నెల్లూరు, సెప్టెంబరు 27 (ప్రజా అమరావతి);
వచ్చే అక్టోబర్ 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించే విధంగా బహుళార్ధ సౌకర్యాల కేంద్రాల నిర్మాణం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో బహుళార్థ సౌకర్యాల కేంద్రాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో నాలుగవ జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించి గోదాముల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన 48 గోదాములకు గాను 10 గోదాములు పూర్తికాగా మరో 10 గోదాములు పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. రెండు చోట్ల స్థలాలను వెంటనే గుర్తించి గోదాముల నిర్మాణం పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే అక్టోబర్ 15 తేదీలోగా కనీసం 30 గోదాముల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చే ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా 24 గోదాముల నిర్మాణానికి ఇప్పటివరకు ఖర్చు అయిన మొత్తాలకు సంబంధించి నిధులను విడుదల చేసేందుకు కమిటీ ఆమోదించింది.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మానాధ్, డి సి ఓ శ్రీ తిరుపాల్రెడ్డి, నాబార్డ్ డి డి ఎం శ్రీ రవి సింగ్, డిసిసి బ్యాంక్ సీఈవో శ్రీ శంకర బాబు, మార్కెటింగ్ ఎడి శ్రీమతి అనిత, జిల్లా ఉద్యాన అధికారి శ్రీ సుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడి శ్రీ నర్సోజి రావు, డిసిసిబి ఓఎస్డి శ్రీనివాసులు, డిపిడిఎం శ్రీ ప్రదీప్ రెడ్డి, ప్యాక్స్ సీఈఓ లు పాల్గొన్నారు.
addComments
Post a Comment