తిరుమల, అక్టోబరు 09 (ప్రజా అమరావతి);
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారు
- టీటీడీ అందిస్తున్న సేవలు భేష్
- ఈవోను ప్రశంసించిన భక్తులు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించారని, టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని పలువురు భక్తులు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డిని ప్రశంసించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1.మురళీధర్ - వరంగల్, సీత - హైదరాబాద్
ప్రశ్న- ప్రత్యేక దర్శనం రూ.300/- టికెట్లు పొందిన వారికి అదే రోజు గదులు తీసుకునేలా ఏర్పాట్లు చేయండి. తిరుమలలో గదులు దొరక్క ఇబ్బంది పడుతున్నాం. ఆన్లైన్లో కూడా గదులు దొరకడం లేదు. క్యూ లైన్ల వద్ద దళారులు అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నారు.
ఈవో - తిరుమలలో గదులు పరిమిత సంఖ్యలో ఉన్నందున భక్తులందరికి వసతి కల్పించడం వీలు కాదు . ఆన్లైన్లో 50 శాతం గదులు ఉంచడమైనది. మిగిలిన గదులు కరెంటు బుకింగ్లో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా కేటాయించబడుతుంది. ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. కావున తిరుపతిలో వసతి పొందడం మంచిది.
తిరుమల లో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. అందులో విజయం సాధించాం. ఇంకా అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వీటిని అరికట్టడానికి టీటీడీ విజిలెన్స్ విభాగం పటిష్టంగా పనిచేస్తోంది.
2. నాగరాజు - భీమవరం
ప్రశ్న- తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఉన్న విధంగా విఐపి లకు ఒక క్యూ లైన్, సామాన్య భక్తులకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయగలరు.
ఈవో - తిరుమలలో అత్యద్భుతమైన క్యూలైన్ వ్యవస్థ కొనసాగుతోంది రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం క్యూలైన్, ఈ క్యూలు రెండు వైకుంఠం వద్ద కలిసి భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తన్నారు.
3. రెడ్డప్ప - మదనపల్లి వెంకటేష్ - ఒంగోలు
ప్రశ్న - శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రుచికరమైన భోజనాలు అందించారు. మీ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన బాగుంది. బ్లాక్ టికెట్ వ్యవస్థను నిర్మూలించారు. తిరుమలలోని గ్యాలరీలలో తాగునీటి సదుపాయం మెరుగు పరచాలి .
ఈవో - తిరుమలలో 140 ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి. కంపార్ట్మెంట్లలో, గ్యాలరీల్లోనూ నీటి సౌకర్యం ఉంది. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం ఉంది కావున భక్తులు స్టీల్ , గాజు , రాగి వాటర్ బాటిల్స్ ఇంటి నుండి తెచ్చుకోవాలి. శ్రీవారి సేవకులు గ్లాసులతో తాగునీటిని నిరంతరం అందిస్తున్నారు .
4. రాము - గుంటూరు రాజు - హైదరాబాద్ ఈశ్వర్ - తిరునల్వేలి
ప్రశ్న - శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపంలోని
ఈ - దర్శన్ కౌంటర్లలో దర్శన టికెట్లు ఇచ్చే పద్ధతిని పునః ప్రారంభించండి
ఈవో - టీటీడీ ఇంటర్నెట్లో రోజుకు 25వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300/-, టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది.
ఈ దర్శన్ కౌంటర్లలో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుండే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి రోజు 50 వేల మంది భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నాం.
5. మురుగన్ - తమిళనాడు
ప్రశ్న - తిరుమలలో సైన్ బోర్డులను తమిళంలో కూడా ఏర్పాటు చేయగలరు.
ఈవో- తిరుమలలోని అన్ని ప్రధాన కూడళ్ళలో తమిళంలో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తాం.
6. వేణుగోపాల్ - హైదరాబాద్
ప్రశ్న - ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు డొనేషన్ ఇవ్వాలని సమాచారం కోసం టీటీడీ ఏర్పాటు చేసిన రెండు ల్యాండ్ ఫోన్లకు ప్రయత్నిస్తే పని చేయడం లేదు. ఒక మొబైల్ ఫోన్ ఏర్పాటు చేయగలరు.
