శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, నవంబరు 15 (ప్రజా అమరావతి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు.
17 పరదాలు విరాళం :
హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణకుమార్ అనే భక్తుడు ఈ సందర్భంగా ఆలయానికి 17 పరదాలు విరాళంగా అందించారు.
నవంబరు 20 నుండి బ్రహ్మోత్సవాలు :
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 19వ తేదీన ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్రెడ్డి, ఆగమసలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దాము ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment