ఆగస్టు 11 నుండి 17 వరకూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి

 ఆగస్టు 11 నుండి 17 వరకూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి


పాఠశాలలు,కళాశాలలు,చౌకధరల దుకాణాలపైన మువ్వన్నెల జెండా ఎగురవేయాలి

స్వయం సహాయక సంఘాలను పూర్తిగా భాగస్వాములను చేయాలి

ప్రతి ప్రభుత్వ భవనంపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి

ప్రజల్లో అవగాహనకు షార్టు ఫిలిమ్ లు రూపొందించి సినిమాహాళ్ళలో ప్రదర్శించాలి

ముఖ్య కూడళ్ళలో హోర్డింగ్,ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి

                   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ

అమరావతి,14 జూలై (ప్రజా అమరావతి):ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రజలకు పిలుపు నిచ్చారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా (దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని)దేశవ్యాప్తంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ 'హర్ ఘర్ తిరంగా' (ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలనే లక్ష్యంతో) కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నోడలు విభాగంగా ఉండి ఈకార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పారు.ప్రతి ఇంటిపైనా ప్రతి ప్రభుత్వ భవనంపైనా ఆగస్టు 11 నుండి 17 వరకూ మువ్వన్నెల జెండా ఎగుర వేసేలా చూడాలని అన్నారు.రాష్ట్రంలో 90 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలున్నారని వారందరినీ ఈకార్యక్రమంలో పూర్తిగా భాగస్వాములను చేయాలని చెప్పారు.స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించి నిర్దేశిత నమూనా సైజుతో కూడిన మువ్వన్నెల జెండాను సమకూర్చుకుని ప్రతి ఇంటిపైనా ఎగురవేసేలా చూడాలని పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు,సెర్ప్ సిఇఓను సిఎస్ ఆదేశించారు.

ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేకంగా లఘ చిత్రాలను రూపొందించి సినిమా ధియేటర్లలో ప్రదర్శించేలా తగిన చర్యలు తీసుకోవాలని సమాచారశాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డిని సిఎస్ ఆదేశించారు.అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాలు,పట్టణాల్లోని ముఖ్య కూడళ్ళలో హోర్డింగ్లు, ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని చెప్పారు.రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై ప్రత్యేక పెయింటింగ్లు వేయడంతో పాటు బ్యానర్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసి ఎండిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు.అంతేగాక ఈకార్యక్రమంపై రాష్ట్ర,జిల్లా స్థాయిలో ప్రత్యేక మీడియా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర,జిల్లాస్థాయి అధికారులను సిఎస్ ఆదేశించారు.

అంతకు ముందు రాష్ట్ర ఎక్సైజ్,స్టాంపులు,రిజిష్ట్రేషన్లు,సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఆగస్టు 11 నుండి 17 వరకూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా కార్యక్రమానికి సంబంధించి 20X30 అంగుళాల సైజుతో కూడిన మువ్వన్నెల జెండాను ఎగురవేయాల్సి ఉంటుందని చెప్పారు.రాష్ట్రంలో కోటి 26 లక్షల కుటుంబాలున్నాయని ప్రతి ఇంటిపైన ఈమువ్వన్నెల జెండా ఎగురవేయాల్సి ఉందని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్రోద్యమం,జాతీయ జెండా తదితర అంశాలపై జాతీయ,స్థానిక మీడియా చానళ్ళు, పత్రికల్లో ప్రత్యేక కధనాలు ప్రసారం,ప్రచురణ జరిగేలా చూడాల్సి ఉందని చెప్పారు.అలాగే విజయవాడ,విశాఖపట్నం తదితర ముఖ్య నగరాల్లో ఈకార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక ఈవెంట్లను కూడా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.

ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది,అనిల్ కుమార్ సింఘాల్,వాణి మోహన్,కార్యదర్శి జిఎస్ఆర్కెఆర్ విజయ కుమార్,సెర్ప్ సిఇఒ ఇంతియాజ్,రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు హేమచంద్రా రెడ్డి తదితరులు పాల్గొనగా వీడియో లింక్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ,టిఆర్అండబి ముఖ్య కార్యదర్శి యంటి.కృష్ణబాబు,సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి,ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమల రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

    

Comments