తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది..

  తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది..


హైదరాబాద్ (ప్రజా అమరావతి);

చంద్రబాబు  సమక్షంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్  బాధ్యతలు స్వీకరించారు.


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు  సమక్షంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్  బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. నీతి, నిజాయితీగా పదవికి న్యాయం చేసిన వ్యక్తి కాసాని అని, ఎక్కడ ఉన్నా పదవికి వన్నె తెచ్చే వ్యక్తి అని అన్నారు. టీడీపీ తెలంగాణ గడ్డపై పుట్టిందన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. ఎన్టీ రామారావు ఏ పని చేసినా స్వచ్ఛమైన మనసుతో చేశారని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టిందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆ రోజుల్లోనే అధికార వికేంద్రీకరణను తెచ్చిన వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. పరిపాలన పేదవారి ఇంటి ముంగిటకు ఎన్టీఆర్ తెచ్చారన్నారు. పేదవారి ఆత్మగౌరవం తగ్గకూడదనేదే ఎన్టీఆర్ ఆశయమని, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన వ్యక్తి అని, నాయకత్వాన్ని పెంచిన పార్టీ టీడీపీయేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వెనుకబడిన వర్గాల కోసం ఉండే పార్టీ టీడీపీ అని, వెనుకబడిన వర్గాలకు టీడీపీ శాశ్వతంగా రుణపడి ఉంటుందని చంద్రబాబు అన్నారు. పార్టీని వీడిన వారు ఎక్కడ ఉన్నా తిరిగిరావాలని పిలుపిచ్చారు. పీవీ నరసింహారావు తెలంగాణ గడ్డపైన పుట్టిన వ్యక్తి అని, పీవీ సంస్కరణలను తెలంగాణలో అమలులోకి తెచ్చింది టీడీపీయేనన్నారు. 1995లో తెలంగాణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పరిచయం చేశామన్నారు. తెలంగాణలో ఒక శక్తిలా టీడీపీని తయారు చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపిచ్చారు. ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్ టీడీపీదేనన్నారు. 2009లో ఎక్కువ సీట్లు తెలంగాణ గడ్డపై గెలిచిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Comments