ఆదోని, కర్నూలు జిల్లా (ప్రజా అమరావతి);
*వరుసగా మూడో ఏడాది (2022–23 విద్యాసంవత్సరానికి) జగనన్న విద్యాకానుక – బడికి వెళ్లడం ఇక వేడుక.*
*బడులు తెరిచిన తొలిరోజు నుండే విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక.*
*రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 వతరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ.931.02 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే....:*
*విద్యాకానుక కిట్– రూ.931 కోట్లు– 47 లక్షల మంది పిల్లలు...*
దేవుడి దయతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రూ.931 కోట్లతో ప్రభుత్వ బడులలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 47 లక్షల మంది పిల్లలకు మంచి చేయబోతున్న రోజు.
ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో చిక్కటి చిరునవ్వుతో పాలుపంచుకుంటున్న ప్రతి అక్కా, చెల్లెమ్మలకు,అవ్వా, తాతలకు, ప్రతిసోదరుడికి, స్నేహితుడికి ముఖ్యంగా ప్రతి చిట్టి తల్లికి, చిట్టి బాబుకు ముందుగా పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.
*మెరుగైన చదువులతో పేదరికం పోతుందనే...*
గడిచిన మూడు సంవత్సరాలుగా ప్రతి అడుగులోనూ పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంటిలోనూ చదవులు ఉండాలి, అవి కూడా మామాలు చదువులు కాకుండా మెరుగైన ఇంగ్లిషు మీడియం చదువులు ఉండాలి,అప్పుడే ఆ పిల్లలు బాగా చదివి, పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా బ్రతికే పరిస్థితి వస్తుంది, అప్పుడే పేదరికం పోతుందనే గొప్ప ఆశయంతో మూడు సంవత్సరాలుగా అడుగులు ముందుకువేస్తూ వచ్చాం.
*ఉద్యమంగా స్కూళ్లలో మార్పులు...*
అందులోభాగంగానే తమ పిల్లలను బడికి పంపిన తల్లులకు క్రమం తప్పకుండా... గత మూడేళ్లుగా వరుసగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేశాం. ఈ మూడేళ్ల కాలంలోనే ఒక ఉద్యమంగా ప్రభుత్వ స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ... మనబడి నాడు–నేడు ద్వారా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మన బడుల రూపురేఖలు మార్పు జరుగుతోంది. బడికి వెళ్తున్న పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం గురించి గతంలో ఎప్పుడూ ఏ పాలకులూ ఆలోచన చేయలేదు. వాటి పరిస్థితిని కూడా మారుస్తూ.. జగనన్న గోరుముద్ద పథకాన్ని తీసుకొచ్చి, రోజూ మెనూ మారుస్తూ.. పౌష్టికాహారం ప్రతి పిల్లవాడికి చేరాలన్న ఉద్దేశ్యంతో జగనన్న గోరుముద్ద పథకాన్ని తీసుకొచ్చాం.
*శ్రీమంతుల పిల్లలకు మల్లే మెరుగైన చదువుల కోసం...*
బడులలో ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చాం. బైలింగువల్ టెక్ట్స్బుక్స్తో పాటు వారికి చదువులు సులభంగా అర్ధమయ్యే విధంగా.. ఇంకామెరుగైన చదువులు అందుబాటులోకివచ్చే విధంగా.. ఆ పిల్లలకు సహాయకారిగా ఉండేటట్టుగా, శ్రీమంతుల పిల్లలు మాత్రమే రూ.24 వేలు కడితే.. అందుబాటులో ఉండే బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. తద్వారా ఆ బైజూస్ యాప్ కూడా మన పిల్లలకు ఆందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం.
రేపటితరం భవిష్యత్తుమీద దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం మనది. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలలో పిల్లలు ఎలాంటి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది... ఆ పిల్లలు పోటీలో నిలబడగలుగతారా ? లేదా ? ఆ పోటీలో నిలబడ్డమే కాకుండా... ప్రపంచంతో పోటీపడి నెగ్గుకు రావాలన్న ఆరాటంతో మొత్తం విద్యావ్యవస్ధలోనే మార్పులు తీసుకువచ్చాం.
*రేపటి తరం పేదరికం పోవాలనే....*
ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా వెనుకబడిన పేదలందిరికీ కూడా నవరత్నాల ద్వారా ఒకవైపు మంచి చేస్తున్నాం. మరో వైపున పిల్లలకు అంటే రేపటి తరం గురించి కూడా ఆలోచన చేశాం. వారిని జాగ్రత్తగా పైకి తీసుకువస్తేనే రేపటి తరం పేదరికం నుంచి బయటపడుతుందన్న సంకల్పంతో.. పిల్లలకు చదవుకునేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పిసున్నాం. నాణ్యమైన చదువులు అందించే ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ఆ పిల్లలు తమ తలరాతలు మార్చుకునే పరిస్థితి రావాలని అడుగులు ముందుకు వేస్తున్నాం.
*ఇందుకోసమే జగనన్న విద్యా కానుక...*
ఈ ప్రక్రియలో భాగంగానే ఈరోజు జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుడుతున్నాం.
వరుసగా మూడో ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుండగానే... పిల్లలు బడిలో అడుగుపెడుతున్నప్పుడే.. ఆ విద్యాకానుక పిల్లల చేతిలో పెడుతున్నాం. ప్రభుత్వ బడులు అన్నింటితో పాటు ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా జగనన్న విద్యా కానుక కిట్ను అందిస్తోంది. బడికి వెళ్తున్న పిల్లలకు వారి ఇంటినుంచి బడికి వెళ్లడానికి, బడులలో బాగా చదువుకునేందుకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా విద్యాకానుక ద్వారా అందిస్తున్నాం.
*విద్యాకానుక కిట్ల నాణ్యత– విద్యార్ధుల సంఖ్యా పెరుగుదల*
విద్యా కానుక ద్వారా ఇస్తున్న కిట్లలో ప్రతియేటా ఒకవైపు నాణ్యత పెంచుకుంటూ పోతున్నాం. మరోవైపున విద్యార్ధుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. ఇలా నాణ్యత పెంచే కొద్ది, విద్యార్ధుల సంఖ్య పెరిగే కొద్దీ, విద్యాకానుక పథకం మీద పెడుతున్న ఖర్చు కూడా పెరుగుతూ పోతుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా మీ జగన్.. అంటే ఆ పిల్లలకు మేనమామ ఎక్కడా వెనుకడుగు వేయలేదని ఆ పిల్లలకు తెలియజేస్తున్నాను. నా చెల్లెమ్మలకు అంటే ఆ పిల్లల తల్లులకు తెలియజేస్తున్నాను.
*మూడేళ్లలో పెరుగుతూ వస్తున్న కిట్ ఖరీదు....*
మొట్టమొదది సంవత్సరం 2020–21 విద్యా సంవత్సరంలో సగటున ఒక్కో కి ట్కు రూ.1531ఖర్చు చేశాం. మొత్తంగా 42,34,322 మంది పిల్లలకు రూ.650 కోట్లు ఖర్చు చేస్తూ ఆ ఏడాది విద్యాకానుక కిట్లు అందజేశాం.
ఆ తర్వాత 2021–22లో ఒక్కో కిట్కు సగటున రూ.1726 ఖర్చు చేస్తూ..45,71,051 మంది పిల్లలకు రూ.790 కోట్లు వ్యయంతో విద్యాకానుక కిట్లు అందజేశాం.
ఈ సంవత్సరం మూడో ఏడాదికి వచ్చేసరికి... ఏకంగా ఒక్కో కిట్టుకు రూ.1964 ఖర్చైంది. అందే దాదాపు రూ.2 వేలు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతారని భావిస్తున్నాం. వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని దాదాపు 47 లక్షల మంది పిల్లలకు విద్యా కానుక కిట్ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దీనికోసం రూ.931 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.