ఈవో - మా అధికారులు మీతో మాట్లాడి చర్యలు తీసుకుంటారు.
7. రవికుమార్ - బెంగుళూరు
ప్రశ్న - క్యూ లైన్లలో టీటీడీ సేవలు చాలా బాగున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను ఒక చోట నిలబెట్టి వాహన సేవలు వీక్షించేందుకు వదిలితే బాగుంటుంది.
ఈవో - గరుడసేవనాడు హారతులు ఇచ్చే పద్ధతి మార్చి, నాలుగు మూలలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి 50 వేల మందికి దర్శనం కల్పించాం. మిగిలిన వాహన సేవలో రద్దీ తక్కువగా ఉంటుంది.
8. శ్రీనివాస్ - తిరుపతి, నారాయణాచారి - హైదరాబాద్, వెంకటేశ్వర్లు - నంద్యాల
ప్రశ్న - తిరుమలలో రద్ధీ అధికంగా ఉంటుంది. తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు చేయగలరు.
అలిపిరి నడక మార్గంలో గాలి గోపురం వద్ద దివ్యదర్శనం టోకెన్లను పునః ప్రారంభించండి.
ఈవో - టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు బదులు తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తాం.
9. వెంకటేష్ - బెంగుళూరు
ప్రశ్న - తిరుమలలో లడ్డూ కౌంటర్లలో ప్రసాదాలు తీసుకోవడానికి ఒకటిన్నర గంట సమయం పడుతోంది . అన్ని కౌంటర్లు పని చేసేలా చర్యలు తీసుకొండి.
ఈవో - భక్తులు లడ్డూలు తీసుకోవడానికి 60 కౌంటర్లు పనిచేస్తున్నాయి. మొదటి అంతస్తులోనికి సగం మంది భక్తులు వెళ్ళేలా చర్యలు తీసుకుని 20 నిమిషాల్లో లడ్డూలు అందించే ఏర్పాటు చేస్తాం.
10. వాసు - కర్నూల్
ప్రశ్న - డోన్లో 500 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థలో ఉంది. టీటీడీ దత్తత తీసుకుని బాగు చేయాలి.
ఈవో - శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పురాతన ఆలయాలను పునః నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా 560 కోట్ల విరాళాలు అందాయి . కొత్తగా 1440 ఆలయాల నిర్మాణం , 130 పురాతన ఆలయాల పునః నిర్మాణం జరుగుతోంది .
మీ ఆలయానికి అధికారుల కమిటీని పంపి నిర్ణయం తీసుకుంటాం.
11. అనిల్ రెడ్డి - సత్యవేడు
ప్రశ్న- తిరుమల హోటళ్ళలో టిఫిన్ ధరలు తగ్గించాలి.
ఈవో - తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో రుచికరమైన అల్ఫాహారం , అన్నప్రసాదాలు అందిస్తున్నాం. జనత క్యాంటీన్లలో మాత్రమే టీటీడీ నిర్ణయించిన ధరలకు ఆహార పదార్థాలు విక్రయిస్తారు.
12. నాగ - అచ్చంపేట
ప్రశ్న - అచ్చంపేటలో టీటీడీ కళ్యాణ మండపంలో సంవత్సరానికి ఒక పెళ్లి కూడా జరగడం లేదు. దానిని ఆధునీకరించి అభివృద్ధి చేయండి.
ఈవో - టీటీడీ కళ్యాణమండపాలను వివిధ వ్యక్తులు, సంస్థలకు 10 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తున్నాము. టీటీడీ అధికారులు సందర్శించి నిర్ణయం తీసుకుంటారు.
13. మంజునాథ - మదనపల్లి
ప్రశ్న - ఒక సంవత్సరంలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులకు ఇచ్చే దర్శనాన్ని, రెండు సంవత్సరాల పిల్లలకు పెంచండి.
ఈవో - టీటీడీ ఇప్పటికే వివిధ రకాలైన ప్రివిలైజ్డ్ దర్శనాలను కల్పిస్తోంది. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో ఇబ్బంది పడుతున్నారు. కావున ఒక సంవత్సరంలోపు పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే దర్శనం కల్పించగలం.
14. మహేందర్ రావు - కరీంనగర్
ప్రశ్న - శ్రీవారి సేవ ఇదివరకు ఆఫ్ లైన్లో ఉండేది. ప్రస్తుతం ఆన్లైన్ చేయడం ద్వారా దళారులు ఒక్కొక్కరి వద్ద రూ.400 వసూలు చేస్తున్నారు. అఖండ హరినామ సంకీర్తనలో కొత్తవారికి అవకాశం కల్పించండి.
ఈవో - శ్రీవారి సేవపై చాలామంది సేవకులు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. ఆన్లైన్లో నేరుగా బుక్ చేసుకునే సదుపాయం కల్పించాం. ఇంటర్నెట్ సెంటర్ వారు కొంత చార్జ్ చేస్తారు. శ్రీవారి సేవకులు దళారులకు డబ్బులు ఇవ్వకండి, తద్వారా దళారీ వ్యవస్థ నాశనమవుతుంది. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం
15. శాస్త్రి - హైదరాబాద్
ప్రశ్న - తిరుమల నాదనీరాజనం వేదికపై వేద పారాయణం వివరాలు ఎస్వీబిసిలో స్క్రోలింగ్ ఇవ్వండి.
ఈవో - వేద పారాయణం స్క్రోలింగ్ ఇవ్వడాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
16. రామకృష్ణ - మడకశిర
ప్రశ్న - ప్రస్తుతం సర్వదర్శనానికి 48 గంటలు పడుతుంది. విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయగలరు.
ఈవో - టీటీడీ ఇప్పటికే శుక్ర, శని, ఆది వారాలు బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
17. సరస్వతి - కడప
ప్రశ్న - శ్రీవారి బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్లు 10 గ్రాముల రెండు గ్రాములు మాత్రమే ఉన్నాయి. ఐదు గ్రాములు కూడా ఉండేలా చర్యలు తీసుకోండి.
ఈవో - శ్రీవారి బంగారు డాలర్లు రెండు, ఐదు, పది గ్రాములు నిరంతరం ఉండేలా చర్యలు తీసుకుంటాం
18. పుల్లయ్య - జమ్మలమడుగు పురుషోత్తం రెడ్డి - హైదరాబాద్
ప్రశ్న - శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వండి.
ఈవో - ప్రతి రోజు తిరుమలలో లాటరీ పద్ధతిలో ఆర్జిత సేవా టికెట్లు పొందవచ్చు. ప్రతి శుక్రవారం 10 అభిషేకం, రెండు వస్త్రం సేవా టికెట్లు అందుబాటులో ఉంటాయి.
19. వెంకటరమణ - విశాఖపట్నం
ప్రశ్న - తిరుమలలో అన్నప్రసాదంలో వినియోగించే బియ్యం నాణ్యతగా లేవు
ఈవో - అన్నప్రసాదాలు రుచిగా, శుభ్రతగా బాగా అందిస్తున్నారు. రైస్ నాణ్యతను పెంచేందుకు మిల్లర్స్ తో మాట్లాడి చర్యలు చేపడతాం
20. మహేష్ బాబు - చెన్నై
ప్రశ్న - టీటీడీ అధికారులు, సిబ్బంది, ఎస్వీబిసి అద్భుతంగా పనిచేస్తోంది వాహనం బ్యారర్లను సన్మానించండి. విశ్రాంత ఉద్యోగులకు వారి స్వస్థలలో లడ్డూ, వడ, డైరీ, క్యాలెండర్ ఇచ్చే అవకాశం కల్పించండి.
ఈవో - బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన 79 మంది వాహన బేరర్లను సన్మానించాం. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు ఒక్కొక్కరికి 81, 500 సంభావన , జత పంచలు, చీర అందజేశారు. విశ్రాంత ఉద్యోగులకు వారి స్వస్థలాలలో లడ్డూ వడ డైరీ అందించేలా చర్యలు తీసుకుంటాం.
addComments
Post a Comment