వర్షంలో సైతం ...



*వర్షంలో సైతం ...*



పార్వతీపురం/సాలూరు, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి): గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విసుగు, విరామం లేదని నిరూపించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర. మండుటెండల్లో సైతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా శ్రేయస్సు, సంక్షేమమే పరమావధి అని చెప్పకనే చెప్పిన రాజన్న దొర, ఎండల్లోనే కాదు భోరున వర్షం కురుస్తున్నా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆగదని నిరూపించారు. ఇప్పటికే పలు మార్లు వర్షాన్ని లెక్కచేయకుండా గడప గడపకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి శుక్ర వారం తాజాగా భోరున వర్షం కురుస్తున్నా తడుస్తూ ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలను వివరించారు. ప్రతి కుటుంబం పొందిన లబ్దిని వివరించారు. సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రాజన్నదొర నిర్వహించారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయ కార్యక్రమాలతో కుటుంబాలు ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. 

పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. సచివాలయం పరిధిలో మౌళిక సదుపాయాలు కల్పనకు రూ.20 లక్షలు చొప్పున మంజూరు జరిగిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

Comments