*మరో ముందడుగు– ట్యాబుల పంపిణీ...*
దీంతో పాటు ఈ సంవత్సరం ఆ పిల్లల జీవితాలను మెరుగుపర్చేందుకు ఇంకో అడుగు ముందుకు వేశాం. ప్రతి పిల్లవాడు, ప్రతిపాప 8వతరగతిలోకి అడుగుపెడితే చాలు.. ప్రతి ఒక్కరికీ ఈ సెప్టెంబరు అంటే మరో రెండు నెలల్లోనే ఒక ట్యాబ్ కూడా ఇస్తున్నాం. దాని విలువ దాదాపు రూ.12వేలు అని అంచనా. 4.70 లక్షల మంది పిల్లలు 8వతరగతిలోకి అడుగుపెట్టబోతున్నారు. ట్యాబ్ విలువ రూ.12 వేలు అంటే మరో రూ.500 కోట్లు పిల్లల భవిష్యత్ మీద ఖర్చు పెట్టబోతున్నాం.
బైజూస్ సంస్ధతో ఒప్పందం చేసుకుని ఆ ఎడ్యుకేషనల్ కంటెంట్ అంతా సులభంగా అర్ధమయ్యే విధంగా ఆ ట్యాబ్లోకి అనుసంధానం చేయబోతున్నాం. రేపు మన పిల్లలు 2025 మార్చిలో సీబీఎస్ఈ పరీక్షలు ఇంగ్లిషు మీడియంలో రాస్తే వారు మెరుగైన ఫలితాలతో బయటపడాలి, మంచి చదువులు రావాలన్న ఉద్దేశ్యంతో బైజూస్ సంస్ధతో ఒప్పందం చేసుకుని, ట్యాబులు కూడా ఇచ్చి 8 వతరగతి నుంచి పిల్లలను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం.
విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్ధికి కూడా ఉచితంగా కుట్టుకూలి డబ్బులతో సహా 3 జతల యూనిఫామ్, మంచి క్వాలిటీతో స్కూల్ బ్యాగు, పిల్లలకు సులభంగా అర్ధమయ్యేందుకు ఒక పేజీ ఇంగ్లీషు, ఒక పేజీ తెలుగు ఉండే విధంగా బైలింగువల్ టెక్ట్స్బుక్స్తో పాటు నోట్ బుక్స్, వర్క్బుక్స్, బెల్టు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఇస్తున్నాం. వీటన్నంటితో పాటు గత సంవత్సరం పిల్లలకు డిక్షనరీలు ఇచ్చాం. ఆ డిక్షనరీలు ఎవరైనా పొగొట్టుకున్నా... కొత్తగా ఎవరైనా ప్రభుత్వ బడులలో చేరుతున్నా వాళ్లందరికీ మరలా ఆక్స్పర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలు చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తున్నాం.
ఇన్ని మెరుగైన కార్యక్రమాలు విద్యారంగంలో జరుగుతున్నాయి.... ఎప్పుడూ కూడా జరగని విధంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు విద్యావ్యవస్ధ గొప్ప మలుపు తిరుగుతోంది.
*గతంలో తల్లిదండ్రుల ఇబ్బందులు...*
ఇంతకముందు ఇదే రకంగా స్కూళ్లు తెరవగానే పిల్లలకు యూనిఫామ్లు కొనాలన్నా, బ్యాగులు కొనాలన్నా, మంచి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలనుకున్నా, మంచి బూట్లు, సాక్సులు, బెల్టు ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఇంతింత డబ్బులు ఖర్చుపెట్టలేని పరిస్థితి. ఫలితంగా ఆ తల్లిదండ్రులు పిల్లల చదువులు మీద ధ్యాస పెట్టని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ఆ తల్లిదండ్రుల మీద ఏమాత్రం భారం పడకుండా.. ప్రతి పిల్లవాడికి మంచి జరిపించాలని విద్యాకానుక కిట్లు అందజేస్తున్నాం.
*ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే....*
ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే కారణం... మన రాష్ట్రంలో బడిమానేసే పిల్లలు తగ్గాలని. చదువుకునే పిల్లలు పెరగాలి. ఎందుక ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే.. బడికి పంపేలా, పెద్ద చదువులను చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని చేస్తున్నాం.
*ప్రతి ఇంట్లో అభివృద్ధి, ఆనందం – నా సంకల్పం..*
ఈ తరం వచ్చే తరం పేదరికం అనే సంకెళ్లను తెంచుకోవాలి, సామాజిక, ఆర్ధిక ఆంతరాలు తగ్గాలి. పెద్ద చదువులు, మంచి చదువులు, ఇంగ్లిషు మీడియం చదువులు పేదింటి పిల్లలకు అందాలి. అప్పుడే ఆ విద్యా విప్లవంలో మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కూడా ఆనందాన్ని చూస్తాం. ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధిని చూడగలుగుతాం. ఇది నా సంకల్పం.. మీ మేనమామ సంకల్పం. నా చెల్లెమ్మలకు ఓ మంచి అన్నయ్య సంకల్పం అని తెలియజేస్తున్నాను.
ఈ రోజు విద్యారంగంలో ఇన్ని రకాలుగా మార్పులు చేశాం.
*ప్రభుత్వ బడులలో పెరిగిన చేరికలు...*
ఒక్కసారి గత ప్రభుత్వ హయాంలో( 2018–19 సంవత్సరం) 1 నుంచి 10 వతరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పిల్లలు కేవలం 37.10 లక్షలు అయితే... నిరుడు అంటే 2021–22లో ప్రభుత్వ బడులలో1 నుంచి 10 వతరగతి వరకు చదువుతున్న పిల్లల సంఖ్య 44.30 లక్షలకు పెరిగింది. అంటే దాదాపుగా 7.20 లక్షల మంది అదనంగా ప్రయివేటు బడులు మానివేసి ప్రభుత్వ బడులలోకి వచ్చి చేరుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఇవాళ మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది.
*విద్యారంగంలో 9 కార్యక్రమాలు...*
ప్రతిపిల్లవాడు ఇంగ్లిషు చదువులు చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలి. అప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అందుకే విద్యారంగంలో 9 ప్రధాన కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అందులో మొట్టమొదటిది మనబడి నాడు–నేడు.
2. విద్యాకానుక.
3. జగనన్న గోరుముద్ద.
4. సంపూర్ణ పోషణం.
5. అమ్మఒడి.
6. ఇంగ్లిషు మీడియం చదవులు.
ఇవికాక పెద్ద చదువులు కోసం ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని, వాటికోసం..
7. విద్యా దీవెన.
8. వసతి దీవెన ఇస్తున్నాం. ఈ ఎనిమిదే కాకుండా ఈ యేడాది తొమ్మిదోది కూడా తీసుకువస్తున్నాం.
9. బైజూస్తో ఒప్పందం.
బైజూస్తో ఒప్పందం ద్వారా మొత్తం రూపురేఖలు మారబోతున్నాయి. ఇవన్నీ కూడా చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశ్యం, తపన, తాపత్రయంతో అడుగులు ముందుకువేస్తున్నాం. ఆ పిల్లలందరూ మంచిగా ఎదగాలన్న తపనతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.
*మూడేళ్లలో విద్యారంగం మీద ఖర్చు చూస్తే....*
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో విద్యారంగం మీద, అందులో తీసుకొచ్చిన మార్పుల మీద ఏ మాత్రం ఖర్చు చేస్తున్నామని ఆలోచన చేస్తే... కేవలం మూడేళ్లలో అమ్మఒడి అనే పథకం మీద దాదాపుగా 44 లక్షల మంది తల్లులకు మేలు చేస్తూ.... తద్వారా 80 లక్షల మంది పిల్లలకు మేలు చేసేలా మీ మేనమామ ప్రభుత్వం రూ.19,617 కోట్లు ఖర్చు చేసింది.
*పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా..*
పెద్ద చదువులు ప్రతి పిల్లవాడికి ఉచితంగా రావాలన్న ఉద్దేశ్యంతో... పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా 21,55,298 మంది విద్యార్ధులు మంచి జరిగడానికి రూ.7,700 కోట్లు ఖర్చు చేశాం. వారి బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఇంజనీరింగ్, మెడిసన్ పిల్లలకు రూ.20వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలకు రూ.15వేలు, ఐటీఐ పిల్లలకు రూ.10వేలు ఇవన్నీ వసతి దీవెన పేరుతో ఒక్కో విద్యార్దికి దాదాపు రూ.20 వేలు ఖర్చు చేస్తూ.. ఈ పథకంకింద రూ.3329 కోట్లు ఇచ్చాం.
