హరియాణలో మొదలైన.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పోత పనులు



హరియాణలో మొదలైన..

 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పోత పనులు


విజయవాడలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణాలు

2023 ఏప్రిల్ 14న విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, నవంబర్ 24 (ప్రజా అమరావతి): బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ లో ప్రతిష్టించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఆవిష్కరించడానికి వీలుగా విజయవాడలో భవన నిర్మాణాల పనులు, హరియాణలో విగ్రహం పోత పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. అవసరమైతే మరోసారి హరియాణకు వెళ్లి విగ్రహ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తామని చెప్పారు.

గురువారం రాష్ట్ర సచివాలయంలో విజయవాడలోని పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ ప్రగతిని మంత్రి సమీక్షించారు. విజయవాడలో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ను, హరియాణలో జరుగుతున్న విగ్రహ నిర్మాణ పనులకు సంబంధించిన చిత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారంగా రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, దీనికి సంబంధించిన ప్రగతిని ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నారని చెప్పారు. స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టులో భాగంగా తొలగించాల్సిన పాత భవనాల తొలగింపు పనులు ఇప్పటికే పూర్తి కాగా విగ్రహం చుట్టూ నిర్మించనున్న భవనాల నిర్మాణం కూడా శరవేగంగా పూర్తవుతోందని చెప్పారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అవసరమైన 24 మీటర్ల టవర్ నిర్మాణపనులు కూడా తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. రాత్రీ పగలూ ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వీటిలో ఎక్కడా ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఒకవైపు విజయవాడలో ఈ నిర్మాణపనులు జరుగుతుండగా మరో వైపున హరియాణలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణపనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం విగ్రహానికి సంబంధించిన పోత (కాస్టింగ్) పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. నిర్ణీత గడువుకు ముందుగానే విగ్రహం విజయవాడకు చేరుకొనేలా చర్యలు తీసుకుంటున్నామని నాగార్జున చెప్పారు. 2023 ఏప్రిల్ 14న ఈ విగ్రహావిష్కరణ చేసి తీరాలనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగానే ఈ పనులను పటిష్టంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. విగ్రహ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించడానికి అవసరమైతే మరోసారి హరియాణకు వెళ్తామని చెప్పారు. ఏ కారణాలతో కూడా విగ్రహావిష్కరణలో జాప్యం జరగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేసారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కాటి హర్షవర్ధన్, అడిషనల్ డైరెక్టర్ రఘురామ్, ఏపీఐఐసీ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



Comments