జగనన్న విదేశీ విద్యా దీవెన కొత్త పథకం



జగనన్న విదేశీ విద్యా దీవెన కొత్త పథకం


అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దీంతో సంబంధం లేదు

ఈ రెండు పథకాలు ఒకటేనని టీడీపీ చేస్తున్న ప్రచారం నిజం కాదు

మంత్రి మేరుగు నాగార్జున స్పష్టీకరణ.

అమరావతి, ఆగష్టు 17 (ప్రజా అమరావతి): విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేసారు.అవాస్తవాలు అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలను గందరగోళానికి గురి చేసి తద్వారా రాజకీయంగా లాభం పొందాలని చూసే చంద్రబాబు నాయుడు, పచ్చ పార్టీ నేతలు ఇప్పుడు మరో కొత్త అబద్దాన్ని ప్రచారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ‘ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’ అనే ఒక పథకం ఉండేదనడం వాస్తవం, కానీ ఆ పథకానికీ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ‘ జగనన్న విదేశీ విద్యా దీవెన ’ పథకానికీ ఎలాంటి సంబంధం లేదని బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో నాగార్జున పేర్కొన్నారు. ఇవి రెండు వేరు వేరు పథకాలని చెప్పారు. ఈ రెండు పథకాలకు సంబంధించిన నియమాలు, విధి విధానాలు వేర్వేరు అని, అంబేద్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం కేవలం ఎస్సీలు, ఎస్టీలకు మాత్రమే చెందింది కాగా జగనన్న విదేశీ వసతి దీవెన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలతో పాటుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి కూడా సంబంధించిన పథకమని తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం కేవలం 15 దేశాలకు మాత్రమే వర్తించిన పథకమని, ఈ పథకం ద్వారా  ఏడాదికి ఎస్సీల్లో 300 మందికి. ఎస్టీలలో 100 మందికి మాత్రమే అవకాశం కల్పించే పరిమితమైన  పరిధి కలిగిన పథకం అని చెప్పారు. అయితే జగనన్న విదేశీ విద్యా దీవెన  పథకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో 1 నుంచి 200 వరకూ క్యూఎస్ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీలన్నింటికీ వర్తిస్తుందని,  ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాలకు చెందిన వారు ఎంత మంది అర్హత సాధిస్తే అంతమందికీ కూడా విదేశీ విద్యను అందించే అపరిమితమైన అవకాశాలను కల్పించే పథకం అని నాగార్జున వివరించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య నిధి అనేది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం అని తెలిపారు. జగనన్న  విదేశీ విద్యా దీవెన పథకం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాలకు చెందిన పిల్లలు ఎవరైనా క్యూ.ఎస్ ర్యాంకింగ్ లో 1 నుంచి 100 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే కోటి రూపాయలైనా సరే ఆ ఫీజు మొత్తాన్ని నూటికి నూరు శాతం రీయంబర్స్ మెంట్, అలాగే క్యూ.ఎస్. ర్యాంకుల్లో 101 నుంచి 200 లోపు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే 50 లక్షల రుపాయల దాకా ఫీజు రీయంబర్స్ మెంట్ చేసే పథకమని స్పష్టం చేసారు. 6 లక్షల రుపాయలకు లోపు ఆదాయం కలిగిన వారికి మాత్రమే లబ్ది కలిగించేది అంబేద్కర్ ఓవర్సీస్ పథకమైతే, 8 లక్షల రుపాయల దాకా ఆదాయం ఉన్న వారికి కూడా విదేశీ విద్యను అభ్యసించే అవకాశం కల్పించేది జగనన్న విదేశీ విద్యా పథకం అని మంత్రి తెలిపారు.. గతంలో విదేశీ విద్య పేరిట జరిగిన అక్రమాలు మళ్లీ జరగడానికి అవకాశం లేకుండా పైరవీలు, సిఫార్సులకు వీలు లేని విధంగా, ప్రతిభ కలిగిన పేద పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు పెట్టే విధంగా, పేదరికంలో ఉన్న వారు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ప్రతి ఒక్కరికీ అవకాశం అందే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో విశాలధృక్పధంతో దూరదృష్టితో రూపొందించి అమలు చేయాలని నిర్ణయించిన కొత్త పథకం జగనన్న విదేశీ విద్యా దీవెన అని నాగార్జున విపులీకరించారు. ఇది కొత్త పథకం కావడంతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం జరిగిందే తప్ప అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి పేరు మార్చడం జరగలేదని  స్పష్టం చేసారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికీ, జగనన్న విదేశీ వసతి దీవెనకూ ఎలాంటి సంబంధం లేదని, ఈరెండు పథకాలు ఒకటేనని చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట నూటికి నూరు పాళ్లు అబద్దమని కొట్టిపారేసారు. ఒక పథకానికి ఉన్న పేరును మార్చి దానికి తన పేరు పెట్టుకోవాల్సిన దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య పేరుతో అనర్హత కలిగిన వారిని అందలం ఎక్కించి, పైరవీలు, సిఫార్సులకు పెద్ద పీట వేసి ఎన్నో అక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు చెందిన సొమ్మును దుర్వినియోగం చేసిన కారణంగా ప్రస్తుతం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ద్వారా విచారణ జరుగుతోందని వెల్లడించారు 

