటీ ద్వారానే 35 నెలల కాలంలో రూ. 1,38,894 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించే గొప్ప పరిపాలన సాగుతుంది.
*లంచాలకు, వివక్షకు తావు లేకుండా....*
ఎక్కడా లంచాలకు, వివక్షకు తావులేదు. అలాంటి పరిపాలన సాగుతుంది. బటన్ నొక్కిన వెంటనే లంచాలు అడిగే వారు లేరు, మధ్యవర్తిత్వం లేదు. వాలంటీర్ నేరుగా ఇంటికొస్తున్నారు. తలుపు తట్టి చేయాల్సిన మంచి చేసి పోతున్నాడు. ఇదంతా ప్రతి ఒక్కరి కళ్లకూ కనిíపిస్తుంది. అమ్మలకు, అక్కచెల్లెమ్మలకు జరిగిన మేలు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది కాబట్టే..
చంద్రబాబుకు ఆ బాబును అధికారంతో పాటు గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబునాయుడును మోసి, ఆయనతో పాటు ఎదిగిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ నలుగురు కలిసిన దొంగల ముఠాకు కడుపుమంట, బీపీ మాత్రం రోజూ పెరుగుతూఉంది.
*మన పథకాలు ప్రజలు మర్చిపోవాలనే.....*
కాబట్టే విద్యావ్యవస్ధలో ఇన్ని గొప్ప మార్పులను పిల్లలకు, పిల్లలను బడికి పంపే తల్లుల కోసం మనం అమలు చేస్తున్న ఈ పథకాలను ప్రజలు మర్చిపోవాలని చెప్పి భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పేపరు తిరగేస్తే చాలు, ఉదయాన్నే టీవీ చూస్తే చాలు అబద్దాలు మీద అబద్దాలు.
విద్యాదీవెన పథకాన్ని నేను ఈ రోజు ప్రారంభిస్తున్నాను కాబట్టి... దుష్ప్రచారంతో గొప్ప మలుపు తిప్పారు. విద్యాదీవెన పథకం మనం ఇస్తామని తెలిసి, దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి సంబంధించిన, వారి హయాంలో మంత్రిగా పనిచేసిన వారి స్కూళ్ల నుంచి వారే వాట్సాప్ ద్వారా ఫోటోలు తీసుకుని, వాళ్లంతట వారే లీక్ చే యించే కార్యక్రమం చేసి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఇవన్నీ ఎవరు చేశారో తెలుసా ఈ పనులన్నీ రెండు నారాయణ, మూడు చైతన్య స్కూళ్లు చేశారు.
*ఎవరు ఆ నారాయణ అంటే ....* ఇదే చంద్రబాబునాయుడు గారి హయంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, స్కూళ్లు, కాలేజీలు నడుపుతున్న వ్యక్తి.. ఏకంగా వాళ్ల కాలేజీల్లో ప్రశ్నాప్రత్రాలను బయటకు తీసి వాట్సాప్లో దాన్ని ఫోటోతీయించి ఒక వ్యవస్ధను నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్లే నాశనం చేస్తారు. మరలా వాళ్లే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ.. దొంగే దొంగ అన్నట్టుగా వీళ్లంతట వీళ్లే ప్రశ్నాపత్రాలు లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడతారు. కారణం జగన్ ఈరోజు విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నాడు ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట. వీళ్లు కుళ్లు, కుతంత్రాలు ఏ స్ధాయికి పోతున్నాయో గమనించండి.
*అధికారంలోకి వచ్చిన వెంటనే 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు..*
మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 1.3 లక్షల మందికి దాదాపుగా శాశ్వత ఉద్యోగాలిస్తూ.. గ్రామ, వార్డు స్ధాయిలో సచివాలయాలును కూడా తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే కార్యక్రమాలు మనం చేస్తుంటే... దాన్ని చూడలేక ఇదే దుష్టచతుష్టయం ఆ రోజు కూడా ఏమందో మీరందరూ ఒక్కసారి గుర్తుకుతెచ్చుకొండి.
*ఆ రోజూ యాగీ...*
ఆ రోజు కూడా పేపర్ లీకని ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు రాకూడదని నానా యాగీ చేసిన సంగతి జ్ఞాపకం తెచ్చుకొండి. దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా మనందరి ప్రభుత్వం ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల చేతికి ఇచ్చి అందులో 18.40 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంటే ఆ జరిగిన మంచిని ఓర్చుకోలేని వీళ్లు.. వక్రబుద్ధితో ఆ లబ్దిదారులను కూడా రెచ్చగొట్టేలా తప్పుడు రాతలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్న పరిస్థితులను గమనించండి.
ఏ లబ్ధి చేయని ఈ ఎల్లో పార్టీ, దానికి మద్ధతుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఎల్లో మీడియా కలిసి... గుంటనక్కల కంటే హీనంగా మనం చేస్తున్న మంచిని ప్రజల్లోకి పోనియ్యకూడదని చెప్పి అడ్డుతగిలే కార్యక్రమం చేస్తున్నారు.
చివరికి టిడ్కో ఇళ్లను కట్టలేక వదిలేసిన వీళ్లు ఆ పేదలకు మనం ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తున్న విషయాలలో కూడా ఎలాంటి రాళ్లు వేస్తున్నారో గమనించండి.
*మంచికి పరదాలు కడుతూ...*
అక్కచెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచికి పరదాలు కట్టేందుకు.. అత్యాచారాలు అంటూ ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రచారాలు మొదలుపెట్టారు. నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. వారం, పదిరోజులగా చూస్తే.... ఎక్కడ చూసినా రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహిళా సంక్షేమంలో కానీ, ఆర్ధిక, రాజకీయ సాధికారితలోనైనా, మహిళల రక్షణ విషయంలో అయినా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, కాకుండా దేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వం చేయనంత చిత్తశుధ్దితో మీ అన్నగా, తమ్ముడిగా అడుగులు ముందుకు వేస్తున్నాను.
*జగన్ నిల్చిపోతాడని....*
ఎక్కడ అక్కచెల్లెమ్మల మనస్సుల్లో జగన్ నిల్చిపోతాడేమోనని చెప్పి.. బురద జల్లేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. మహిళల మీద నేరాలు జరగకుండా చూసేందుకు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్ తెచ్చాం. అది మన చేతుల్లో ఉంది. ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, ఆపదలో ఉన్నప్పుడు ఐదుసార్లు ఫోన్ని షేక్ చేసినా కేవలం పదినిమిషాలలోనే పోలీసులు మీ దగ్గరకు వస్తాడు. ఏం జరిగింది చెల్లెమ్మా అని అడుగుతాడు. అక్కచెల్లెమ్మలు ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఉంటే సాయం ఇది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇటువంటి మార్పులును వ్యవస్ధలోకి తీసుకొచ్చాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరుగుతున్న సంఘటనల మీద... దోషులెవరైనా కూడా ఎంతటి వారైనాసరే.. నిర్ధాక్షణ్యంగా చట్టాలను ప్రయోగిస్తున్నాం. వైఫల్యాలుంటే.... పోలీసులు అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే వదిలిపెట్టడం లేదు. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తున్నాం.
*స్పందన, దిశ యాప్ సహా...*
మనం అధికారంలోకి రాగానే ప్రారంభించిన స్పందన కార్యక్రమం కానీ, మనం ప్రతి బాలికకు, ప్రతి అక్కకు, చెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ద్వారా దిశ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయంతో సహా మనం ఇస్తున్న రక్షణ, భరోసా వల్ల తొలిసారిగా అక్కచెల్లెమ్మలు ఏమాత్రం కష్టమొచ్చినా ఈరోజు చెప్పుకునే పరిస్థితి, వెంటనే కేసులు నమోదు చేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది.
అక్కచెల్లెమ్మల విషయంలో ఈ రోజు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితులు.. గతంలో పోల్చితే ఎక్కువ అయ్యాయి. కారణం ఇవాళ వినడానికి చెవి ఉంది. చూడడానికి కన్ను ఉంది. మీకు ఏం సమస్య వచ్చినా చెప్పు నేను నోట్ చేసుకుంటాను, పరిష్కరిస్తాను అనే మాట పోలీసులలో కనిపిస్తోంది. ఒక గొప్ప వ్యవస్ధ ఇవాళ జరిగింది.
*రెండు విషయాలు చెబుతాను...*
ఇంత గొప్ప వ్యవస్ధలో మార్పులు వచ్చాయి కాబట్టి మీ అందరికీ రెండు, మూడు విషయాలు చెబుతాను.
ఈ మధ్యన విజయవాడలో అత్యాచారం జరిగిందని చెప్పి నానా యాగీ చేశారు.
ఈ మధ్యలోనే గుంటూరులో జరిగిందని ఇంకా యాగీ చేశారు. ఈ మధ్య కాలంలోనే విశాఖలో మరో యాగీ కూడా కనిపించింది. ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతున్నాను.
*దుర్మార్గులు ఎవరు అనేది వీళ్లు రాయరు, చూపరు*
దుర్మార్గులు ఎవరు అనేది మాత్రం ఈ ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు. టీవీ5 చూపదు.
ఈ బాలికల మీద, మహిళల మీద దాడికి ప్రయత్నించిన వారు, అత్యాచారం చేసిన దుర్మార్గులు ఎవరు అనేది మాత్రం ఈ ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు. టీవీ5 చూపదు.
కారణం ఏమిటంటే ఇదంతా చేసినవాళ్లు టీడీపీ నాయకులే. ఈ మూడు ఘటనల్లో వాళ్లే ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీళ్లే చేస్తారు. వీళ్లే మరలా వక్రీకరించి దుర్భుద్ధితో ప్రత్యారోపణలు చేస్తారు.
*ఏడు కొండల వాడిని కోరగలిగేది....*
ఇలాంటప్పుడు ఏడుకొండలవాడిని మనం కోరగలిగినది కేవలం ఒక్కటే.. దేవుడా ఈ ఎల్లో మీడియా నుంచి. ఈ ఎల్లో పార్టీ నుంచి రక్షించు నా రాష్ట్రాన్ని అని. రెండు నాలుకలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి... ధూర్తుల నుంచి, దుష్టచతుష్టయం నుంచి రక్షించు దేవా అని చెప్పి... ఇదే తిరుపతిలో వేంకటేశ్వరస్వామిని ప్రార్ధిస్తున్నాను.
కారణం వీరే స్క్రిప్టు రాస్తారు.. వీరే డైరెక్షన్ చేస్తారు. వీరే యాక్షన్ చేస్తారు. మరలా ఘెరం జరిగిందని గోల కూడా చేసేది వీళ్లే.. ఇవన్నీ గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.
నిండుమనస్సుతో ప్రతి అక్కకూ, చెల్లెమ్మలకూ, ప్రతి పిల్లాడికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. దేవుడి దయ, చల్లని దీవెనలు ఈ ప్రభుత్వంపై ఇంకా ఎక్కువగా ఉండాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
అనంతరం సీఎం జనవరి– మార్చి 2022 త్రైమాసికానికి దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ.709 కోట్లను కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
addComments
Post a Comment