చింతూరు,అల్లూరి సీతారామరాజు జిల్లా (ప్రజా అమరావతి);
*అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*దారిపొడువునా ప్రజలతో మమేకమైన సీఎం*
*చింతూరు నుంచి చట్టి వరకు ముఖ్యమంత్రికి బారులుతీరి స్వాగతం పలికిన ప్రజలు*
*వరదసహాయక చర్యలపై నేరుగా ప్రజల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకున్న సీఎం*
*వరద సాయం అందిందని.. కలెక్టర్ సహా అధికారుల గోదావరి వరదల సహాయక చర్యల్లో వ్యవహరించిన తీరును ప్రశంసించిన వరద ప్రభావిత గ్రామాల ప్రజలు.*
*వరద సమస్యలతో పాటు పలు ఇతర సమస్యలపైనా సీఎంకు విజ్ఞప్తులు, అర్జీలు.*
*పలు సమస్యల పరిష్కరానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసిన సీఎం
*
*చింతూరులో హెలీప్యాడ్ వద్ద వరద తీవ్రత, సహాయ చర్యలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన సీఎం*
*సీఎంకు వరద ప్రభావం అనంతర సహాయ చర్యలపై వివరాలందించిన కలెక్టర్*
*అనంతరం గోదావరి ముంపునకు గురైన కోయగురు గ్రామంలో ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సీఎం*
*కొయగురు నుంచి చట్టి వరకు దారిపొడవునా వరద బాధితులను నేరుగా కలుస్తూ.. వారికి భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ సాయంపై స్వయంగా తెలుసుకన్న సీఎం*
*చట్టిలో వరద ప్రభావిత ప్రజలతో సీఎం ముఖాముఖి.*
*వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన సీఎం*
*అల్లూరి సీతారామరాజు జిల్లా, రంçపచోడవరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం*
రాజమండ్రి నుంచి ఉదయం హెలీకాప్టర్లో బయలుదేరిన సీఎం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు చేరుకున్నారు. హెలీప్యాడ్ పక్కనే ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణంలో వరద ప్రభావం, సహాయక చర్యలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. స్ధానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సీఎంకు వరద ప్రభావం అనంతర సహాయ చర్యలపై వివరాలందించారు.
విలీన గ్రామాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తాము.. తెలంగాణాలో కలవానుకుంటున్నట్టు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.
ఎటపాక జడ్పీటీసీ సుస్మిత సీఎం శ్రీ వైయస్.జగన్ని కలిసి.. దివంగత నేత స్వర్గీయ వైయస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్తో తాను, తన సోదరి చదువుకున్నామని చెప్పారు. ఇడుపులపాయ త్రిపుల్ఐటీలో తన సోదరి చదువుకుందని... దివంగత నేత వైయస్సార్ చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపింది. తాను ప్రస్తుతం ఎటపాక జెడ్పీటీసీగా ఉన్నానని తెలిపారు.
ముంపు మండలాలకు సంబంధించి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని స్ధానిక ప్రజా ప్రతినిధులు కోరగా... ఎటపాక, చింతూరు, పోలవరం, వీఆర్ పురం మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించారు.
అక్కడి నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రి గుడివాడ అమర్నాథ్, స్ధానిక ప్రజా ప్రతినిధులతో కలసి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు.
తొలుత సీఎం కొయగురులో వరద పరిస్థితులు, అధికారులు అందించిన సహాయ చర్యలపై మహిళలు, స్ధానికులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం అందిందా ? లేదా? సహాయ శిబిరాల్లో అధికారులు ఎలా చూసుకున్నారు ? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ను చూపిస్తూ... గడిచిన 20 రోజులగా కలెక్టర్ ఇక్కడే మీ దగ్గరే ఉన్నాడని.. మీకు అన్ని రకాలుగా సాయం చేశారా ? అని సీఎం ప్రశ్నించారు. ప్రజలను పెద్ద ఎత్తున స్పందిస్తూ.... మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం, అధికారులు సాయం చేశారని చెప్పారు.
అనంతరం కోయిగురు నుంచి నిమ్మలగూడెం, చింతూరు, చట్టి గ్రామాలలో దారిపొడవునా ముఖ్యమంత్రి ప్రజలతో మమేకమయ్యారు.
పలుదఫాలుగా బస్సు దిగిన సీఎం నేరుగా మహిళలు, మంపు గ్రామాల ప్రజల వద్దకు వెళ్లి... వరద పరిస్థితి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అధికారులు వ్యవహరించిన తీరుపై నేరుగా మాట్లాడారు.
ముంపు గ్రామాలకు సంబధించి 2008 డిఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్ ఇవ్వడం లేదని శ్రీనివాస్ అనే అభ్యర్ది సీఎం దృష్టికి తీసుకురాగా.. వెంటనే సమస్యను పరిష్కరించాలని సీఎం కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
అక్కడి నుంచి చట్టి చేరుకున్న సీఎం గ్రామ ప్రజలుతో సమావేశమయ్యారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. వరద తీవ్రత తగ్గిన నేపధ్యంలో నేటినుంచి నష్టంపై ఎన్యూమరేషన్ ప్రారంభమవుతుందని సీఎం తెలిపారు.
తాటాకుల ఇళ్లకు నష్టపరిహారంగా గతంలో రూ.4వేలు ఇస్తే.. ఇప్పుడు దానిని రూ.10వేలు చేశామని ప్రకటించారు.
ఇవాల్టి నుంచి నష్టం అంచనాలు త్వరితగతిన చేపడతారని.. ఎవరైనా మిస్ అయినా మరలా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మొత్తం ప్రక్రియను ఎనిమిది వారాలు తిరక్కమునుపే పూర్తి చేసి నష్టపోయిన వాటన్నింటికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. తాను చేయగలిగినదంతా చేస్తానని... మీరు అడగపోయినా మునుపెన్నడూ లేని విధంగా సాయం చేశామని సీఎం తెలిపారు. గతానికి ఇప్పటికీ తేడా ప్రస్ఫుటంకా కనిపిస్తోందన్నారు.
చివరగా సీఎం చట్టి గ్రామం నుంచి చింతూరు హెలీప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడ నుంచి హెలీకాప్టర్లో ఏలూరు జిల్లా వేలేరు పాడు బయలుదేరి వెళ్లారు.
addComments
Post a Comment