*కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది : చంద్రబాబు
*
కుప్పం, (ప్రజా అమరావతి) : పోలీసులు సరిగా పనిచేయకుంటే ప్రజా తిరుగుబాటు ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో తన రెండో రోజు పర్యటనకు వైసీపీ అడ్డంకులు సృష్టించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేయడం, తెదేపా ఫ్లెక్సీల చించివేయడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్టాండ్ వద్ద రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. తప్పు చేసిన పోలీసులను దోషులుగా నిలబెడతామమని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పం ప్రజలెప్పుడూ ప్రశాంత జీవితం గడిపారని చెప్పారు. ఎప్పుడూ ఈ తరహా దాడులు కుప్పంలో చూడలేదని, ఈ పోలీసుల కంటే బ్రిటీష్ వాళ్లే నయమని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే వైసీపీ ఈ తరహా ఘటనలకు పాల్పడుతోందన్నారు. వైసీపీ పతనానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని, కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. బుధవారం రామకుప్పం మండలంలో జరిగిన తన సమావేశం వద్ద వైసీపీ జెండాలు ఎగురవేస్తారా? అని మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. పట్టణంలో శాంతిభద్రతలు కాపాడాలని, వైసీపీ గూండాలకు వత్తాసు పలకొద్దని పోలీసులను కోరారు. రౌడీలు, గూండాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని చెప్పారు.
addComments
Post a Comment