ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించడం జరుగుతుంది


నెల్లూరు (ప్రజా అమరావతి);


జిల్లాలో  సుధీర్గ కాలంగా పెండింగ్ లో వున్న సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి  నిర్మాణాలను పూర్తి చేసి  జిల్లా రైతాంగానికి అందించిన  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా రైతు సంఘాల పక్షాన, రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్  శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం  ఉదయం  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన  జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి శ్రీ  గోవర్ధన్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ,  జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల కింద ఆయకట్టుకు సంబందించి 2022-23 సంవత్సరం మొదటి   పంటకు  సాగునీరు అందించేందుకు   ఈ రోజు జరిగిన  జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో 8.46 లక్షల ఎకరాలకు సంబందించి  84.6  టిఎంసిల నీటిని  కేటాయిస్తూ కమిటి తీర్మానించడం జరిగిందన్నారు.  జిల్లాలోని సాగు, త్రాగునీటి అవసరాలను దృష్టిలో వుంచుకొని ప్రణాళికాబద్దంగా ఖరీఫ్ పంట సాగుకు సంబందించి  ఆయకట్టు చివరి భూముల వరకు   సాగునీరు అందించడం జరుగుతుంద


ని   మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.  రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా  అన్నీ చర్యలు తీసుకోవడంతో పాటు  వారి సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని  జిల్లాలో గడిచిన మూడు సంవత్సరాల్లో  సుమారు 14 లక్షల  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పండించిన పంటకు మద్దతు ధర లేక   క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కుంటున్న  సమస్యలను,  సాగునీటి పారుదల కాలువలకు  చేపట్టాల్సిన మరమ్మత్తులు, ఆధునీకరణ  పనులు,  తదితర అంశాలను   గౌరవ శాసన సభ్యులు,    రైతు సంఘాల నాయకులు కమిటీ దృష్టికి తీసుకురాగ మంత్రి శ్రీ  గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ,   శాసన సభ్యులు,  నీటి సంఘాల సభ్యుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని  రైతాంగానికి అవససరమైన సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  జిల్లాలో ప్రతిపాదించిన సాగునీటి కెనాల్స్ మరమ్మతులు, ఆధునీకరణ పనులు త్వరగా జరిగేలా  సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. క్రాప్ డైవర్షన్ గురించి చర్చించడం జరుగుచున్నదని,  వరికి ప్రత్యామ్నాయ పంటలు  సాగు చేసేలా  రైతుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుచున్నదని, అవినీతికి పాల్పడిన వారిని  వదిలిపెట్టడం జరగదని ఈ సంధర్భంగా మంత్రి  తెలిపారు. 


జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ,  ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడటం వలన  సోమశిల, కండలేరు జలాశయాల్లో  నీరు సమృద్దిగా ఉన్నాయని, జిల్లాలో  2022-23   ఖరీఫ్   పంటకు సాగునీటిని కేటాయించేందుకు  సోమశిల జలాశయం కింద  మొత్తం 5.51 లక్షల ఎకరాల ఆయకట్టుకు 55.1 టి.ఎం.సి.లు, అలాగే కండలేరు జలాశయం కింద   నెల్లూరు, తిరుపతి జిల్లాలో గల 2.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు  29.5 టి.ఎం.సిల సాగు నీటిని  కేటాయించేలా ఈ సమావేశంలో ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  వరదలు, తుఫాన్లు వంటి  ప్రకృతి వైపరీత్యాలకు  గురి కాకుండా  ఖరీఫ్ సీజన్ కు  సంబందించి క్రాప్ సీజన్ కొంత ముందుకు తీసుకు రావడం జరిగిందని,   గ్రామ స్థాయిలో  నీటి సంఘాల సభ్యులను,  నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసి  కేటాయించిన సాగునీటిని  ప్రతి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  పెండింగ్ లో వున్న  ఇరిగేషన్ కెనాల్స్ ఆధునీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 

ఈ సమావేశంలో   శాసన మండలి సభ్యులు శ్రీ వాకాటి నారాయణ రెడ్డి,  శ్రీ విఠపు బాలసుబ్రమణ్యం, కందుకూరు, ఉదయగిరి, కావలి శాసన సభ్యులు  శ్రీ మానుగుంట మహిధర్ రెడ్డి, శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,  శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు శ్రీ గోవింద రెడ్డి, శ్రీ కోటి రెడ్డి తదితరులు   ఆయా నియోజ వర్గాల్లో, జిల్లాలో  రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు,   సాగునీటి కెనాల్స్ కు చేపట్టాల్సిన  మరమ్మత్తులు, ఆధునీకరణ పనులు  తదితర అంశాలను కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది.


ఈ సమావేశంలో   జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి,  జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, తెలుగు గంగ ప్రాజెక్ట్ సి.ఈ  శ్రీ కె. హరి నారాయణ రెడ్డి,  నీటి పారుదల శాఖ ఎస్.ఈ శ్రీ పి. కృష్ణమోహన్,  సోమశిల ప్రాజెక్ట్ ఎస్.ఈ శ్రీ రమణా రెడ్డి, తెలుగు గంగ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ శ్రీ సుధాకర రావు,  నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఆర్.డి.ఓ లు శ్రీ మాలోల, శ్రీమతి కరుణకుమారి, శ్రీ శీనా నాయక్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ సుధాకర రాజు,  జిల్లాలోని నీటి  యాజ్యమాన్య  సంఘాల ప్రతినిధులు,  రైతు సంఘాల ప్రతినిధులు, నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు  తదితరులు పాల్గొన్నారు. 


Comments