వైభవంగా శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ
– హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
తిరుపతి 23 జూన్ (ప్రజా అమరావతి): తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్యమంత్రి సంప్రదాయ దుస్తులు ధరించి, ఆలయ పుష్కరిణి లోకి వెళ్ళి నీటిని తలమీద చల్లుకున్నారు. ఆ తరువాత టీటీడీ అధికారిక వృక్షం మానుసంపంగి మొక్క నాటారు.
అక్కడి నుంచి ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్య అర్చకులతో కలసి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అక్కడి నుంచి మేళతాళాల నడుమ ప్రదక్షణగా ఆలయంలోకి చేరుకున్న సిఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి శ్రీ వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రి కి వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన శ్రీ వకుళమాత ఫొటో ఫ్రేమ్, తీర్థప్రసాదాలు అందించారు.
డిప్యూటీ సిఎం లు శ్రీ నారాయణ స్వామి, శ్రీ సత్యనారాయణ, మంత్రి శ్రీమతి రోజా, ఎంపిలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ ఆదిమూలం, శ్రీ జంగాల పల్లి శ్రీనివాసులు, శ్రీ చింతల రామచంద్రారెడ్డి, శ్రీ కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీ మేడా మల్లిఖార్జున రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఢిల్లీ స్థానిజ సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి, ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి, జెఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment