ఎస్సీ హాస్టళ్ల నుంచి నాన్ బోర్డర్లను తొలగించండి
• విద్యార్థులు మాత్రమే హాస్టళ్లలో ఉండేలా చూడండి
• అవసరమైతే పోలీసుల సాయం కోరండి
• గురుకుల విద్యార్థులకు ముఖ హాజరును పెట్టండి
• అధికారులకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం,
అమరావతి, నవంబర్ 23 (ప్రజా అమరావతి): ఎస్సీ హాస్టళ్లలో అక్రమంగా ఉంటున్న నాన్ బోర్డర్లను హాస్టళ్ల నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో విద్యార్థులకు కూడా ముఖ హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టాలని కూడా అధికారులను మంత్రి ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై మంత్రి నాగార్జున సమీక్షా సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్నిపోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో నాన్ బోర్డర్లు తిష్టవేసారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అక్రమంగా హాస్టళ్లలో ఉంటున్న నాన్ బోర్డర్ల కారణంగా విద్యార్థులతో పాటుగా హాస్టళ్ల సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులు తప్ప బయటి వ్యక్తులు ఎవరూ ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసారు. నాన్ బోర్డర్లను హాస్టళ్ల నుంచి తొలగించడంలో భాగంగా ముందుగా విద్యార్థుల తల్లదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులందరికీ గుర్తింపు కార్డులను ఇవ్వాలని కోరారు. హాస్టళ్లలో అనధికారికంగా ఉంటున్న వారందరినీ ఖాళీ చేయించాలని అవసరమైతే ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని నాగార్జున సూచించారు. వాచ్ మెన్లు లేని హాస్టళ్లలో వాచ్ మెన్ లను నియమించడానికి చర్యలు చేపట్టాలన్నారు. విరిగిన హాస్టళ్ల గేట్లు, పడిపోయిన ప్రహారీ గోడలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించి వాటిని బాగు చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గురుకులాల్లో అధికార సిబ్బందికి అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని విద్యార్థులకు కూడా అమలు చేయాలని గురుకులానికి సంబంధించిన సమీక్షా సమావేశంలో అధికారులకు నాగార్జున సూచించారు. ఒకసారి గురుకులంలోకి అడుగు పెట్టిన తర్వాత విద్యార్థులు మళ్లీ బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో తప్ప ఒంటరిగా బయటికి వెళ్లకుండా చూసుకోవాలని ఈ విషయంలో విద్యార్థుల బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసారు. గురుకులాల్లో నిర్ణీత మెనూను తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎస్సీ తో పాటుగా ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన హాస్టళ్లను కూడా నాడు-నేడు పథకంలో భాగంగా మరమ్మత్తులు చేసి మెరుగులు దిద్దే కార్యక్రమానికి సాంఘిక సంక్షేమశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపారు. మూడు దశల్లో మొత్తం 3013 హాస్టళ్లను రూ.3364 కోట్ల ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నాగార్జున ప్రస్తావించారు. మరమ్మత్తులు వీలు కానివిధంగా శిధిలావస్థకు చేరిన భవనాలను నేలమట్టం చేసి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించడానికి కూడా ప్రతిపాదనలు తయారవుతున్నాయని నాగార్జున వివరించారు. ఈ సమావేశాల్లో సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కాటి హర్షవర్ధన్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి, అకడమిక్ మానిటరింగ్ అధికారి సంజీవరావు, ఎస్సీ హాస్టల్స్ డిప్యుటీ డైరెక్టర్ లక్ష్మీసుధ, డీఎస్ టెక్నికల్ యోగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment