విజయవాడ (ప్రజా అమరావతి);
• నవంబర్ 14 నుండి 20 వరకు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..
• గ్రంథాలయ వ్యవస్థను పరిరక్షించడం కోసం రాష్ట్రంలో డిజిటల్ గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నాం.
• గ్రంథాలయ వ్యవస్థ ఫరిడవిల్లేందుకు ఉద్యోగులు, సిబ్బంది కృషి అభినందనీయం..
* స్వాతంత్ర్య ఉద్యమంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయి
• గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరి రావు వెల్లడి.
గ్రంథాలయాలు అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడం, నేటి తరాలను గ్రంథాలయాలకు సన్నిహితం చేయడమే ధ్యేయంగా, రాష్ట్రవ్యాప్తంగా 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు తెలిపారు. ప్రతి పేదవాడికి కార్పోరేట్ విద్య అందాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశిస్తున్నారని, అదేవిధంగా గ్రంథాలయ వ్యవస్థ కూడా ఫరిడవిల్లాలని కాలానుగుణంగా డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. విజయవాడలో ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో శనివారం మీడియా ప్రతినిధులకు వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ.. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 14న (సోమవారం) ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. గ్రంథాలయాల ప్రాధాన్యత తెలిసేలా, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సామాజిక స్పృహని, విద్య యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి చాటేవిధంగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 1918లో జాతీయ ఉద్యమంలో గ్రంథాలయాలు భాగస్వామ్యం అయ్యాయన్నారు. జాతీయ స్ఫూర్తికి, విద్యా వ్యాప్తికి, స్వాతంత్ర్య సాధనకు ప్రజలలో ఐక్యతను పెంపొందించడానికి గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. 1919లో అయ్యంకి వెంకటరమణయ్య ఆధర్వంలో నవంబర్ 14, 15 తేదీలల్లో గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ జరిగిందన్నారు. ‘సమాజానికి విజ్ఞానాన్ని పంచడానికి మేం ఉన్నాం’ అని తెలియజేయడానికి గ్రంథాలయ వ్యవస్థలో ఉన్న రెండు, మూడు తరాల ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారని తెలిపారు. గ్రంథాలయ వ్యవస్థ పరిఢవిల్లేందుకు ఉద్యోగులంతా కృషి చేస్తున్నారన్నారు. కళలు, సామాజిక అంశాలు ప్రజలందరికీ చేరువచేస్తున్న మీడియా పాత్ర అభింనదనీయమని చైర్మన్ మందపాటి శేషగిరి రావు అన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ టి. జమలపూర్ణమ్మ మాట్లాడుతూ.. 13 జిల్లాల చైర్మన్ లు, చైర్ పర్సన్ లుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి జాతీయ వారోత్సవాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
ప్రభుత్వ పౌర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలు, దిశ చట్టంపై అవగాహన కార్యక్రమాలతో ఈ వారోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. యావత్ దేశమంతటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన చరిత్ర గంథాలయాలకు ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో గ్రంథాలయాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ వారోత్సవాలను ఒక అవకాశంగా వినియోగించుకుంటామని ప్రసన్న కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ పీర్ అహ్మద్, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ వి. రవికుమార్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment