ఆగస్టు 1 నుండి 2.68 కోట్ల మందికి పిఎంజికెఎవై ఉచిత బియ్యం పంపిణీ

 *ఆగస్టు 1 నుండి  2.68 కోట్ల మందికి పిఎంజికెఎవై ఉచిత బియ్యం పంపిణీ


*

*•మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులమేరకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం*

*•మద్యాహ్నం 3.30 నుండి సాయంత్రం వరకూ డిపోల వద్దే ఈ బియ్యం పంపిణీ*

*•సంబందిత కూపన్లను ముందుగానే లబ్దిదారులు అందరికీ పంపిణీకి ఏర్పాట్లు*

*•పి.డి.ఎస్.ద్వారా ప్రస్తుతం 4.23 కోట్ల మందికి ఇళ్లవద్దకు వాహనాల ద్వారా పంపిణీచేస్తున్న  రూ.1/- కే కిలో బియ్యం పథకం యదావిదిగా కొనసాగింపు*

*రాష్ట్ర మంత్రులు బొత్ససత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు*

                                                                                                                                                                       అమరావతి, జులై 25 (ప్రజా అమరావతి):  ఆగస్టు 1 నుండి ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ అన్నయోజన పథకం క్రింద ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలోని 2.68 కోట్ల మంది నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులమేరకు రాష్ట్ర  ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.  సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ  కోవిడ్ నేపధ్యంలో  జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం క్రింద రాష్ట్రంలోని 2.68 కోట్లు మంది నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీచేయడం జరుగుచున్నదన్నారు. ఈ పథకం ఏప్రిల్ 2020 నుండి మార్చి 2022 వరకూ  రాష్ట్రంలో కొనసాగించడం జరిగిందన్నారు.  అయితే  కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన నేపధ్యంలో  కేంద్రం అందజేసే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని  రాష్ట్రంలోని నిరుపేదలకు లబ్దిచేకూర్చాలనే ఉద్దేశ్యంతో  రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించిందన్నారు. ఈ  మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన ఏడు జిల్లాలు అంటే తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్ల మినహా రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలోని 1.67 కోట్ల మందితో పాటు మిగిలిన పూర్వపు 6 జిల్లాలలోని  89.20 లక్షల ఎస్.సి., ఎస్.టి.లకు మరియు 24.60 లక్షల ఏఏవై కార్డుదారులకు  ఈ పథకాన్ని వర్తింపచేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.  వీరితో పాటు నూతనంగా ఏర్పడిన ప్రకాశం జిల్లాలోని నిరుపేదలకు కూడా  ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.   మొత్తం 2.68 కోట్ల మందికి  ఈ ఉచిత బియ్యాన్ని మద్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం వరకూ డిపోల వద్దే పంపిణీచేయడం జరుగుతుందన్నారు. సంబందిత కూపన్లను ముందుగానే లబ్దిదారులు అందరికీ వాలంటీర్ల ద్వారా పంపిణీచేసేందుకు  చర్యలు తీసుకుంటున్నామన్నారు.  అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 4.23 కోట్ల మంది లబ్దిదారులకు పి.డి.ఎస్.ద్వారా ఒక రూపాయికే  కిలో బియ్యం పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆ పథకం యధావిధిగా కొనసాగుతుందని, లబ్దిదారుల ఇళ్ల వద్దకే వాహనాల ద్వారా బియ్యం పంపిణీచేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పి.డి.ఎస్.ద్వారా లబ్దిపొందే 4.23 కోట్ల మందిలో పిఎంజికెఎవై లబ్దిదారులు 2.68 కోట్ల మంది కూడా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

                                                                                                                                                                                           రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు  మాట్లాడుతూ  రాష్ట్రంలోని అర్హులు అందరికీ పిఎంజికెఎవై పథకాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి లేఖ వ్రాశారన్నారు. నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు  మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు చేసిన పలు ప్రయత్నాల మేరకు మరియు మంత్రి వర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు  రాష్ట్రంలో పిఎంజికెఎవై పథకం అమలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు ఏళ్లలో 12 వేల కోట్లు  ఈ శాఖ ద్వారా వెచ్చిస్తే కేవలం మూడేళ్లలో తమ ప్రభుత్వం 16 వేల కోట్ల మేర వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. నూతనంగా 7,051 కార్డులను జారీచేయడం జరిగిందని మంత్రి తెలిపారు .

                                                                                                                                                                                    రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్  గిరిజాశంకర్,  రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఎం.డి. వీరపాండ్యన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.   

 

Comments