దేవాలయ భూములను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..



విజయవాడ (ప్రజా అమరావతి);


దేవాలయ భూములను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..


- అన్యాక్రాంతం అయిన భూములకు సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతాం

- త్వరలో దేవాదాయ శాఖ ఉద్యోగులందరికీ డ్రెస్ కోడ్ అమలు.. 

- దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి  ప్రత్యేక కార్యాచరణ 

- త్వరలో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాం.. 

-              నాయి బ్రాహ్మాణులకు న్యాయం చేస్తాం. 

- వివరాలను వెల్లడించిన డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. 

దేవాదాయ, ధర్మాదాయశాఖపై ప్రతీ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఈ మంగళవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ సమీక్షలో అర్చకుల గౌరవ వేతనం పెంపుదల, రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం హితకారిణి సమాజం ద్వారా ఏర్పాటు చేసిన కాలేజీ నిర్వహణ, దూప, దీప, నైవేద్యం పథకం (డీడీఎన్ఎస్), దేవాలయ భూములపై కోర్టు కేసులు, దసరా ఉత్సవాల ఏర్పాట్లు, దేవాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని తెలిపారు. విజయవాడ రూరల్  గొల్లపూడిలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో  మంగళవారం సమీక్ష వివరాలను డిప్యూటీ సీఎం మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాధాయ శాఖమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. అర్చకులకు సంబంధించిన గౌరవ వేతనం పెంపుదలపై కసరత్తు జరుగుతోందన్నారు.  రాష్ట్రంలోని ప్రతీ దేవాలయంలో దూప, దీప, నేవేద్యాలు జరపాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని.. ప్రతి గ్రామానికీ, ప్రతీ నియోజకవర్గానికి డీడీఎన్ఎస్ కింద ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019కి ముందు 1600 దేవాలయాలకు డీడీఎన్ఎస్ ఇచ్చారని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2వేలకు పైగా దేవాలయాలకు డీడీఎన్ఎస్ ఇస్తున్నామని తెలిపారు. డీడీఎన్ఎస్ కింద ఇప్పటివరకూ 2699 అప్లికేషన్స్ వచ్చాయని, వాటిని పరిశీలించి గైడ్ లైన్స్ ప్రకారం దేవాలయాలకు నిధులు ఇస్తామన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక భూములు వివాదంలో ఉన్నాయని, కోర్టుల్లోనూ పలు భూముల కేసు తీర్పులు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వస్తున్నాయని తెలిపారు. దీనిపై 9 మందితో స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని అడ్వకేట్ జనరల్ ను కోరామని తెలిపారు. ఈ కేసులకు సంబంధించి అక్కడున్న అసిస్టెంట్ కమిషనర్ కోర్టుకు హాజరై.. స్టాండింగ్ కౌన్సిల్ పనితీరును పర్యవేక్షించి నివేదికలు ఇవ్వాలని కోరామన్నారు.  ఒకవేళ ఎవరైనా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పెండింగ్ కేసులపై ఎవరైనా నిర్లక్ష్యం వహించి శాఖకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన వాటిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని మంత్రి స్పష్టం చేశారు.  ఎండోమెంట్ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి  ఉందని తెలిపారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఉద్దేశం తమకు లేదని, నిజమైన సేవ చేస్తున్నామని.. అధికారులు అందరూ క్రమశిక్షణతో నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. దేవాదాయ ధర్మాదాయశాఖలోని ఆలయాల్లో పనిచేసే ప్రతీవ్యక్తికి డ్రెస్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, దేవాలయాలతో పాటు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా డ్రెస్ కోడ్ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయాల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి అందరికీ డ్రెస్ కోడ్ అమలులోకి తీసుకుని రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. 

కందుకూరి వీరేశలింగం ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం గారు హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేశారని.. దీని ద్వారా ఎయిడ్ కాలేజీగా నడపబడేదని తెలిపారు. హిత కారిణి సమాజం ద్వారా ఏర్పాటు చేసిన కాలేజీను విద్యాశాఖకు అప్పగించి నిర్వహణ చేయాల్సిందిగా కోరామన్నారు. కందుకూరి ఆశయాల అమలుకు కృషి చేస్తామని తెలిపారు. 

దసరా ఉత్సవాలకు ప్రత్యేక కార్యాచరణ : 

దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించే విజయవాడ కనకదుర్గ ఆలయంతో పాటు దసరా వేడుకలు ఇతర ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్లు ఉత్సవాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. దసరా ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా ఉత్సవాలు నిర్వహించే ఆలయాలకు సంబంధించి ఈ నెల 25న పోలీసు, ఆర్ అండ్ బీ, దేవాదాయ, ఇతర శాఖల అధికారులతో సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ నెల 30వ తేదీన జరిగే సమీక్షా సమావేశంలో జిల్లాల్లో ప్రాముఖ్యత గల దేవాలయాల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు తదితర అంశాలపై సూచనలు, సలహాలతో కూడిన నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. 

ఉద్యోగులకు ప్రమోషన్లు.. 

నాయీబ్రాహ్మణుల సమస్యలపై సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. నాయిబ్రాహ్మణులను దేవాదాయ సిబ్బందిగా పరిగణించలేమని, వారికి న్యాయం చేసే చర్యలు తీసుకుంటున్నారు. అలాగే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ నుండి డిప్యూటీ కమిషనర్ ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.   

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, తదితరులు పాల్గొన్నారు.


Comments