"సేఫ్ బీచ్ గా విశాఖ సాగర తీరం"
జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున
విశాఖపట్నం,సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి);: విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్ గా రూపు దిద్దుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. శుక్రవారం సాయంత్రం సాగర్ తీరంలో అర్.కే. బీచ్ వద్ద ఆయన బ్యాటరీ సహాయంతో పనిచేసే లైఫ్ బాయ్ అనే రోబోటిక్ బోట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోబోటిక్ బోట్ ఎవరైనా సముద్రంలో గల్లంతయినట్లయితే 700 మీటర్ల వరకు 7 కిలోమీటర్ల వేగంతో వెళ్లి రక్షిస్తుందన్నారు. సముద్రంలో ముంపుకు గురైన వారిని తక్షణం రక్షించుటకు ఉపయోగపడుతుందన్నారు. పర్యాటక ప్రాంతమైన విశాఖ సాగర తీరంలో నిత్యం పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నందున వారి భద్రతకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాల్లను బీచ్ లో నియమించడం జరిగిందన్నారు. వారికి కావలసిన లైఫ్ జాకెట్లు ఇతర సామగ్రిని సమకూర్చడమైందన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం జీవీఎంసీ మేయర్, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ తీరంలో గల స్థానిక దుకాణదారుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్ , ప్లాస్టిక్ స్పూన్స్ వంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని , ప్రోత్సహించవద్దని తెలియజేశారు . వీటి వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ఎవరైనా అక్రమంగా వినియోగించినట్లయితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మి షా, మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment