టెక్నాలజీ జోడించి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నే రోడ్లను నిర్మిస్తున్నాం..


విజయవాడ (ప్రజా అమరావతి);

** టెక్నాలజీ జోడించి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నే రోడ్లను నిర్మిస్తున్నాం.. 


** తూర్పు గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా గజ్జరం - హుకుం పేట రోడ్డును నిర్మించాం.. 

** రూ. 2 వేల కోట్లతో 8 వేల కి.మీ. రోడ్డును అభివృద్ధి చేసాం.. 

-- రాష్ట్ర ఆర్ అండ్ బి  శాఖా మంత్రి శ్రీ దాడిశెట్టి రాజా..  

రాష్ట్రంలో 2 వేల కోట్ల రూపాయలతో 8 వేల కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్లను అభివృద్ధి చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.  విజయవాడ ఆర్ అండ్ బి హెచ్ ఓ డి కార్యాలయంలో మంగళవారం  ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్  సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈసందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధి కొరకు 3 వేల కోట్ల రూపాయల ఋణం తీసుకుని పసుపు కుంకాలకు  నిధులను మళ్లించారని,  గత ప్రభుత్వం చేపట్టిన అసంబద్ధ విధానం  రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితికి కారణమన్నారు.  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 2 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రం లోని దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్లను  8 వేల కిలోమీటర్ల మేర  మరమ్మత్తులు పూర్తిచేశారని మరో 17 వేల కోట్ల రూపాయలతో మిగిలిన రోడ్లు అన్నింటినీ మరమ్మత్తులు చేపట్ట నున్నామని మంత్రి అన్నారు.  రానున్న   13 నెలల్లోగా రాష్టంలోని  రోడ్లను పూర్తి చేసి అభివృద్ధి చేస్తామన్నారు.  

 ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ మరింత సమర్ధవంతంగా పనిచేసేలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 14 మంది డైరెక్టర్ లను నియమించారని, వీరంతా కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు పొందాలని తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి అన్నారు.  గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన రహదారులకు శాశ్వత పరిష్కార దిశగా నూతన టెక్నాలజీ జోడించి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నే విధంగా రోడ్లను నిర్మిస్తున్నామని ఈ నూతన టెక్నాలజీ నీ మొదటిసారిగా మన రాష్ట్రంలో అవలంబించే విధంగా కేంద్ర సంస్థ అయిన సి.ఎస్.ఐ.ఆర్. అధికారుల సహకారంతో రోడ్లను నిర్మిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి రోడ్లను నిర్మించి మంచి ఫలితాలను పొందారని మంత్రి అన్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో బాగా గతుకుల మయంగా మారిన గజ్జరం-హుకుంపేట 10 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో   రూ. 12.12 కోట్ల రూపాయలతో నూతన టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పైలట్ ప్రాజెక్ట్ క్రింద రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు.  రహదారి మరమ్మత్తు పనులను అధికారులు పర్యవేక్షించి రహదారుల నాణ్యతపై రాజీ పడకుండా రోడ్డు మరమ్మత్తు పనులు చేపడుతున్నారని, క్వాలిటీ పరంగా మంచి ఫలితాలను సాదించగలిగామని దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ టెక్నాలజీ నీ ఉపయోగించి మంచి ఫలితాలు పొందారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో శాసన సభ్యులందరికీ నూతన టెక్నాలజీ గురించి వివరించి వారి నియోజకవర్గాలలో రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించవలసిందిగా కోరామన్నారు. 

 రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసే వారికి అత్యంత గౌరవం, గుర్తింపు లభిస్తుందని, ఈరోజు డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలో గల రహదారులను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రహదారులు అభివృద్ధి చేయడానికి మీవంతు కృషి చేయాలని మంత్రి అన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ మంత్రి దాడిశెట్టి రాజా శుభాకాంక్షలు తెలియజేసారు. 

ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరి సుబ్బరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరూ పనిచేయాలని రోడ్ల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలనీ ఈ దిశగా ప్రతీ డైరెక్టరూ కష్టపడి పనిచేస్తే ఈ ప్రభుత్వంలో మంచి గుర్తింపు వస్తుందని కనుమూరి సుబ్బరాజు అన్నారు. 

ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ఇ ఎన్ సి కె. నయీముల్లా, ఇ ఎన్ సి (అడ్మిన్)  కె. వేణుగోపాల్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్. శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ సభ్యులుగా నియమించిన 14 మంది సభ్యులలో 13 మంది ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారని, శ్రీమతి  అసరఫ్ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని, ఆ సభ్యురాలు చేత తర్వాత ప్రమాణ స్వీకారం చేయిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరి సుబ్బరాజు అన్నారు.  కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్. శ్రీనివాస రెడ్డి 13 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.  సబ్యలుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీ అసరఫ్, చిత్తూర్ జిల్లాకు చెందిన డి.ఆర్. బాల గురునాధ్, అల్లూరి సీతారామ రాజు జిల్లాకు చెందిన శ్రీ బత్తుల చిన వెంకట సత్యనారాయణ, కాకినాడ జిల్లాకు చెందిన శ్రీమతి చింతకాయల మాలతి, బాపట్ల జిల్లాకు చెందిన శ్రీ షేక్ అహ్మద్ హుస్సేన్, గుంటూరు జిల్లాకు చెందిన శ్రీమతి పిల్లి మేరీ, అన్నమయ్య జిల్లాకు చెందిన లింగం గంగాదేవి, అదే జిల్లాకు చెందిన గండికోట గుల్జార్ బాషా, కృష్ణా జిల్లాకు చెందిన మర్రెడ్డి శిల్ప, కర్నూల్ జిల్లాకు చెందిన బి. చంద్రశేఖర రెడ్డి, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీమతి నలగర్ల భారతి, అదే జిల్లాకు చెందిన శ్రీమతి జాజుల లలిత లావణ్య, విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్రీమతి పద్మనాభ అమ్మాజీ, అదే జిల్లాకు చెందిన పేలా మాధవిలు ఉన్నారు. 


Comments