పిల్లలు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలి




రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



 శుక్రవారం నగరంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు శంఖుస్థాపన


 పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా, ఎంపి ఎమ్. భరత్ రామ్, కలెక్టర్ మాధవీలత


పిల్లలు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలని


రాష్ట్ర టూరిజం మరియు స్పోర్ట్స్ శాఖ మంత్రి  ఆర్.కె.రోజా అన్నారు.



శుక్రవారం ఉదయం రాజమండ్రి, వి.యల్.పురంలో రూ.23 కోట్లతో చేపట్టనున్న మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, నాగుల చెరువు మార్కెట్ వద్ద  రూ.6 కోట్ల నిధులతో  క్రికెట్ గ్రౌండ్ నిర్మాణం పనుల శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు,  రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిళ రెడ్డి , మునిసిపల్ కమిషనర్  కె. దినేష్ కుమార్ ,పెద్ద ఎత్తున విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్ కె రోజా మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం రూ.125 కోట్లు గ్రాంటు మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించడం, ఆ కార్యక్రమం లో క్రీడా శాఖ మంత్రి గా నాచే శంఖుస్థాపన పనులు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో క్రీడలకు కూడా పెద్దఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందన్నారు. తల్లి దండ్రులు కూడా పిల్లల్లో ఉన్న ఆసక్తిని గమనించి క్రీడల పట్ల ప్రోత్సహం అందించాలని కోరారు. 

జిల్లా స్థాయి నుంచి గ్రామ, వార్డు స్థాయి వరకు క్రీడల అభివృద్ధికి చిత్తశుద్దితో అడుగులు వేస్తున్నామని మంత్రి రోజా అన్నారు. పిల్లలు ఏ క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో, గుర్తించడంతో పాటు సచివాలయ వ్యవస్థ లో రూపొందించిన యాప్ లో వాటి వివరాలు నమోదు చేయాలని కోరారు. తద్వారా సంబందించిన డేటా సేకరించి  ఆయా క్రీడల ప్రోత్సాహానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి ఆర్ కె రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏదైనా మంచి కార్యక్రమం చేపడితే, వాటి దృష్టిని మార్చివేసెందుకు  ప్రతిపక్షాలు కుట్ర చెయ్యడం తగదని ఆమె హెచ్చరించారు.


పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన వెంటనే రాజమహేంద్రవరం అభివృధి కోసం రూ.125 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, జిల్లా ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. ఈరోజు క్రీడలకు సంబందించి రెండు స్టేడియంల నిర్మాణం పనులు శ్రీకారం చుట్టామని, వాటి పనులు శంఖుస్థాపనకి , పర్యటన క్రీడల శాఖ మంత్రి ఆర్ కే రోజా రావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈరోజు ₹.29 కోట్లతో రెండు స్టేడియం లు నిర్మాణానికి శంఖుస్థాపన చేశామని, మరిన్ని నిధులను తీసుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈరోజు ప్రారంభిస్తున్న ఈపనులు 12 నెలల కాలవ్యవదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ స్టేడియం ఉభయ గోదావరి జిల్లాలకు తలమానికంగా ఉండేలా తీర్చి దిద్దుతామని, ఐ పి ఎల్ తరహా క్రికెట్ పోటీలు జరిగేలా చక్కటి స్టేడియం నిర్మించి, ఈప్రాంతంలో ఉండే పిల్లలకు క్రీడా మైదానం తీర్చి దిద్దేలా అడుగులు వేయడం పై ఎంపి హామీ ఇచ్చారు. వి ఎల్ పురంలో ఇండోర్ స్టేడియం నిర్మించి బాస్కెట్ బాల్, తదితర క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు భాగంగా శంఖుస్థాపన చేశామని ఆయన అన్నారు.



ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు,  రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిళ రెడ్డి , మునిసిపల్ కమిషనర్  కె. దినేష్ కుమార్, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, అదనపు మునిసిపల్ కమిషనర్ పీ ఏమ్ సత్యవేణి, ఎస్ ఈ కె.పాండురంగారావు,  స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. అంతకు ముందు వి ఎల్ పురం నుంచి నాగుల చెరువు మునిసిపల్ స్టేడియం వరకు టార్చ్ ర్యాలీ నిర్వహించారు.


Comments