*పేదప్రజలకి వరం.. సంజీవని ఆరోగ్య రథం*
- దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య రథం ప్రారంభించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
- డాక్టర్, ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్తో ఆరోగ్యరథం ద్వారా వైద్యసేవలు
-200కి పైగా రోగనిర్దారణ పరీక్షలు చేసి..ఉచితంగా మందులు పంపిణీ
- త్వరలో మంగళగిరి, తాడేపల్లి, సంజీవని ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు
- ``అందరికీ ఆరోగ్యమస్తు-ప్రతీ ఇంటికీ శుభమస్తు`` ఇదే నారా లోకేష్ లక్ష్యం
దుగ్గిరాల (ప్రజా అమరావతి);
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్గా కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు. చిన్న చిన్న సమస్యలకీ ఆస్పత్రుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, నియోజకవర్గంలో గ్రామీణుల కోసం మొదటిసారిగా ``సంజీవని ఆరోగ్య రథం`` పేరుతో మొబైల్ హాస్పిటల్ ఆలోచనకి కార్యరూపం ఇచ్చారు. దుగ్గిరాల టిడిపి కార్యాలయం వద్ద పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సంజీవని ఆరోగ్య రధాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. లక్ష్మి నరసింహ గోల్డ్ స్మిత్ సొసైటీ అధ్వర్యంలో ఆరోగ్య రథం సేవలు నిర్వహించనున్నారు. ఆరోగ్యరథంలోని అత్యాధునిక చికిత్స పరికరాలు, పరీక్ష యంత్రాలు, ఎమర్జెన్సీకి అవసరమైన సామాగ్రిని నారా లోకేష్ సొంత ఖర్చులతో సమకూర్చారు. ఈ వాహనంలో ఒక జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్ ఉంటారు. డాక్టర్ ఆధ్వర్యంలో రోగుల్ని పరీక్షిస్తారు. ఈ ఆరోగ్యరథం వద్దే 200కి పైగా రోగనిర్దారణ పరీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేస్తారు. అవసరమైనవారికి మందులు కూడా రూపాయి తీసుకోకుండా అందజేయనున్నారు. అందరికీ ఆరోగ్యమస్తు-ప్రతీ ఇంటికీ శుభమస్తు అనే నినాదంతో చేపట్టిన ఈ ఆరోగ్యరథం ఏ ఊరు ఏ సమయంలో సందర్శిస్తుందో ముందుగా షెడ్యూల్ చేసి వారికి సమాచారం ఇస్తారు. ఇందులో పేషెంట్లకి అత్యవసరసేవలు అందించే సామగ్రి, నెబ్యులైజర్, ఆక్సిజన్ వంటివన్నీ అందుబాటులో వుంటాయి. అలాగే మాతాశిశు సంరక్షణ సూచనలు ఇవ్వడంతోపాటు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్ని చైతన్యం చేస్తామని లోకేష్ అన్నారు. సంజీవని ఆరోగ్యరథం సేవలు ఆరంభించాక, త్వరలో మంగళగిరి, తాడేపల్లిలో సంజీవని ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. వైద్యం కోసం ఖర్చు చెయ్యలేని పేదలకు సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక చేయూతనందిస్తూ, సంక్షేమం చూస్తూ వస్తోన్న నారా లోకేష్ ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకొస్తున్న సంజీవని ఆరోగ్య రథం, సంజీవని ఆరోగ్య కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment