అమరావతి (ప్రజా అమరావతి);
*అర్హులైన ఓ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్ధిర సంకల్పంతో..
అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధిఅందని వారికి మరో అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం.*
*నవరత్నాలు ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారులకు రూ.590.91 కోట్లను క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే....:*
*అధికారం ప్రజలకు సేవ చేసేందుకే....*
దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం వేసే ఈ అడుగు మన పాలనకు అద్దం పట్టే విధంగా జరుగుతుంది. అధికారంలో ఉన్న వ్యక్తులు ఆ అధికారంలో ఉన్నది.. అధికారం చలాయించడానికి కాదు, ప్రజలకోసమే మనం ఉన్నాం. ప్రజలకుసేవ చేసేదానికి మనం ఉన్నామని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం.
*పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం.....*
మనది మనసున్న ప్రభుత్వం. పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం. రైతన్నల కష్టం తెలిసిన ఎరిగిన ప్రభుత్వం. అందుకే ఏ ఒక్కరికైనా, ఏ కారణం చేతనైనా, అర్హత ప్రకారం వారికి రావాల్సిన ఏ ఒక్క పథకమైనా కూడా పొరపాటున వారికి అందకపోతే వారెవ్వరూ కంగారుపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నాం. పథకం అయిపోయిన తర్వాత కూడా నెల రోజుల వరకు దరఖాస్తు పెట్టుకోమని చెప్పాం. దాన్ని రీవెరిఫై చేస్తాం. ఆ తర్వాత మళ్లీ ఆరు నెలలకు అంటే జనవరి నుంచి మే వరకు జరిగినవన్నీ జూన్లోనూ, జూన్ నుంచి నవంబరు వరకు జరిగినవన్నీ డిసెంబరులోనూ రీవెరిఫై చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బహుశా దేశ చరిత్రలో కూడా ఎక్కడా ఈ మాదిరిగా ఎవరూ మిస్ కాకూడదని తపన, తాపత్రయపడి వాళ్లు ఇచ్చే కార్యక్రమం జరగలేదు. అది కూడా అర్హుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం గ్రామ సచివాలయంలో పెట్టి మరీ ఇలా ఇచ్చే కార్యక్రమం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.
అందులో భాగంగా ఇవాళ గత ఆరునెలలు అంటే జూన్ నుంచి నవంబరు వరకు దాదాపు 11 సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పొరపాటున ఎవరైనా మిస్ అయితే ఆ పథకం అయిపోయిన నెలలోపు దరఖాస్తు పెట్టుకుంటే, దాన్ని రీవెరిఫై చేసి వాళ్లు మిస్ కాకుండా ఆరు నెలలు తిరక్క మునుపే ఇస్తామని చెప్పాం. దాన్ని డిసెంబరులో ఇస్తామని చెప్పాం.. అందులో భాగంగా ఈ రోజు ఈ 11 పథకాలకు సంబంధించి (జూన్ నుంచి నవంబరు వరకు) 2,79,065 కుటుంబాలకు మంచి చేస్తూ... రూ.591 కోట్లు వారి అకౌంట్లో జమ చేస్తున్నాం.
*పారదర్శకంగా.. లంచాలు, వివక్ష లేకుండా....*
ఎంత పారదర్శకంగా, లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు ఇవ్వకుండా పాలన జరుగుతుందో చెప్పడానికి చిన్న ఉదాహరణ.. ఈ 36 నెలల కాలంలో కేవలం బటన్ నొక్కి... డీబీటీ ద్వారా రూ. 1.85 లక్షల కోట్లు సొమ్ము నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు జమ చేశాం. దీనికి నాన్ డీబీటీ అంటే ఇళ్లు, ఇళ్లు పట్టాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, ట్యాబులు, విద్యా కానుక కూడా కలిపి.. మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ కలిసి రూ.3.30 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయగలిగాం.
*ప్రభుత్వానికి మీరే కళ్లూ, చెవులూ....*
ఇందులో కలెక్టర్ల పాత్ర చాలా కీలమైనది. వాళ్లు ప్రభుత్వానికి కళ్లు, చెవులు లాంటి వాళ్లు. వాళ్లు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది. కలెక్టర్లకు ఈ విషయంలో అభినందనలు. వారు పారదర్శకంగా అవినీతికి చోటు లేకుండా చేయగలిగారు కాబట్టే ఒక గొప్ప వ్యవస్ధను తేగలిగాం.
*గత పాలనకు - మన పాలనకు తేడా చూస్తే...*
గత ప్రభుత్వ పరిపాలనకు మూడున్నర సంవత్సరాల కాలంలో మన పాలనకు తేడా గమనిస్తే.. చాలా ఆశ్చర్య కరమైన విషయాలు తెలుస్తాయి.
గత ప్రభుత్వంలో ప్రతి అడుగులోనూ, ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీలు పెట్టేవారు. ఆ జన్మభూమి కమిటీలు ఏ పథకం రావాలన్నా వారు అడిగే మొట్టమొదట ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందిన వారు ? అని. అంతటితో ఆగకుండా ఇచ్చే అరకొరా కూడా లంచాలు తీసుకుని ఇచ్చే పరిస్థితి గతంలో మనం గమనించాం.
ఇవాళ అలా చేయకుండా వ్యవస్ధలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చాం. గ్రామస్ధాయిలో సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్ధ కనిపిస్తోంది. గ్రామసచివాలయంలో ప్రతిపథకం అమలయ్యేట్టు సోషల్ ఆడిట్లో అర్హుల జాబితాలను ప్రదర్శించి, పారదర్శకంగా ఇస్తున్నాం. అర్హత ఉండి ఎవరికైనా ఏ పథకమైన అందని పరిస్థితి ఉందంటే.. మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాం. దాన్ని మరలా రీవెరిఫై చేసి మరలా మంజూరు చేసే గొప్ప మనసు ఇవాళ కనిపిస్తోంది.
ఇవాళ పార్టీలు, కులాలు, ప్రాంతాలు చూడ్డం లేదు. ఏమాత్రం వివక్ష చూపడం లేదు. మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి కూడా ఇచ్చే గొప్ప ఆలోచన జరుగుతుంది.
*జన్మభూమి కమిటీలు– అడుగడుగునా లంచాలు..*
గత ప్రభుత్వ హయాంలో గమనిస్తే... ఇచ్చే పెన్షనే అర కొరా సొమ్మూ కేవలం రూ.1000. ఆ పెన్షన్ కూడా రావాలంటే 3 నెలల సొమ్ము జన్మభూమి కమిటీల చేతిలో పెడితే తప్ప అది కూడా వచ్చేది కాదు. ఇళ్లు మంజూరు తీసుకుంటే అది ఇచ్చేదే అతి కొద్దిమందికి. అది కూడా కావాలంటే జన్మభూమి కమిటీలకు రూ.20వేలు లంచం వాళ్ల చేతిలో పెడితే తప్ప ఇళ్లు వచ్చేది కాదు. రూ.50 వేల సబ్సిడీ లోన్ ఇవ్వాలంటే అందులో రూ.20వేలు జన్మభూమి కమిటీలకు ఇవ్వాల్సిందే. మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచమే. కనీసం రూ.2వేలు లంచం ఇస్తే తప్ప వచ్చేది కాదు. మరుగుదొడ్లకు కూడా లంచాలు తీసుకునే అధ్వాన్న పరిస్థితిని మనం గతంలో మనం చూశాం. ఏ పథకం కావాలన్నా లంచాలు, వివక్ష ఈ రెండు గత ప్రభుత్వ హయాంలో ప్రస్ఫుటంగా కనిపించేవి.
*నేడు మారిన పాలన....*
ఆ పరిస్థితులన్నీ ఇవాళ మార్చగలిగాం. మంచి పాలన అందించగలుగుతాం అని మెసేజ్ ఇవ్వాగలిగాం. మన
పాలన ఎంత గొప్పగా జరుగుతుందని చెప్పడానికి ఇవాళ ఈ పథకాలే నిదర్శనం. కులాలు, మతాలు చూడ్డం లేదు, వర్గాలు, పార్టీలు కూడా చూడ్డం లేదు.
ఏ పేదవాడిది అన్యాయం జరగకూడదు, మంచే జరగాలన్న గొప్ప దృక్పథంతో అడుగులు పడుతున్నాయి. ఇంత పారదర్శకంగా అర్హులను వెదికి మరీ.. ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్న ఆరాటంతో వాళ్లతో కూడా మరలా దరఖాస్తు పెట్టించి, వాటిని సోషల్ ఆడిట్లో పెట్టి ప్రతి ఆరు నెలల కొకమారు వారికి కూడా మంచి చేస్తున్నాం.
*కట్టుకథలు రాస్తున్నారు...*
ఇంత మానవతాదృక్పథంతో మనం పనిచేస్తుంటే.. మన మంచిని చూసి జీర్ణించుకోలేక ఆశ్చర్యకరమైన వార్తలు రాస్తున్నారు. జనవరి 1 నుంచి పెన్షన్ డబ్బులు పెంచుతున్నామన్న వార్తలను అస్సలు జీర్ణించుకోలేక దానిమీద కూడా అభాండాలు వేయాలన్న తపనతో కట్టుకథలు రాస్తున్నారు.
