ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఆరా.. వరద బాధితులనుంచి వివరాల సేకరణ


డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా (ప్రజా అమరావతి);


ఆప్యాయంగా పలకరిస్తూ.. సహాయంపై ఆరా తీస్తూ... భరోసానిస్తూ..

కోనసీమ వరద బాధితప్రాంతాల్లో సీఎం టూర్‌

ఫెర్రీపై పి.గన్నవరం నియోజకవర్గంలోని లంక గ్రామాలకు సీఎం

బురద నిండిన రోడ్లపై ట్రాక్టర్‌పై ప్రయాణం

లంక గ్రామాల్లో కాలినడకన ఇంటింటికీ వెళ్లిన సీఎం

ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఆరా..  వరద బాధితులనుంచి వివరాల సేకరణ


టూర్‌ షెడ్యూల్‌లో లేని గ్రామం సందర్శన

గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల సేవలపై సీఎం ఎదుట ప్రజల హర్షధ్వానాలు

అధికార యంత్రాంగం స్పందించిన తీరుపై సీఎం ఎదుట ప్రశంసలు

వరద‡ బాధలే కాదు.. కుటుంబ సమస్యలూ చెప్పుకున్న ప్రజలు

ఇతర సమస్యలపైనా అర్జీలు స్వీకరించిన సీఎం

కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారాలు


పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో సీఎం పర్యటించిన 

వరద ప్రభావిత ప్రాంతాలనుంచి:


– గోదావరి వరదల కారణంగా ముంపునకు గురైన డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాల్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ పర్యటించారు. 


– తాడేపల్లి నుంచి ఉదయం హెలికాప్టర్‌లో పి.గన్నవరం నియోజకవర్గం జి.పెదపూడిలంకకు సీఎం చేరుకున్నారు. జోరుగా కురుస్తున్న వర్షంలోనే హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యింది. హెలిపాడ్‌ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు సీఎంను కలుసుకున్నారు. 


– అక్కడ నుంచి ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు జి.పెదపూడి లంకకు పయనం అయ్యారు. వశిష్ట గోదావరి పాయపై ఫెర్రీపై సీఎం ప్రయాణించారు. ఫెర్రీపాయింట్‌నుంచి ట్రాక్టర్‌ ద్వారా జి.పెదపూడిలంక చేరుకున్నారు. 

– మార్గంమధ్యలో రైతులతో సీఎం మాట్లాడారు. దెబ్బతిన్న పంటలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్‌ పూర్తికాగానే... రైతులను ఆదుకునే చర్యలను చేపడతామన్నారు. 


– అక్కడ నుంచి జి.పెదపూడిలంక గ్రామంలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తాను చేరుకోవాల్సిన స్థలానికి ముందుగానే సీఎం ట్రాక్టర్‌ నుంచి కిందకు దిగి.. ఒక్కొక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. గ్రామంలో వీధులన్నీ కలియదిరుగుతూ వారిని పలకరించారు. 

– వరద పరిస్థితులు, అధికార యంత్రాంగం స్పందించిన తీరు, ప్రభుత్వం నుంచి ప్రకటించిన తక్షణ సహాయం తదితర అంశాలపై గ్రామస్తులందరికీ సీఎం ప్రశ్నలు వేశారు. ఎక్కడైనా లోపం జరిగిందా? అంటూ ఆరా తీశారు. 

– సహాయక శిబిరాలకు తరలించిన తీరు, అక్కడ భోజన సదుపాయాలు తదితర అంశాలపై ప్రజలనుంచి అడిగితెలుసుకున్నారు. 

– సంబంధిత జిల్లాకలెక్టర్‌ను చూపిస్తూ.. ఈయన బాగా పనిచేశాడా?మీకు మంచి చేశాడా? అంటూ సీఎం ప్రశ్నించారు. 

– వరదల సమయంలో ప్రభుత్వం భేషుగ్గా పనిచేసిందని, గతంలో ఎప్పుడూ కూడా ఇలా పనిచేసిన దాఖలాలు లేవని వారు సీఎంకు చెప్పారు.

– తక్షణ సహాయంగా ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, సరుకులు, పాలు, అలాగే రూ.2వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా ప్రతి ఇంటికీ అందిందంటూ సంతృప్తి వ్యక్తంచేశారు. సహాయక శిబిరాల్లో భోజనం నాణ్యత కూడా బాగుందంటూ సీఎంకు చెప్పారు. 

