*ఎన్నికలకు సిద్దమేనా...? ప్రత్యామ్నాయం చూసుకోవాలా?*
*ముఖాముఖీ రివ్యూలలో ఇంచార్జ్ లకు టిడిపి అధినేత సూటి ప్రశ్నలు*
*సమగ్ర సమాచారంతో లోతుగా చంద్రబాబు సమీక్షలు*
*నేటితో 59 మంది ఇంచార్జ్ లతో ముగిసిన భేటీలు*
అమరావతి (ప్రజా అమరావతి):- తెలుగు దేశం పార్టీలో నియోజకవర్గ ఇంచార్జ్ ల పనితీరుపై వరుస సమీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ లలో నేతల పనితీరును సమీక్షిస్తున్నారు. ఇంటర్నల్ రిపోర్ట్స్ ఆధారంగా బాగా పనిచేస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్ లను చంద్రబాబు అభినందిస్తున్నారు. సమర్థవంతంగా లేని వారిని మీరు ఎన్నికలు సిద్దంగా ఉన్నారా....ప్రత్యామ్నాయం చూసుకోమంటారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మెంబర్ షిప్ కార్యక్రమం మొదలుకొని...బాదుడే బాదుడు వరకు అన్ని అంశాలపై రివ్యూ చేస్తున్నారు. నేతల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారాన్ని రివ్యూలలో బయటకు తీసి సమీక్ష చేస్తున్నారు. సమగ్రమైన, లోతైన నివేదికలతో నేతలను ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు స్థానిక సమస్యలపై, ప్రత్యర్థి నేతలపై పోరాటాల విషయంలో కూడా ఇంచార్జ్ లతో రివ్యూ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గాలేని వారు పనితీరు మార్చులకోవాలని సూచిస్తున్నారు. ఇంచార్జ్ గా ఉన్నవారు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని.... ఏకపక్షంగా ఉంటే ఉపేక్షించేది లేదని కూడా చెపుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై ఉందని...అలా అని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని కూడా చంద్రబాబు నేతలకు తేల్చి చెపుతున్నారు. ఈ సమీక్షలను నేతలు అంతా సీరియస్ గా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని...అంతిమంగా పనితీరే ప్రామాణికం అని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ రివ్యూలలో ఇప్పటివరకు 59 నియోజకవర్గాల్లో ముఖాముఖీ భేటీలు ముగిశాయి. ఈ రోజు రాజమండ్రి సిటీ, పెద్దాపురం, రాజాం నియోజవర్గాల ఇంచార్జ్ లు ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, కోండ్రు మురళిలతో సమీక్ష చేశారు.
addComments
Post a Comment