ఏపీఐఐసీ' కల్పించిన రాయితీ వెసులుబాటుపై పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన




*ఏపీఐఐసీ చరిత్రలో సరికొత్త రికార్డ్*


*ఒకే నెలలో రూ.40 కోట్ల ఆస్తి పన్ను వసూళ్ళు*


*అత్యధిక పన్ను వసూలైన నెలగా 'జూలై-2022' రికార్డ్*


*'ఏపీఐఐసీ' కల్పించిన రాయితీ వెసులుబాటుపై పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన*


*జూలై 31లోగా చెల్లింపులు జరిపితే ఆస్తి పన్నుపై 5శాతం రాయితీగా ఏపీఐఐసీ ప్రకటన*


*పరిశ్రమల నుంచి గతంలో ఎన్నడూ  లేనంతగా వసూలైన  ఆస్తి పన్ను*


అమరావతి, ఆగస్ట్, 01 (ప్రజా అమరావతి): పారిశ్రామికవేత్తలు తమ ఆస్తి పన్ను చెల్లింపులు జూలై 31,2022 లోగా ఒకేసారి చెల్లించినట్లయితే వారికి మొత్తం చెల్లింపులో 5శాతం రాయితీ వెసులుబాటును ఏపీఐఐసీ కల్పించింది. ఈ పిలుపుపై స్వతంత్రంగా స్పందించి సద్వినియోగం చేసుకున్న పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో అత్యధిక ఆస్తి పన్ను వసూళ్లు జరగడం ఇదే ప్రథమం .  తద్వారా కట్టాల్సిన మొత్తం బకాయిలో 5 శాతం తగ్గించుకుని పారిశ్రామికవేత్తలు కూడా ఎంతగానో లబ్ధి పొందినట్లయింది. ఏపీఐఐసీ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏకంగా రూ.40 కోట్లు ఆస్తి పన్ను చెల్లింపులు జరగడం ఓ రికార్డుగా మారింది.  జూన్ 27వ తేదీ నుంచి జూలై31 వ తేదీ వరకూ కొనసాగిన ఈ డ్రైవ్ లో స్వయంగా  భాగస్వామ్యమై పారిశ్రామికవేత్తలు తమ ఆస్తి పన్ను చెల్లింపుల బాధ్యతను పూర్తి చేశారు. 


 విశాఖ స్పెషల్ జోన్ అత్యధికంగా రూ.13 కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసి 15 జోన్లలోనే అగ్రస్థానంలో నిలిచింది. రూ.8 కోట్లు వసూలు చేసి తిరుపతి జోన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.  రూ.7 కోట్లతో విశాఖ రెగ్యులర్ జోన్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. రూ.2 కోట్లకు పైన వసూలు చేసి , కాకినాడ, విజయవాడ, శ్రీకాకుళం జోన్ లు  తర్వాత స్థానాల్లో నిలిచాయి. దీంతో ఒకే నెలలో అత్యధికంగా రూ.40 కోట్ల ఆస్తి పన్నును చరిత్రలో మొదటిసారిగా ఏపీఐఐసీ వసూలు చేసింది. గతంలో  ఏపీఐఐసీ ఆస్తి పన్నుల చెల్లింపు మొత్తం ఏడాదికి సగటున కేవలం రూ. 70 కోట్లు మాత్రమే ఉండేది. కానీ ఈ సారి ఏకంగా జూలై నెల పన్ను వసూళ్ళే రూ.40 కోట్లు కావడం గమనార్హం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఏ పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలగకుండా ఆన్ లైన్ ద్వారానే రూ.35 కోట్ల పైన పన్ను చెల్లింపులు జరగడం మరో చెప్పుకోదగ్గ విషయం. మిగతా రూ.5 కోట్లు బ్యాంకులు, చెక్కులు, నగదు ద్వారా పారిశ్రామికవేత్తలు ఆస్తి పన్ను చెల్లించారు. 


ప్రత్యేక చొరవతీసుకుని ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్ తో పాటు ఆస్తి పన్ను చెల్లింపుల ప్రక్రియలోనూ  ఉత్తమ పనితీరు కనబర్చిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లను ఆగస్ట్ 15 , స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి బహుమతులు అందజేయనున్నట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి స్పష్టం చేశారు. 


పారదర్శకంగా ఆస్తి పన్నులను డిజిటల్ గా చెల్లించడంలో జోనల్ మేనేజర్ల కృషిని ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది అభినందించారు. పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని  మరికొంత సమయం  ఈ విధమైన చెల్లింపుల గడువు పొడిగించేందుకు గల అవకాశాలను ఏపీఐఐసీ పరిశీలిస్తున్నట్లు ఎండీ వెల్లడించారు.



Comments