ఇక తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు – మాధవం అతిథిగృహంలో కౌంటర్లు ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

 ఇక తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు

– మాధవం అతిథిగృహంలో కౌంటర్లు ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం


తిరుపతి 30 నవంబరు (ప్రజా అమరావతి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతి లోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. గుంటూరుకు చెందిన శ్రీ ఎన్ లక్ష్మి హరీష్, శ్రీమతి జి.రూప సింధు కు జేఈవో తొలి టికెట్ అందించారు.

అనంతరం శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రిస్టు కు రూ 10 వేలు విరాళం ఇచ్చి రూ 500 చెల్లించే భక్తులకు ఇప్పటి దాకా తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తున్నారని చెప్పారు.

దాతలు ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి ఇక్కడే వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కు సమీపంలో ఉన్న మాధవం గెస్ట్ హౌస్ నుంచి ఉదయాన్నే బయలు దేరి తిరుమలకు వెళ్ళవచ్చు నన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నామని శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా తొలివిడత లో తెలుగు రాష్ట్రాల్లో 502 ఆలయాలు నిర్మించామన్నారు. రెండో విడతలో సుమారు 1500 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీవాణి ట్రస్టు కు విరాళం ఇచ్చే భక్తులు తిరుపతిలోని మాధవం అతిథిగృహం లో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన యూనియన్ బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ శ్రీ రాం ప్రసాద్, చీఫ్ మేనేజర్లు శ్రీ బ్రహ్మయ్య , శ్రీ నగేష్ కుమార్ , విజివో శ్రీ మనోహర్, డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, ఏఈవో శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు.

Comments