*ప్రాథమిక స్థాయిలో గట్టిపునాధి వేసేందుకే పాఠశాలల విలీనం*
*•ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా తెలుగు విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం*
*•ప్రైవేటు పాఠశాలల ఇండెంట్ లోపమే పాఠ్యపుస్తకాల జాప్యానికి కారణం*
*•పక్షం రోజుల్లో అన్ని ప్రైవేటు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తాం*
*రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ*
అమరావతి, జులై 25 (ప్రజా అమరావతి): ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు గట్టిపునాధి వేసేందుకే పాఠశాలలను విలీనం చేయడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా తెలుగు విద్యార్థులను తీర్చదిద్దే లక్ష్యంతోనే విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా హక్కును అందరికీ అందజేయాలనే లక్ష్యంతో జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా పాఠశాలల విలీనాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఎల్.కె.జి., యు.కె.జి.తో పాటు ఒకటి మరియు రెండు తరగతులను అన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసి ఇద్దరు అంగన్ వాడీ టీచర్లు మరియు మరో ఇద్దరు ఉపాద్యాయుల పర్యవేక్షణలో వీరికి ప్రాథమిక స్థాయిలో గట్టిపునాధి వేసే విధంగా పాఠ్యాంశాలను రూపొందించి బోధించడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ లేదా పదో తరగతి వరకూ లేదా పన్నెందో తరగతి వరకూ ఒకే చోట ఏర్పాటు చేసి మూడో తరగతి నుండే సబ్జెక్టు టీచర్లచే సి.బి.ఎస్.ఇ. సిలబస్ లో విద్యా భోధన చేయడం జరుగుతుందని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు స్మార్టు టి.వి.లు పెట్టి ఇంగ్లీషు భోధన చేయడం జరుగుతుందన్నారు. మూడో తరగతి నుండి డిజిటల్ స్క్రీన్ లను పెట్టి స్మార్టు క్లాసులను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో ఎనిమిదో తరగతి నుండి విద్యను అభ్యసించే 5 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను ఇస్తూ బైజ్యూస్ లాంటి సంస్థలచే ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా భోధన చేయడం జరుగుచున్నదన్నారు. అక్షర క్రమంలో తొలి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను విద్యా రంగంలో కూడా ప్రధమ స్థానంలో నిలిపేందుకే రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు.
*ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం…..*
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ మధ్యే పలు ఉపాధ్యాయ సంఘాలు ఉపాద్యాయుల సమస్యలను తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు. వాటన్నింటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఒక ఉపాద్యాయునికి బదులు ఇద్దరు ఉపాద్యాయలను ఇచ్చామని, 49 పిడియడ్లకు బదులు 36 పీరియడ్లకు కుదించామని, ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాద్యాయులను, పి.డి.లను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఉపాధ్యాయలకు నిరంతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేస్తే 268 పాఠశాలల నుండి అభ్యంతరాలు వచ్చాయని, ఆయా పాఠశాలల సమస్యలను పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్లకు బాద్యతలను అప్పగించడం జరిగిందన్నారు. వాటి సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు .
*ప్రైవేటు పాఠశాలల ఇండెంట్ లోపమే పాఠ్యపుస్తకాల జాప్యానికి కారణం…*
పాఠ్యపుస్తకాల విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. గతంలో ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ సిలబస్ ను డీవిఏట్ చేస్తూ పాఠ్యపుస్తకాలను గైడ్ల రూపంలో తయారు చేసుకుని ఎక్కువ ధరలకు అమ్ముకునేవారన్నారు. అందుకే ఈ ఏడాది తీసుకున్న నిర్ణయం ఏమిటంటే.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే, ఒక్క అక్షరం కూడా మార్చకుండా, పుస్తకాలు ముద్రించాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వ బడులలో వాటిని ఉచితంగా ఇస్తున్నామని, ప్రైవేటు స్కూళ్లు కూడా తమ ఇండెంట్ చెబితే, వారికి ఇస్తామని చెప్పాము. డిమాండుకు తగ్గట్టుగా పాఠ్యపుస్తకాల ఇండెంట్ ను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం పెట్టకపోవడం వల్లే పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడిందన్నారు. పాఠ్యపుస్తకాల డిమాండును బట్టి సరైన ఇండెట్లను ఈ మద్యే అన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వానికి అందజేయాలని, వాటిని తక్షణమే ముద్రించేందుకు రాష్ట్రంలోని 660 ప్రింటింగ్ ప్రెస్లను ప్రభుత్వ అదీనంలోకి తీసుకోవడం జరిగిందన్నారు. పాఠ్యపుస్తకాల ముద్రణకు అవసరమైన న్యూస్ ప్ర్రింట్ ను కూడా ప్రభుత్వమే అందజేయడం జరుగుతుందన్నారు. పక్షం రోజుల వ్యవధిలో అవసరమైన పాఠ్యపుస్తకాలన్నింటినీ ప్రైవేటు పాఠశాలలకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
addComments
Post a Comment