*ఒక్కసారి తేడా గమనించండి..*
గోరుముద్దకు మన ప్రభుత్వం ఏడాదికి రూ.1850 కోట్లు ఖర్చు చేస్తుంటే.... గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో మధ్యాహ్న భోజనానికి రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి. అది కూడా ముష్టివేసినట్టు వేయడమేకాకుండా 8–9 నెలలపాటు సరుకులుకు బకాయిలు పెట్టడంతో పాటు,వడ్డించే ఆయాలకు బకాయిలు పెడితే ఏమేరకు నాణ్యతతో మధ్యాహ్న భోజనం అమలు జరిగిందో గమనించండి.
అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలకు, 6 సంవత్సరాల పిల్లల వరకు ఇచ్చే మంచి పౌష్టికాహారం కోసం గతంలో పెద్దమనిషి చంద్రబాబు టైంలో ఏడాదికి రూ.500 కోట్లు కూడా ఆ పథకానికి కూడా ఖర్చు చేయని పరిస్థితి నుంచి ఇవాళ వైయస్సార్ సంపూర్ణ పోషణం పేరుతో అక్షరాలా రూ.1950 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
ఇక విద్యాకానుక విషయానికివస్తే..ఈ సంవత్సరం మనం రూ.931 కోట్లు చేస్తున్నాం. దీనికి అదనంగా బైజూస్తో ఒప్పందం చేసుకున్నాం. ట్యాబులు ఇస్తున్నాం. వీటి కోసం అదనంగా మరో రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
గతంలో ఇదే పథకానికి చంద్రబాబు హయాంలో సంవత్సరానికి రూ.120 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. తేడా ఎలా ఉందో మీరే చూడండి.
*ఆడపిల్లలకు మరింత అండగా నిలబడుతూ...*
ఇంతే కాకుండా ఆడపిల్లలకు మరింత అండగా నిలుస్తూ... బడులలో టాయ్లెట్ల నిర్మాణంతో పాటు వాటి మెయింటైనెన్స్ మీద కూడా ప్రత్యేకమైన ధ్యాస పెట్టాం. అంతే కాకుండా ప్రతి చిట్టితల్లికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశ్యంతో నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఇచ్చేలా స్వేచ్ఛ అనే పేరుతో ఓ పథకాన్ని అమలుచేస్తున్నాం. తేడా ఏంటో గమనించండి.
*ఇక చివరిగా.. రెండు మాటలు చెబుతాను.*
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే అని నేను గట్టిగా నమ్ముతాను. పేదరికం పోవాలంటే మన పిల్లలు ఆ పేదరికం జయించ గలిగేది కేవలం మంచి ఇంగ్లిషు మీడియం చదవులతోనే సాధ్యం. ఆ పిల్లలు బాగుండాలని, వారి జీవితాలు బాగుండాలని మనసా, వాచా, కర్మేణా కోరుకుంటా.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.
*ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అడిగిన పనులపై స్పందిస్తూ....*
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొన్ని పనులు అడిగారు. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అడిగారు. ఆదోనికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. అదే విధంగా ఆటోనగర్ అడిగారు. ఆ దిశగా కూడా వేగంగా అడుగులు ముందుకు వేయిస్తూ.. ఆ కార్యక్రమం కూడా చేయిస్తాం. జగనన్న కాలనీలో బీటీ రోడ్డు శాంక్షన్ చేస్తున్నాం. బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికేట్ కోసం అడిగారు. ఇది కూడా పురోగతిలో ఉంది. బోయలది కూడా ఇదే సమస్య ఉంది. ఈ కార్యక్రమంలో కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆదోని రూరల్లో తాగునీటి కోసం అడిగారు. వెంటనే సర్వే చేయించి, ప్రతి గ్రామానికీ తాగునీరు ఏర్పాటు చేస్తాం. ఆదోని పట్టణంలో రోడ్లు విస్తరణ కోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇది కూడా మంజూరు చేస్తున్నాం అని సీఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment