*చెన్నుపాటి వ్యవహారంలో ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు - చంద్రబాబు*
విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్, తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి వ్యవహారంలో దోషులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. చెన్నుపాటికి గాంధీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శనివారం విజయవాడలో వైకాపా నేతల దాడిలో చెన్నుపాటి కంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్ప్రతిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
*మీ కుటుంబాలకూ ఇదే పరిస్థితి వస్తే?:* ఓడిపోతామనే పిరికితనంతో వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఖబడ్దార్.. ఇలాంటి ఘటన మరొకటి జరిగితే వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన హెచ్చరించారు. కన్నుపొడవడం దుర్మార్గమని.. ఈ ఘటనలో దోషులకు శిక్ష పడే వరకు న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. విజయవాడలో గతంలో తెదేపా నేత పట్టాభిపై దాడి చేశారని, ఆ రోజు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చేసిన పని అని.. మీ కుటుంబాలకు ఇదే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.
*మాకు సొంత అజెండాలేమీ లేవు:* తెదేపా కార్యకర్తలు పోరాడేది ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పైనేనని.. తమకు సొంత అజెండాలేమీ లేవని చంద్రబాబు అన్నారు. వైకాపా అరాచకాలపై ప్రజల్లో చైతన్యం ప్రారంభమైందని.. ప్రతిఘటించి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఎన్నో సంక్షోభాలను చూశామని.. దాడులు చేసిన వారిని పతనావస్థకు తీసుకెళ్లిన పార్టీ తెదేపా అన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడి ఘటన ఎమోషన్లో జరిగిందని పోలీసులు చెబుతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యారాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
addComments
Post a Comment