పశ్చిమ ఆస్ట్రేలియాతో 8 ఎంవోయూలు కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్



*పశ్చిమ ఆస్ట్రేలియాతో 8 ఎంవోయూలు కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్*


 *పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందం..బంధం మరింత బలోపేతం: పరిశ్రమల మంత్రి అమర్ నాథ్*


*నైపుణ్య కొరత లేకుండా పరస్పరం తోడ్పాటు : నైపుణ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*విద్యుత్, భూ గర్భగనులు, ఖనిజాలు, మెరైన్ , పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు : ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల*


అమరావతి, జూలై, 16 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ లో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ , పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య సోదర రాష్ట్ర ఒప్పందం ఉంది. దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వివిధ అంశాలలో సహకారానికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. వాటిలో మొత్తం 8 అంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం  శనివారం విశాఖపట్నం రాడిసన్ హోటల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్ నాథ్ లతో సమావేశమైంది. ముందుగా  మంత్రులు  బుగ్గన, గుడివాడ అమర్ నాథ్, పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ మంత్రి రాగర్ కుక్, పశ్చిమ ఆస్ట్రేలియా మంత్రి డేవిడ్ టెంపుల్టన్ , పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన  , విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున జ్యోతి ప్రజ్వలన చేసి పరస్పర అవగాహన ఒప్పంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిశ్రమలు, నైపుణ్యం, విద్య, శిక్షణ, గనులు, ఖనిజాలు, తయారీ రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మాల, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ వీ.జీ వెంకటరెడ్డి, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, విద్యుత్ శాఖ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వితేజ్ ఇమ్మాడి, ఉన్నత విద్యా  మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఆస్ట్రేలియా ప్రతినిధులకు ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. 100 మందికి పైగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు, పారిశ్రామికవేత్తల నడుమ జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో మొత్తం 8 ఒప్పందాలు కుదిరాయి.



అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతివైపు పరుగులు పెడుతున్నట్లు వెల్లడించారు. అపార సహజవనరులు, మౌలిక సదుపాయాలు,పారదర్శక పాలన, పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక వాతావరణం వల్ల ఏపీకి పెట్టుబడులు రానున్నాయన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందం వల్ల కొన్ని కీలక రంగాలలో కలిసి పని చేస్తూ ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నారు. 


అంతకుముందు ఎంవోయూ సదస్సులో ఆర్థిక , నైపుణ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రులకు కొదువలేదన్నారు. కానీ, వారికి కావలసిన నైపుణ్యం కొరత ఉన్న నేపథ్యంలో పశ్చిమ ఆస్ట్రేలియా తోడ్పాటు దాన్ని అధిగమించేందుకు కలిసి ముందుకు వెళతామన్నారు. 


డిప్యూటీ ప్రీమియర్ రోజర్ మాట్లాడుతూ... భారత ప్రభుత్వం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కొనసాగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాలలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాలలో ఏపీ ఒకటన్నారు. విద్యుత్, విద్య, నైపుణ్యం సహా పలు కీలక రంగాలలో పరస్పర సహకారం మరింత పెరుగుతుందన్నారు. 


పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ మాట్లాడుతూ...విద్యుత్, భూ గర్భగనులు, ఖనిజాలు, మెరైన్ , పెట్రో కెమికల్ వంటి రంగాలలో పెట్టుబడులకు అవకాశముందన్నారు. ఆయా రంగాలలో పెట్టుబడుల ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా సోదర రాష్ట్ర ఒప్పందం కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన 8 ఒప్పందాలు :*


*1. ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఏఐసీఎస్) డైరెక్టర్ పర్సెస్ ష్రాఫ్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం. అంతర్జాతీయ విద్య, నైపుణ్య సహకారం కోసం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్న పశ్చిమ ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్.*


*2. 'ఫ్యూచర్ బ్యాటరీ'తో ఏపీఈడీబీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం. విద్యుత్ కు సంబంధించిన సవాళ్ళను అధిగమించే విధానాలలో పరిశోధనాత్మక తోడ్పాటు.*  


*3. 'స్పేస్ ఏంజిల్' సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. ఏరో స్పేస్ రంగానికి చెందిన అంతరిక్ష సాంకేతిక అంశంలో పరస్పర సహకారం.*


*4. 'విలేజ్ ఎనర్జీ'  సంస్థ సీఈవో వేన్ లూబిస్ కాస్ తో ఏపీఈడీబీ ఎంవోయూ.  విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అవగాహన ఒప్పందం.*


*5. 'ఫినిక్స్ అకాడమీ'తో నైపుణ్య, శిక్షణ రంగానికి సంబంధించిన పరస్పర అవగాహన ఒ్పందం. నైపుణ్యం, ఒకేషనల్ ట్రైనింగ్ కి సంబంధించిన సహకారం దిశగా అంగీకారం.*


*6. పశ్చిమ ఆస్ట్రేలియాలోని విద్యుత్ రంగానికి సంబంధించిన 'ఆస్ట్రేలియన్ ఎనర్జీ స్టోరేజ్'  కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీ ఎండీ పీయూష్ మాధుర్,  ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్ సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.* 


*7. 'హెల్త్ ఇంటిగ్రా ప్రైవేట్ లిమిటెడ్' అనే వైద్య పరికరాల తయారీ సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. అత్యాధునిక పరికరాలకు సంబంధించిన సాంకేతికత పలు కీలక అంశాలలో పరస్పర అవగాహనతో కలిసి పనిచేయడానికి అంగీకారం.*


*8. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన 'ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ' (సీసీఐడబ్ల్యూఏ) వాణిజ్య పెట్టుబడుల హెడ్ మైకేల్ కార్టర్ తో ఏపీఈడీబీ ఒప్పందం.   మత్స్య రంగానికి సంబంధించిన అంశాలలో కలిసి పని చేయనున్నట్లు వెల్లడించారు.*  


పశ్చిమ ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్ ల మధ్య పరస్పర అవగాహన ఒప్పంద కార్యక్రమంలో మంత్రులు  బుగ్గన, గుడివాడ అమర్ నాథ్, పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్, పశ్చిమ ఆస్ట్రేలియా మంత్రి డేవిడ్ టెంపుల్టన్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ అజయ్ రెడ్డి కొండూరు,  పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మాల, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ వీ.జీ వెంకటరెడ్డి, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, విద్యుత్ శాఖ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వితేజ్ ఇమ్మాడి, ఉన్నత విద్యా  మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ పీ.వీ.జీ.డీ ప్రసాద్ రెడ్డి, రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ బాలయ్య, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు, ఆంధ్రప్రదేశ్ సీఐఐ ఛైర్మన్ నీరజ్ శారద, ఇండియ గల్ఫ్ ఇన్వెస్ట్ మెంట్, ట్రేడ్ కమిషనర్ నషిద్ చౌదరి, ఏపీ ఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సవరపు, పరిశ్రమలు, ఏపీఐఐసీ అధికారులు, పారిశ్రామికవేత్తలు, తదితరులు హాజరయ్యారు.


Comments