ఎస్సీ గురుకులాల్లో సప్లిమెంటరీ విద్యార్థులకు అడ్మిషన్లు
• ఒక్క సీటు కూడా వృధా కానివ్వొద్దు
• పర్యవేక్షణ పెంచండి.. మంచి ఫలితాలు సాధించండి
• డీసీఓల సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున
అమరావతి, ఆగష్టు 16 (ప్రజా అమరావతి): ఈ ఏడాది పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. ఇంటర్ లో ఎంఇసి, సిఇసి కోర్సులను ఎంపీసీ, బైపీసీలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా గురుకులాల సమన్వయకర్త (డీసీఓ)ల సమావేశంలో నాగార్జున గురుకులాల్లో ప్రవేశాలతో సహా పలు అంశాలను సమీక్షించారు. గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా దాన్ని ఈ ఏడాదికి సడలించి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి కూడా అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఒక్క సీటు కూడా మిగిలిపోకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్ల స్థాయిలో సీట్లు ఖాళీ లేని పక్షంలో జిల్లా స్థాయిలో ఖాళీలను చూసుకొని వాటిని భర్తీ చేయడానికి చర్యలను తీసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ లో ప్రస్తుతం ఉన్న సీట్లు కాకుండా అదనపు సీట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. గురుకులాల్లో ఎక్కువగా డిమాండ్ లేని ఎంఇసి, సిఇసి సీట్లను ఎంపీసీ, బైపీసీలుగా మార్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా గురుకులాల్లో ఇదివరకు లేని విధంగా విద్యాప్రమాణాలను మెరుగుపర్చడానికి విద్యార్థులకు వారాంతపు పరీక్షలను నిర్వహించాలని, ఆ పరీక్షలలో విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి అవసరమైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి కూడా చర్యలు చేపట్టాలని, ట్యూటర్లను నియమించాలని అధికారులను కోరారు. విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనకబడితే ఆ సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు విద్యార్థల బాధ్యతను తీసుకోవాలన్నారు. డీసీఓలు గురుకులాలను నిరంతరం పర్యవేక్షిస్తూ మంచి ఫలితాలను సాధించేందకు కృషి చేయాలని నాగార్జున సూచించారు. గురుకులాలకు సంబంధించిన హాస్టళ్లలో కేర్ టేకర్లు నివాసం ఉంటూ విద్యార్థుల అధ్యయనాన్ని పర్యవేక్షిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయని అభిప్రాయపడ్డారు. నీటి కొరత ఉన్న గురుకులాలను గుర్తించి వాటిల్లో ఆ సమస్యను శాశ్వితంగా పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించాలని డీసీఓలను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలతో పాటుగా హాస్టళ్లలో ఉన్న సమస్యలను తీర్చడానికి నాడు-నేడు పథకంలో భాగంగా పనులను చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను జారీ చేసినందుకు ఈ సందర్భంగా మంత్రి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రిజర్వుడు కేటగిరీకి చెందిన విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. గురుకులాలకు అవసరమైన లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్ ఖాళీలను జిల్లాల స్థాయిలో భర్తీ చేసుకోవడానికి కూడా చర్యలు చేపట్టాలని డిసీఓలను మంత్రి ఆదేశించారు. గురుకులాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి, కావాల్సిన నిధులను మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఈ సమావేశంలో గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, డిప్యుటీ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మల్లేశ్వర్ రావు తో పాటుగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన డీసీఓలు పాల్గొన్నారు.
addComments
Post a Comment