ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వెంకటాచలంలో ఏర్పాటు కావడం మన రాష్ట్రానికే గర్వకారణమ



నెల్లూరు, సెప్టెంబర్ 17 (ప్రజా అమరావతి): ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వెంకటాచలంలో ఏర్పాటు కావడం మన రాష్ట్రానికే గర్వకారణమ


ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 శనివారం ఉదయం వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారి పక్కన  ప్రాచీన తెలుగు భాషా అధ్యయన కేంద్రం భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన స్థల ధ్రువీకరణ పత్రాలను  మైసూరు భారతీయ భాషా సంస్థ డైరెక్టర్ శ్రీ శైలేంద్ర మోహన్ కు మంత్రి అందించారు. 

 ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక భవనంలో కొనసాగిన ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్ర సొంత భవన నిర్మాణానికి అడిగిన వెంటనే కోట్లాది రూపాయల విలువైన 5.5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేసిన ముఖ్యమంత్రి తెలుగు భాష పట్ల తనకున్న గౌరవాన్ని చాటారన్నారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించిన ఘనత దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డిది కాగా, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారన్నారు.ఈ కేంద్ర భవన నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేలా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు సహకారంతో  తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రాచీన తెలుగు భాష అధ్యయనానికి, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రతిఒక్కరూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎప్పటికీ మరువరాదని, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


 ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, మైసూరు భారతీయ భాషా సంస్థ డైరెక్టర్ ఆచార్య శైలేంద్ర మోహన్, ఆచార్య సి వి శివరామకృష్ణ, ఆచార్య పంకజ్ ద్వివేది, సమగ్ర శిక్ష ఏపీసి శ్రీమతి ఉషారాణి, ఆర్డిఓ శ్రీ మలోల, ఎంపీడీవో శ్రీమతి సుస్మిత, తాసిల్దార్ నాగరాజు,  స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments