వెదురు పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించండి:సిఎస్ డా.సమీర్ శర్మ

 వెదురు పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించండి:సిఎస్ డా.సమీర్ శర్మ



అమరావతి,1 జూలై (ప్రజా అమరావతి): రాష్ట్రంలో అటవీ ప్రాంతం తోపాటు,ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు,కాలువలు,చెరువులు,రిజర్వాయర్లుకు సంబంధించిన గట్లపైన పెద్దఎత్తున వెదురు పెంపకాన్ని చేపట్టేలా రైతులను అన్ని విధాలా ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర బ్యాంబూ మిషన్ అధ్యక్షులు డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సిఎస్ సమావేశ మందిరంలో రాష్ట్ర బ్యాంబూ మిషన్ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.రాష్టంలో వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయిలో సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర బ్యాంబూ మిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈమిషన్ లో వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు,వ్యవసాయ,సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,స్పెషల్ సిఎస్ ఇండస్ట్రీస్,పిఆర్ అండ్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి,గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రైతు సంక్షేమ సంఘాల నుండి నియమించబడిన ప్రతినిధి, ఉత్పత్తి, ప్రోససింగ్ రంగాల నుండి ఇద్దరు నిపుణులు సభ్యులుగా,ఉద్యానవన శాఖ కమీషనర్ సభ్య కార్యదర్శిగా ఈమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ అధ్యక్షునిగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సభ్య కార్యదర్శి గాను,జిల్లా వ్యవసాయశాఖ అధికారి,జిల్లా అటవీ శాఖ అధికారి,జిల్లా సామాజిక అటవీ అధికారి,పిడి డిఆర్డిఏ,పిఓ ఐటిడిఏ,జియం ఇండస్ట్రీస్, వెదురు పంపకం దార్ల ప్రతినిధి, పిడి డ్వామా సభ్యులుగా జిల్లా బ్యాంబూ డెవలప్మెంట్ ఏజెన్సీ (బిడిఏ)ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈసందర్భంగా సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర బ్యాంబూ మిషన్ వద్ద కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం నిధులు 710 కోట్ల రూ.లు,రాష్ట్ర వాటా 40శాతం నిధులు 473 కోట్లు కలిపి 1184 కోట్ల రూ.ల నిధులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.వెదురును ముఖ్యంగా నిర్మాణ రంగంలోను,పేపరు తయారీ,అగరబత్తీల తయారీ,ఫర్నిచర్,హేండీ క్రాప్ట్స్,ఫైబర్ తయారీలోను వెదురును విరివిగా వినియోగిస్తున్నందున వెదురుకు మంచి డిమాండు ఉందని చెప్పారు.ఇతర అవసరాలకు నేడు వెదురుకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుండి వెదురును దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు. బ్యాంబూ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 60శాతం,రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ రూపంలో తోడ్పాటును అందించడం జరుగుతోందని సిఎస్ పేర్కొన్నారు.ప్రభుత్వ సంస్థల పరిధిలో వెదురు పెంపకం చేపడితే యూనిట్ కాస్ట్ లో నూరు శాతం సబ్సిడీని కల్పించడం జరుగుతుందని,అదే ప్రవేట్ గా చేపడితే 50శాతం సబ్సిడీని అందిస్తారని చెప్పారు.రాష్ట్రంలోని అందరు రైతులు బ్యాంబూ మిషన్ కింద సబ్సిడీని పొందేందుకు అర్హులేనని సిఎస్ స్పష్టం చేశారు.కావున అటవీ ప్రాంతాలతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు,వివిధ గట్లపైన వెదురు పెంపకాన్ని విరివిగా చేపట్టేలా రైతులను అన్ని విధాలా ప్రోత్సహించాలని సిఎస్ డా.సమీర్ శర్మ రాష్ట్ర బ్యాంబూ మిషన్ డైరెక్టర్ అయిన ఉద్యానవన శాఖ కమీషనర్ ఆదేశించారు.

రాష్ట్రంలో వెదురు పెంపకానికి అటవీ ప్రాంతాలతో పాటు కోస్తా ప్రాంతం ఇతర ప్రాంతాలు కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయని కావున రైతులను ప్రోత్సహించి వెదురు పెంపకం చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.అదే విధంగా వివిధ స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా కూడా వెదురు పెంపకానికి తగిన చర్యలు తీసుకోవాలని సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ ను సిఎస్ ఆదేశించారు.

అంతకు ముందు రాష్ట్ర ఉద్యానవన శాఖ కమీషనర్ మరియు రాష్ట్ర బ్యాంబూ మిషన్ సభ్య కార్యదర్శి శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్యాంబు మిషన్ ఏర్పాటు ఆవశ్యకత దాని విధి విధానాలు,నిధుల లభ్యత,ఇప్పటి వరకూ చేపట్టిన చర్యలు తదితర అంశాల గురించి వివరించారు.

ఈసమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్,ఉద్యానవన శాఖ అదనపు సంచాలకులు వెంకటేశ్వర్లు పాల్గొనగా వీడియో లింక్ ద్వారా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉద్యానవనశాఖ కమీషనర్ శ్రీధర్,సెర్ప్ సిఇఒ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

    

Comments