జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష రీసర్వే పై వర్క్షాప్ ను ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ (ప్రజా అమరావతి);
పారదర్శక పాలన, జవాబుదారీతనం, అవినీతి రహితంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గడిచిన మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, వందేళ్ల తర్వాత చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష’కార్యక్రమం ద్వారా భూముల రీసర్వే చరిత్రాత్మకం, ఎంతో ప్రాముఖ్యమైనదని ఆయన తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష రీసర్వే’ పై ఒకరోజు వర్క్షాప్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల తర్వాత దాదాపు రూ.140 కోట్ల ఖర్చుతో ఆధునిక సమగ్ర భూ రీసర్వే నిర్వహించి, ప్రజలకు భూమి రికార్డులను ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం
చరిత్రపుటల్లో నిలిచిపోతుందని తెలిపారు. లేఅవుట్లు, భూముల సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇకపై ప్రభుత్వ భూముల కబ్జాకు కాలం చెల్లిందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహిత పాలనతో తమ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో భూ సర్వే చేపట్టి వేగవంతంగా పూర్తిచేశామన్నారు. ఇక అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని కోరారు. సర్వేలో భవనాలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఖాళీ స్థలాలు.. ఇలా వేటికవి ప్రత్యేకంగా గుర్తిస్తారని తెలిపారు. ఇకపై ఏ సమస్యలు లేకుండా ఎవరి ఆస్తిపై వారికి అన్ని వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. గత శతాబ్ధం క్రితం ఇంత అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు లేదని, ఇప్పడు సాంతకేతికను ఉపయోగించి రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై ఈ సర్వే ప్రక్రియ అమలుపై వర్క్షాప్ లో భాగంగా డ్రోన్ ఉపయోగించి ఆస్తుల కొలతలు తీసుకోవడం, రికార్డుల ప్రకారం రోడ్లు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల గుర్తింపు, ఆయా సర్వే నంబర్లుపై తర్ఫీదునిస్తారని తెలిపారు. ప్రతి రికార్డును డిజిటలైజేషన్ చేస్తామన్నారు. మొదటగా మాస్టర్ ట్రైనర్స్ కి శిక్షణ, తర్వాత పురపాలక సంఘాల్లోని అవసరమైనంత మంది సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇస్తారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని.. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
స్సెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా మరో 6 నెలల్లో భూ రీసర్వే పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేలా అధికారులందరూ కృషి చేయాలని తెలిపారు. సర్వేలో అనుభం ఉన్న రెవెన్యూ, సీసీఎల్ఏ, ఇతర విభాగాల సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. చట్టాలను అనుసరించి సమర్థవంతంగా రీసర్వే చేపట్టాలని తెలిపారు. ప్రతి వారం అధికారులు కార్యక్రమం పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, అడిషనల్ సీసీఎల్ఏ కమ్ సెక్రటరీ బాబు ఏ., టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్జె. విద్యుల్లత, విజయవాడ నగర కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, రాష్ట్రం లోని వివిధ మునిసిపల్ కార్పొరేషన్ లు, మునిసిపాల్టీల కమిషనర్ లు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment