వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాల్లోనూ గుండు సున్నా

 *వచ్చే ఎన్నికల్లో వైసీపీకి  175 స్థానాల్లోనూ గుండు సున్నా*



*పులివెందులోనూ వైసీపీకి  ఓటమి తప్పదు*


*టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి): వచ్చే ఎన్నికల్లో వైసీపీకి  175 స్థానాల్లోనూ గుండు సున్నా తప్పదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  జోస్యం చెప్పారు. ఆఖరికి సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులోనూ ఓటమి తప్పదన్నారు. మంగళగిరిలోని టీడీపీ  కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని స్పందన ఇటీవల కర్నూలు పర్యటనలో చూశానని చంద్రబాబు చెప్పారు. పెద్ద ఎత్తున యువత, ప్రజలు తరలివచ్చారన్నారు. అందుకే వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని,  8 మంది జిల్లాల అధ్యక్షుల్ని మార్చేశారని చెప్పారు. ఆక్వా రంగానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిమితులు లేకుండా ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్ రూ.1.50కే ఇచ్చే బాధ్యత తమదని చెప్పారు. ఆక్వా రంగంలో జోన్‌, నాన్‌ జోన్‌ విధానాలకు స్వస్తి పలుకుతామన్నారు. సీడ్‌ ధరల్ని నియంత్రిస్తామని తెలిపారు. నీటి పన్ను, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటును పాత ధరలతోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. జనరేటర్లు వాడే అవకాశం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ విషయాలన్నీ తెదేపా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పారు.

Comments