అంబేద్కర్ పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదు:

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న జనరంజకమైన పథకాలను అభాసుపాలు చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఆ కుట్రలలో భాగంగానే విదేశీ విద్య పథకానికి ఉన్న అంబేద్కర్ పేరును తొలగించి అంబేద్కర్ గారిని పీఎం గారు అవమానించారనే ఆరోపణలను తెరమీదికి తీసుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ను ఎంత గొప్పగా గౌరవిస్తారో, ఆయన భావజాలానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో రాజ్యాధికారాన్ని పంచడంలో, పదవులు కేటాయించడంలో, ఉద్యోగాలను ఇవ్వడంలో సీఎం పాటించే సామాజిక న్యాయాన్ని చూస్తే అర్థమౌతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి కి బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే అపారమైన గౌరవం ఉంది కాబట్టే దేశంలో మరెక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారని, ఈ విగ్రహం దాని చుట్టూ ఏర్పాటు చేయబోయే అంబేద్కర్ స్మృతి వనం కారణంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేక స్థానం దక్కనుందని గుర్తు చేసారు. అంబేద్కర్ అంటే అపారమైన గౌరవం ఉంది కాబట్టే సాంఘిక సంక్షేమ గురుకులాలకు అంబేద్కర్ పేరు పెట్టారని చెప్పారు. చంద్రబాబు తన హయాంలో ఎస్సీలకు సంబంధించి వందలాది హాస్టళ్లను మూసేసి అంబేద్కర్ ను అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం హాస్టళ్లను నాడు-నేడు పథకంలో చేర్చి వాటికి కొత్తరూపురేఖలు ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేసారని ప్రస్తావించారు. అంబేద్కర్ అంటే అత్యంత గౌరవాభిమానాలు ఉన్నాయి కాబట్టే కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని నాగార్జున  తెలిపారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ తన అనుచరులతో అరాచకం సృష్టించిన చంద్రబాబు నాయుడుకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని దళితులను అవమానించి, తన మంత్రివర్గంలో చివరి ఆరు నెలల వరకూ గిరిజనులకు స్థానం కూడా ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు నాయుడుకు అంబేద్కర్ పేరెత్తే అర్హత కూడా లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఈవిధంగా మా ముఖ్యమంత్రి గారిని అప్రతిష్టపాలు చేయాలని, అంబేద్కర్ గారిని అవమానించాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.ఇకనైనా ఇలాంటి గోబెల్స్ ప్రచారాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు, ఆయన వందిమాగధులకు నాగార్జున హితవు చెప్పారు.

Comments