పశువుల అక్రమ రవాణా మరియు పశువధకు ఎవ్వరూ పాల్పడ రాదు


విజయవాడ (ప్రజా అమరావతి);

పశువుల అక్రమ రవాణా మరియు పశువధకు ఎవ్వరూ పాల్పడ రాదని అందరూ ఆంధ్ర ప్రదేశ్ గోవధ నిషేధ మరియు జంతు సంరక్షణ చట్టం-1977 చట్టాన్ని గౌరవిస్తూ వాటి నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ కె. వి.  రాజేంద్రనాధ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈసందర్భంగా  ఒక ప్రకటనలో వివరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం "ఆంధ్ర ప్రదేశ్ గోవధ మరియు జంతు సంరక్షణ చట్టం-1977" లోని సెక్షన్-5 ప్రకారం ఆవు లేదా గేదె దూడను వధించడం నిషేదించబడినదని డి.జి.పి. తెలిపారు.  ఈ చట్టం  ప్రకారం ఆవు లేదా గేదె దూడను వధించడం ప్రస్తుతానికి ఏ ఇతర చట్టంలో లేనప్పటికీ,  ఆచార సంప్రదాయాల నెపంతో ఏదైనా లేదా దానికి విరుద్ధంగా ఏ వ్యక్తీ పశువధ చేయకూడదు లేదా వధ ను ప్రోత్సహించకూడదు అలాగే వధకు సహకరించకూడదని చట్టం తెలుపుతున్నది.   

ఆంధ్ర ప్రదేశ్ గో హత్యా నిషేధం మరియు జంతు సంరక్షణ చట్టం - 1977 సెక్షన్ 6 ప్రకారం సంబంధిత అధీకృత అధికారి నుండి ధ్రువీకరణ పత్రం లేకుండా వధించ రాదు.  అలాగే సంబంధిత సమర్ధ అధికారి నుండి వధ స్థలం సర్టిఫికెట్ పొందడం అనివార్యమని అలాగే జంతు రవాణా చేయడానికి ఫిట్ నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొంది ఉండాలని, మరియు లారీలో 6 కంటే ఎక్కువ జంతువులను రవాణా చేయరాదని, దీనిని అతిక్రమించడం చట్టరీత్యా నేరమని డి.జి.పి. తెలిపారు. 


జంతురవాణాను, సంతలకు తరలించడాన్ని నిరోధించే ఉద్దేశంతో నగరాలు, పట్టణాల్లోని హై వే ప్రవేశ ద్వారాల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం అక్కడ ఎస్.ఐ., కానిస్టేబుల్ తో కూడిన ప్రత్యేక స్క్వాడ్ లను ఏర్పాటు చేయడం పై ఇప్పటికే అందరు  సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ లను, నగర  కమిషనర్ అఫ్ పోలీస్  లను ఆదేశించామని అయన తెలిపారు.  అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారిపై ప్రాసిక్యూషన్ చేసేందుకు ఎస్.పి. ల నుండి ఎస్.హెచ్.ఓ. స్థాయి వరకు సూచనలు జారీ చేయడం జరిగిందని డి.జి.పి. తెలిపారు.  వివిధ జంతువుల ఉల్లంఘన కేసులన్నీ సమర్థవంతంగా తనిఖీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ కె.వి.  రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు.  


Comments