జిల్లాను అభివృద్ది పధంలోకి తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి


నెల్లూరు (ప్రజా అమరావతి); 

జిల్లాను అభివృద్ది పధంలోకి తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల



ని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి,  జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు పేర్కొన్నారు.


శనివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు అధ్యక్షతన జిల్లా అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో  నాడు- నేడు పనుల పురోగతి , హౌసింగ్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు, జల వనరుల శాఖ, జిల్లానీటి యాజమాన్య సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ,  ఆర్.డబ్ల్యూ.ఎస్., రెవెన్యూ, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థల ద్వారా అమలు జరుగుచున్న పనుల పురోగతిపై జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు లతో కలసి  శాఖల వారీగా సమీక్షిండంతో పాటు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు  సమావేశం దృష్టికి తీసుకు వచ్చిన పలు సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని  సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం  జరిగింది. 


ఈ సంధర్భంగా జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశంలో జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు జరుగుచున్న సంక్షేమ  కార్యక్రమాలపై మరియు దీర్గకాలంగా  అపరిష్కృతంగా వున్న పలు సమస్యలను   సమగ్రంగా చర్చిండంతో పాటు ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన  సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం, తీసుకున్న చర్యలను  నివేదిక రూపంలో  సంబంధిత ప్రజాప్రతినిధులకు తెలియచేయడం జరుగుతుందన్నారు. దివంగత నేత స్వర్గీయ వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారు నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ లకు శంఖుస్థాపన చేస్తే, వారి తనయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ మొదటి వారంలో నెల్లూరు బ్యారేజి , మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు తెలిపారు.  రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా పేద కుటుంబాలకు   సంక్షేమ పధకాలను అమలు చేయడం జరుగుచున్నదని,  అర్హత వుండి సాంకేతిక కారణాల వలన సంక్షేమ పధకం అందకపోతే,  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని,  వారికి సంక్షేమ పధకాలను అందచేయడం జరుగుచున్నదన్నారు. ప్రజలు కోరుకున్న అభివృద్ది కార్యక్రమాలను చేపట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, అలాగే ప్రతి శాసన సభ్యునికి రెండు కోట్ల రూపాయలు  కేటాయించినట్లు మంత్రి శ్రీ రాంబాబు తెలిపారు.  ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి  ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 


రాష్ట్ర వ్యవసాయ,  సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్  శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా   సంక్షేమ పధకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ రోజు జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశంలో  శాసన సభ్యులు  అనేక రకాలైన సూచనలు చేయడంతో పాటు గ్రామాల్లో నెలకొని వున్న అనేక  సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. శాసన సభ్యులు తెలిపిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం,  పరిష్కరించలేని సమస్యలను ఏ కారణం వలన పరిష్కరించలేకపోవడం జరిగిందో  తెలియచేయడం జరుగుతుందన్నారు. 


తొలుత జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ,  జిల్లాలో వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా రంగాల అభివృద్దికి కృషి చేయడం జరుగుచున్నదన్నారు. పరిపాలన వికేంధ్రీకరణలో భాగంగా  కొత్తగా జిల్లాలు ఏర్పడిన  తరువాత జనాభాలో అత్యధిక జనాబా కలిగి,  రెండు ప్రధాన జలాశయాలు, ప్రధాన ఓడ రేవులతో  అత్యంత ప్రాధాన్యత కల్గిన  జిల్లాగా ఏర్పడిందన్నారు.  


జిల్లాలో  శాసన మండలి  సభ్యులు శ్రీ తూమాటి మాధవరావు,  వెంకటగిరి, ఉదయగిరి,  కందుకూరు, నెల్లూరు రూరల్, ఆత్మకూరు  శాసన సభ్యులు  శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి, శ్రీ  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  శ్రీ  మేకపాటి విక్రమ్ రెడ్డి జిల్లాలో జరుగుచున్న నాడు- నేడు పనుల పురోగతికి సంబందించి, జగనన్న లే అవుట్స్ లో చేపడుతున్న గృహ నిర్మాణాలకు సంబందించి,   ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు,  సాగునీరు, త్రాగునీరు పధకాల పనుల పురోగతి, జిల్లానీటి యాజమాన్య సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ,  ఆర్.డబ్ల్యూ.ఎస్., జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలు, పనులకు సంబందించి, చుక్కల భూముల సమస్యలపై, ఓటిఎస్ పధకంనకు సంబంధించి   పలు సమస్యలను  జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  దృష్టికి తీసుకువచ్చి,  సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను  కోరారు. 


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్, నెల్లూరు  నగర కార్పొరేషన్ కమీషనర్ శ్రీ డి. హరిత, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, నెల్లూరు, కందుకూరు ఆర్.డి.ఓ లు శ్రీ మాలోల, శ్రీ సుబ్బారెడ్డి,  డిసిఎంఎస్. చైర్మన్ శ్రీ వీరి చలపతి రావు, విజయ డైరీ ఛైర్మన్ శ్రీ రంగారెడ్డి, ఆప్కాఫ్ ఛైర్మన్ శ్రీ అనిల్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు.


Comments