– ఇదే సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఈ విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారంటూ సీఎం ఎదుట ప్రశంసలు కురిపించారు. ముంపు బాధితులను తరలించడంలో, రేషన్, ప్రకటించిన సరుకులు, ఇంటికి రూ.2వేల పంపిణీలో వాయువేగంతో పనిచేశారని వారు సీఎంకు వివరించారు. 

– తర్వాత సీఎం జి.పెదపూడిలంకలోనే గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సహాయ కార్యక్రమాలుజరిగాయా? లేవా? రేషన్, ప్రకటించిన సరులకు అందాయా? లేవా? ఇంటికి రూ.2వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందిందా? లేదా? అని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వం , అధికార యంత్రాంగం స్పందించిన తీరుపట్ల... సంతృప్తి వ్యక్తంచేస్తూ గ్రామ ప్రజలు హర్షధ్వానాలు చేశారు. 

– తిరుగు ప్రయాణంలోకూడా పెద్ద ఎత్తున ఇళ్లపైకి చేరుకున్న ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. 


– తర్వాత సీఎం, జి.పెదపూడి లంక నుంచి అరిగెలవారిపేట చేరుకున్నారు. వరద కారణంగా... లంక గ్రామాల మీద నుంచి వరదనీరు ప్రవహించడంతో మొత్తం రోడ్డు అంతా బురదమయం అయింది. ట్రాక్టర్‌పై అతికష్టమ్మీద సీఎం ఆ గ్రామానికి చేరుకున్నారు. మార్గం మధ్యలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అరిగెల వారిపేటలో ముంపు బాధితులతో సీఎం మాట్లాడారు. 

– తర్వాత సమీంలోనే ఉన్న ఉడుముల్లంకకు సీఎం చేరుకున్నారు. 

అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సహాయ పునరావాస కార్యక్రమాల గురించి ఆరాతీశారు. 

– సీఎంకు రాక సందర్భంగా చాలామంది చిన్నారులు ఆయనకు  పుష్పుగుచ్ఛాలు అందించారు. సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. 

– వరద కారణంగా పశువులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకున్న జాగ్రత్తలను అధికారులు వివరించారు. వాటికి పంపిణీచేస్తున్న దాణా, గ్రాసం పంపిణీపై సీఎంకు వివరాలు అందించారు. వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

– ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్య సిబ్బంది తెలిపారు. సరిపడా మందులను నిల్వ ఉంచుకోవాలని, పాముకాట్లు జరిగిన పక్షంలో వారికి మంచి వైద్యం అందించడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం అక్కడి వారిని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఇంజక్షన్లనుకూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 


– ఉడుముల్లంకతో ముగించుకుని సీఎం రాజోలు వెళ్లాల్సి ఉంది. అయితే షెడ్యూలులోలేని బూరుగులంకకు సీఎం ఆకస్మికంగా వెళ్లారు. అక్కడ సహాయ కార్యక్రమాలు జరిగిన తీరును అడిగితెలుసుకున్నారు. 

– వరదల కారణంగా ఆ గ్రామానికి వెళ్లాల్సిన రోడ్డుకూడా దెబ్బతింది. దీంతో సీఎం... గట్టుపై నుంచి నడుచుకుంటూ గ్రామంలోకి ప్రవేశించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ హయాంలో తమకు ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పుడు కనిపిస్తున్న ఇళ్లు చాలావరకు ఆయన హయాంలోనే కట్టుకోగలిగామని అంటూ గుర్తుచేసుకున్నారు. వరదల సమయంలో అధికారయంత్రాంగం అండగా నిలిచారన్నారు. ప్రకటించిన సహాయం అందిందంటూ సీఎంకు వివరించారు. 


తర్వాత సీఎం రాజోలులోని వాడ్రేపల్లి చేరుకున్నారు. అక్కడ నుంచి మేకలపాలెం చేరుకుని వరద ప్రభావాన్ని పరిశీలించారు. 

గోదావరి కట్టపై ఉన్న వారికి కొత్తగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 

– అక్కడే ఉంటున్న కుటుంబాలను పరామర్శించారు. నాగరాజు– సత్యవతి కుటుంబాన్ని పరామర్శించారు. సహాయ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు బాగా పనిచేశారని ఆకుటుంబం సమాధానం ఇవ్వడంతో, సంబంధిత వాలంటీర్‌ గీతను పిలిచి సీఎం అభినందించారు. 

– వరద బాధిత ప్రాంతాల్లో నష్టం మరియు, చేపట్టిన సహాయక కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. 

– తర్వాత సీఎం నేరుగా రాజమండ్రి ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌లో సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

Comments