నవ ధాన్యాల సాగు పై రైతులకు అవగాహన కలిగించాలి

 

    రైస్ మిల్లుల ఏర్పాటుకు ఏ.పి.ఐ.ఐ.సి స్థలం 

            నవ ధాన్యాల సాగు పై రైతులకు అవగాహన కలిగించాలి 

నీటి విడుదలకు ముందే  జైకా పనులు పూర్తి కావాలి 

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం లో  జెడ్ పి చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు 

విజయనగరం, మే 20 (ప్రజా అమరావతి)


: జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని వరిపంట  స్థానం లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మరలించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు.   భూసారాన్ని పెంచే  నవ ధాన్యాలను కూడా పండించాలని, ఈ పంటల పై రైతులకు ఆర్.బి.కే స్థాయి లో వ్యవసాయాధికారులు అవగాహన కలిగించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో  జిల్లా వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటిపారుదల సలహా  మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ముఖ్య అతిధి గా జిల్లా పరిషత్ చైర్మన్ ముఖ్య అతిధి గా హాజరైనారు.    సబ్సిడీ ఇచ్చే విత్తనాలు వాడడం వలన  పంట రిస్క్ ఎక్కువగా ఉంటుందని,   రిస్క్ లేని  పంటలను  పండించడం వలన రైతులకు  మిల్లర్లకు మంచి జరుగుతుందని అన్నారు.  ఈ ఏడాది  ధాన్యం సేకరణలో అనేక సమస్యలను ఎదుర్కున్నామని, వచ్చే ఏడాది ఇలాంటి పరిస్థితి తెలేత్తకుండా చూడాలని చైర్మన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా విభజన వలన ఎక్కువ రైస్ మిల్లులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నందున జిల్లాలో మిల్లుల సంఖ్య తగ్గిందని, అందుకోసం కొత్త గా మిల్లులు ఏర్పాటు చేసుకోడానికి  ఏ.పి.ఐ.ఐ.సి ద్వారా స్థలం  కేటాయించడం జరుగుతుందని, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.  అదే విధంగా  ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికీ అన్ని విధాల ప్రోత్సహిస్తామని తెలిపారు. 

వ్యవసాయ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి  స్టాఫ్ ను పునర్ విభజించాలని, వచ్చే సమావేశానికి  ఆర్.బి.కే వారీగా ఉన్న విస్తీర్ణం, సిబ్బంది వివరాలను సమర్పించాలని చైర్మన్ ఆదేశించారు.  వరి పంటకు బదులుగా వేరుశెనగ ను   ప్రోత్సహించాలని , కదిరి- లేపాక్షి, నిత్య హరిత రకాలను ప్రోత్సహించేలా శాస్త్ర వేత్తలు వర్క్ షాప్  లను నిర్వహించి సలహాలను  అందించాలన్నారు. వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గేదల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ పంట నమోదు పైనే రైతు భవిష్యత్తు ఆధారపడి ఉన్నందున అది శత శాతం  జరగాలన్నారు.  వ్యవసాయ శాఖ జే.డి  రామ రావు మాట్లాడుతూ  జిల్లాలో శత శాతం  ఈ పంట నమోదు పూర్తి అయ్యిందని, అయితే ఇంకా 5 శాతం వరకు ఇంటిగ్రేట్  కావలసి ఉందని తెలిపారు. 

నీరు విడుదల చేసే నాటికి మరమ్మతులు పూర్తి కావాలి :

జిల్లా నీటిపారుదల  కమిటీ సమావేశం లో చైర్మన్ మాట్లాడుతూ  రైతులకు నీరు విడుదల చేసే లోగా  జైకా నిధులతో చేపడుతున్న మరమ్మత్తులన్నీ పూర్తి కావాలని ఆదేశించారు.  జూన్ 15 నాటికీ మడ్డువలస నీటిని విడుదల చేయనున్నట్లు , అదే విధంగా పార్వతీపురం లో జూలై 20 న నీటి విడుదలకు తేదీ లను నిర్ణయించినట్లు ఎస్.ఈ రాంబాబు వివరించారు.  మడ్డువలస కు 6.5 లక్షల తో చేపడుతున్న మరమత్తులన్ని మే నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు.  తాటిపూడి, ఆండ్రా జూలై 15 న నీటి విడుదల చేస్తామన్నారు.    నీటిని విడుదల చేసే తేదీలను ప్రజా ప్రతినిధులకు  తెలియజేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ తెలిపారు.   సాగునీటి సరఫరా గావించే లష్కర్ల కు చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని, ఎస్.ఈ తెలుపగా ప్రతిపాదనలు పెట్టాలని చైర్మన్ సూచించారు. 

సమావేశం లో  ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ముద్రించిన పంటలు సాగులో కీలక యాజమాన్య పద్ధతలు  పుస్తకాన్ని ఆవిష్కరించారు.  ఈ సమావేశం లో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్,  సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్,   శాసన మండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు,   కంబాల  జోగులు, డి.సి.ఎం.ఎస్. చైర్ పర్సన్ డా. భావన,  డి.సి.సి.బి చైర్మన్ , సి.ఈ.ఓ, కమిటీ  సభ్యులు,  వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Comments