పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల మౌలిక సదుపాయాల కోసం 'ఏపీఐఐసీ' కృషి : ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి






*రూ.288 కోట్లతో ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు నీటివసతి పనులకు శంకుస్థాపన*


*ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా రేపే  ప్రారంభం*


*పారిశ్రామిక సీమగా రాయలసీమ : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్*


*పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల మౌలిక సదుపాయాల కోసం 'ఏపీఐఐసీ' కృషి : ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*



అమరావతి, అక్టోబర్, 06 (ప్రజా అమరావతి); కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో నీటి వసతి పనులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం నాడు  ప్రారంభించనున్నారు.  రూ.288.కోట్లతో పైపు లైను పనులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చేపట్టే పనులకు కర్నూలు జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన  చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. పార్కు అభివృద్ధికి  అవసరమైన ఒక టీఎంసీ నీటిని శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వరద జలాల నుంచి ఏడాదిలో 100 రోజుల పాటు  ముచ్చుమర్రి మీదుగా  పైప్ లైన్ ద్వారా 'ఓఎమ్ఐహెచ్'కు నీటి వసతిని ఏర్పాటు చేయనున్నారు.   జలాశయాలు, ఇన్ టేక్ వెల్, పైప్ లైను, మోటార్ల ఏర్పాటు కలిపి మొత్తం ప్రాజెక్టు పనులు  రూ.428కోట్లతో రెండేళ్లలో పూర్తి కానున్నాయి. హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో ఓర్వకల్ నోడ్ అభివృద్ధి పనులలో భాగంగా హైదరాబాద్ కి చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ , జీవీ ప్రతాప్ రెడ్డి భాగస్వామ్య కంపెనీ నీటి సరఫరా మొదటి దశ పనులను టెండర్ విధానంలో  దక్కించుకుంది.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను పారిశ్రామిక సీమగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిట్‌) నిధులతో  మల్టీ ప్రొడక్ట్‌ పార్కుగా ఓర్వకల్లు పారిశ్రామిక పార్క్ అభివృద్ధి చేసే విధంగా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసిందని పరిశ్రమల మంత్రి స్పష్టం చేశారు.  దీని ద్వారా ప్రత్యక్షంగా 62,000 మందికి, పరోక్షంగా 77,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ రూ.37,300 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.


 ఓర్వకల్ మండలంలోని 11 గ్రామాల పరిధిలో 10,257 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న  ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ని ఏపీఐఐసీ అభివృద్ధి చేయబోతున్నట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. 2.8 కి.మీల మేర ఇప్పటికే అప్రోచ్ రోడ్ పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మెగా పరిశ్రమైన  జైరాజ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 413.19 ఎకరాల భూమిని  కేటాయించినట్లు పేర్కొన్నారు. గుట్టపాడు క్లస్టర్ పరిధిలోని 41.46 ఎకరాలను సిగచీ , ఆర్ పీఎస్ ప్రాజెక్ట్స్, డెవలపర్స్ ప్రై.లిమిటెడ్, ప్రిమో పాలి ప్యాక్ వంటి మూడు పరిశ్రమలకు భూములు కేటాయించినట్లు తెలిపారు.  గుట్టపాడు క్లస్టర్ లో మొదటి దశ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.30 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు.


ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కావలసిన విద్యుత్ సరఫరా ఏర్పాట్లను కూడా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసిందని ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు. 220/132/33కె.వి సామర్థ్యంతో విద్యుత్ సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం గుట్టపాడు క్లస్టర్ లో 220కె.వి సామర్థ్యం గల స్విచ్చింగ్ స్టేషన్  నిర్మాణం కోసం 5.50 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కేటయించిందన్నారు.


శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, శాసన మండలి సభ్యులు  గంగుల ప్రభాకర్ రెడ్డి, వెన్నపూస గోపాల్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు,  ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఏపీఐఐసీ డైరెక్టర్ మర్రి గోవింద్ రాజ్, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్, ఏపీఐఐసీ కర్నూలు జోనల్ మేనేజర్ విశ్వేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనే అవకాశం ఉంది.



Comments