తొలిసారి ముస్లిం రిజర్వేషన్లు...


గుంటూరు (ప్రజా అమరావతి);


*గుంటూరు జిల్లా ... గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవానికి హాజరైన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


చిక్కటి చిరునవ్వులతో, మనసు నిండా ఆప్యాయతలతో ఇక్కడికి వచ్చిన, రాలేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రతి మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలకు మీ సోదరుడు, స్నేహిడుతు, మీ కుటుంబ సభ్యుడు మీ జగన్‌ ప్రేమపూర్వక అస్సాలామ్‌ అలైకుమ్‌.  


*జాతీయ విద్యా దినోత్సవం...*

ఇవాళ జాతీయ విద్యా దినోత్సవం అంతే కాకుండా మైనార్టీస్‌ వెల్ఫేర్‌ డే కూడా... (అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం). 


ఈ రెండు దినోత్సవాలు ఎందుకంటే ఈ రోజు భారతదేశ తొలి విద్యాశాఖమంత్రిగా ఈ దేశంలోనే అనేక ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్ధలు స్ధాపించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గారి జయంతి. 


మౌలాన్‌ అబుల్‌ ఆజాద్‌ గారి గురించి తెలియని వ్యక్తి ఉండరు. ఆజాద్‌ గారు స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప రచయత, పాత్రికేయుడు. భారతదేశానికి తొలి విద్యాశాఖమంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్‌ గారి ఆందించిన సేవలు గుర్తు చేసుకుంటూ.. ఆయన జయంతిని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డేగా జరుపుకుంటున్నాం.

మౌలానా అబుల్‌ కలాం గారి జయంతిని మైనార్టీస్‌ డే గా కూడా 2008లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ప్రియతమ నేత రాజశేఖర్‌రెడ్డి గారు(నాన్నగారు) తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించారు. 


*తొలిసారి ముస్లిం రిజర్వేషన్లు...*


ముస్లింలలో పేదలందరికీ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రిజర్వేషన్లు కూడా వర్తించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయంటే అది దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారి వల్లే జరిగింది. ఆ విషయం చెప్పుకోవడానికి ఒక కొడుకుగా గర్వపడుతున్నాను. నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల, మైనార్టీల సంక్షేమం పట్ల ఒక అడుగు వేస్తే.. ఆయన కొడుకుగా మీ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తున్నాడు. పదవుల విషయంలో అయితేనేమి, వారికి సంక్షేమం అందించే విషయంలో అయినా ఏ రకంగా చూసుకున్నా.. రాష్ట్రంలో 2019  నుంచి ఒక గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 


*2019 నుంచి మైనార్టీ సంక్షేమంలో గొప్ప మార్పు...*

ఆ రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు మంత్రిపదవి ఇవ్వడానికి కూడా మనసు రాని పరిస్థితుల నుంచి ఈ రోజు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవిలో ఒక మైనార్టీ సోదరుడు ఉన్నాడంటే మార్పు మీరే గమనించండి. మన పార్టీ నుంచి నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా దేవుడి దయతో గెలిపించుకోగలిగాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా నియమించుకున్నాం. అంతే కాకుండా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నా అక్క ఇవాళ శాసనమండలి ఉపాధ్యక్షపదవిలో ఉంది. మైనార్టీ సోదరుడు ఆర్టీఐ చీప్‌ కమిషనర్‌గా కూడా పదవిలో ఉన్నాడు. 

ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే.. కారణం మనసుతో చేస్తున్నాం అని చెప్పడానికే. గత ప్రభుత్వ హయాంలో అయితే ఏది చేసినా... మేలు చెయ్యాలి అన్న తపన, తాపత్రయంతో అడుగులు పడలేదు. ఏదో ఎన్నికలప్పుడు లబ్ధి జరగాలన్న ఆరాటంతో చేసినవే. 


ఎన్నికలు అయిన మరుసటి రోజే ప్రతి అడుగు కూడా మంచి చేయాలి, ఆ మంచితో చిరస్థాయిగా ప్రతి గుండెలోనూ నిలబడిపోవాలని ప్రతి అడుగు వేసిన మన ప్రభుత్వంలో మార్పును చూడమని కోరుతున్నాను. 


*3 ఏళ్ల 4 నెలల కాలంలో....*

రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు అంటే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో వివిధ పథకాల కింద కేవలం డీబీటీ విధానంలో బటన్‌ నొక్కి నేరుగా  అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి లంచాలు, వివక్ష లేకుండా జమ చేస్తున్నాం. వ్యవస్ధలో గొప్ప మార్పు చోటుచేసుకుంది.  కేవలం ఈ మూడేళ్ల 4 నెలల కాలంలోనే డీపీటీ ద్వారానే.... 44,13,773 మైనార్టీ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి రూ.10,309 కోట్ల రూపాయలు జమ చేశాం. 

ఇక నాన్‌ డీబీటీ పద్ధతిలో కూడా తీసుకుంటే... మరో 16,41,622 మైనార్టీ కుటుంబ సభ్యులకు మరో రూ.10వేల కోట్లు మేలు జరిగింది.


*ఒక్క హౌసింగ్‌లోనే రూ.9,400 కోట్లు లబ్ధి.....*

 ఇందులో ఒక్క ఉదాహరణ తీసుకుంటే... 2,42,226 మంది అక్కచెల్లెమ్మలకు కేటాయించిన ఇళ్ల స్ధలాల విలువ తీసుకుంటే.. ఒక్కో ఇంటి విలువ రూ.2.50 లక్షలు తీసుకున్నా... మరో 1,36,888 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే ఇళ్లు కూడా మంజూరు చేసి, నిర్మాణంలో ఉన్న వీటి విలువ కూడా కలుపుకుంటే.. ఈ ఇళ్లకు సంబంధించి ఒకే ఒక్క విషయంలోనే రూ.9,400 కోట్లు వీరి చేతిలో పెట్టగలిగాం.


*ప్రతి మైనార్టీ సోదరి, సోదరుడు బాగు దిశగా....*

దేవుడి దయతో ఇవన్నీ సాధ్యమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో 2014–19 వరకు ఐదేళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం చేసిన ఖర్చు... కేవలం రూ.2,665 కోట్లతో ఈ రూ.20 వేల కోట్లను పోల్చి చూసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాను.  ప్రతి అడుగులోనూ నా అక్కచెల్లెమ్మలు, ప్రతి మైనార్టీ సోదరుడు బాగుపడాలని అడుగులు వేస్తున్నాం.



*ప్రపంచంతో పోటీ పడి చదవాలి– గెలవాలి...* 

ఇంతకముందు కాసేపు క్రితం సోదరుడు మైనార్టీ తోఫా గురించి  మాట్లాడుతూ... మైనార్టీ తోఫాలో పదోతరగతి సర్టిఫికేట్‌ అర్హత తీసేయమని అడిగారు. ఈ సర్టిఫికేట్‌ నేను తీసేస్తే... నా చెల్లెమ్మలు ఎవరూ చదువుకునే పరిస్థితి ఉండదు. వాళ్లు చదవాలి. ప్రతి ముస్లిం చెల్లి, ప్రతి తమ్ముడ్లు చదవాలి. దేశంతో కాకుండా.. ప్రపంచంతో పోటీపడి గెలవాలి. వీళ్లు గెలవాలంటే కచ్చితంగా చదువు అనే అస్త్రం వీళ్ల చేతుల్లో ఉండాలి. అది లేకపోతే పోటీ ప్రపంచంతో వీళ్ల నెగ్గలేరు. అందుకనే చదువులు మీద మన ప్రభుత్వం కేటాయిస్తున్న ఫోకస్‌ మరే అంశం మీద పెట్టలేదు. 

ప్రతి ఒక్కరినీ చదివించాలనే ఉద్ధేశ్యంతోనే, ఉర్ధూను కూడా నేర్పిస్తూ మరోవైపు ఇంగ్లిషులో కూడా తర్ఫీదు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ప్రపంచంతో పోటీ పడి గెలవాలనే ఆరాటంతో అడుగులు వేయిస్తున్నాం.

చదువులను ప్రోత్సహించేందుకు తల్లులు కేవలం పిల్లలను బడికి పంపిస్తే చాలు.. అన్ని రకాలుగా మీ అన్న, మీ తమ్ముడు తోడుగా ఉంటాడనే భరోసా కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే కనీసం టెన్త్‌ క్లాస్‌ సర్టిఫికేట్‌ ఉండాలని ఎందుకు చెపుతున్నాను అంటే.. కనీసం పదోతరగతి వరకూ చదివించే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత పై చదువులు కూడా నా చెల్లెమ్మలు, తమ్మళ్లు చదవగలుగుతారనే మంచి ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను. అందరూ ఇది అర్ధం చేసుకోవాలి.


*వక్ఫ్‌ బోర్డు ఆస్తుల రక్షణకూ పటిష్ట చర్యలు....*

ప్రతి అడుగు సిన్సియర్‌గా వేస్తున్నాం. వక్ఫ్‌ బోర్డు ఆస్తులకు సంబంధించిన విషయాలలో కూడా వాటిని సంరక్షించాలని ప్రతి అడుగు వేస్తున్నాం. రాష్ట్రం మొత్తమ్మీద 65,783 ఎకరాల వక్ఫ్‌ భూములుండగా.. పలుచోట్ల అవి అన్యాక్రాంతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం తిరిగి వక్ఫ్‌కు స్వాధీనం చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పటికే అన్యాక్రాంతమైన వాటిలో 580 ఎకరాల భూమిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుని వక్ఫ్‌కు తిరిగి ఇచ్చాం. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం అన్ని వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్నాం. ఇప్పటివరకు 3,772 ఆస్తులకు సంబంధించి డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సర్వే పూర్తి చేసి వాటిని కంచె వేసి రక్షించే కార్యక్రమం చేస్తున్నాం. 


ఇమామ్‌ల గురించి, మౌజమ్‌ల గురించి నా సోదరుడు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష చెప్పారు.


*చివరిగా...*

ఈ రోజు అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకొండి. ఈ ప్రభుత్వం మీది అన్న సంగతి గుర్తుపెట్టుకొండి. అన్నిరకాలుగా తోడుగా ఉంటానని మీ కుటుంబ సభ్యుడిగా తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, దీవెనలు దేవుడి దయ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. 


*కాసేపటి క్రితం ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ...*

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టంకు  సంబంధించి రూ.287 కోట్లు అడిగారు. అది ఇప్పటికే మంజూరు చేశాం. శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో ఆర్వోబీ ప్రాజెక్టు గురించి అడిగారు. రూ.131 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం అవుతుంది. గుంటూరు వెస్ట్‌లో ముస్లిం కౌన్సిలింగ్‌ హాల్‌ కమ్‌ లైబ్రరీ సెంటర్‌ కోసం అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాను అని హామీ ఇస్తూ.. సీఎం తన ప్రసంగం ముగించారు.

Comments