*ఈ పెన్షన్లకు సంబంధించిన విషయాలపై గతానికి ఇప్పటికీ తేడా చూస్తే...*
గత ప్రభుత్వ హయాంలో 39 లక్షల పెన్షన్లు ఇస్తే.. ఈ రోజు మన ప్రభుత్వంలో 62.70 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో పెన్షన్ రూ.1000 ఇస్తే ఇవాళ రూ.2750 కు పెంచుతున్నాం. అంటే పెన్షన్ల సంఖ్యలో 32 లక్షల నుంచి 62.70 లక్షలకు పెరిగిందంటే.. 60 శాతం పెరుగుదల ఉందని అర్ధం. అలాగనే పెన్షన్ అమౌంట్ లో పెరుగుల చూస్తే... 175 శాతం కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వానికి పెన్షన్ బిల్లు రూ.400 కోట్లు అయితే, నేడు మన ప్రభుత్వ హయాంలో రూ.1770 కోట్లు పెన్షన్ల కోసం నెలకు అమౌంట్ ఖర్చవుతున్నది. ఇంతగా పెరిగిన పరిస్థితుల్లో కూడా లబ్ధిదారులు ఎవరైనా అర్హత ఉండి మిగిలిపోకూడదని.. వారితో దరఖాస్తు చేసి, రీ వెరిఫై చేసి మరీ ఇస్తున్నాం.
*అర్హులు మిస్ కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం...*
అర్హత ఉన్నవాళ్లకి ఏ పథకం కూడా మిస్ కాకూడదు. ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అలాగే అర్హత లేని వాళ్లకి రాకూడదు. ప్రతి ఆరునెలలకొకసారి ఏ పథకమైనా ఆడిట్ జరగాలి. ఇందులో తప్పేముంది. పెన్షన్లకు సంబంధించి కొంతమందికి నోటీసులు వెళ్లాయి. ఎక్కడెక్కడ సందేహాలున్నాయో వాటిని ప్రస్తావిస్తూ నోటీసులు ఇస్తారు. దానికి సమాధానాలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత రీ వెరిఫై చేసి.. అనంతరం ఏదైనా చర్య తీసుకుంటారు తప్ప..
రీ వెరిఫై చేయకుండా ఏ చర్యలు తీసుకోరు. నోటీసులు ఇస్తేనే పెన్షన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి.
మరి ఇలాంటి ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా, ఎక్కడైనా నష్టం జరుగుతుందా ?అని గుండెల మీద చేతులు వేసుకుని ప్రశ్నించుకోవాలి.
*మనది మానవత్వమున్న ప్రభుత్వం....*
ప్రతి కలెక్టర్కు చెబుతున్నాను. మనది మానవత్వం ఉన్న ప్రభుత్వం. మన మనసులు పేదవాడికి దగ్గరగా ఉండే మనసులు. అర్హత ఉండి ఏ ఒక్కరికీ ఇవ్వని పరిస్థితి, రాని పరిస్థితి, కటింగ్ అయిన పరిస్థితి అస్సలే ఉండకూడదు. బెనిఫిట్ ఆప్ డౌట్ లబ్దిదారునికే ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పేదవాడు కూడా నాకు అర్హత ఉండి ఈ ప్రభుత్వంలో నాకు మంచి జరగలేదనే మాట ఏ ఒక్క కలెక్టర్ అనిపించుకునే కార్యక్రమం చేయవద్దు.
*ఒక విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం...*
ఎందుకంటే మనం ఇవాళ యుద్ధం పార్టీ చేయడం లేదు. ఒక విషపు వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. మనం ఏ మంచి చేసినా దాన్ని నెగిటివ్గా చూపించాలని తపనపడే ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 విషపు వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. అయినా కూడా మంచి చేసేవాళ్లకి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి విషపు వక్రీకరణలు చేసే వారికి దేవుడే సమాధానం చెప్తారు. ఇలాంటి విషపు రాతలు రాసేవారికి దేవుడే మొట్టికాయ వేస్తారు. వాళ్లు చేసే ఏ ఆరోపణ అయినా మనం పాజిటివ్గా తీసుకుందాం. అందులో నిజం ఉంటే మనం సరిదిద్దు కుందాం. నిజం లేకపోతే వారి తప్పును కచ్చితంగా తెలియజేసే కార్యక్రమం చేయాలి. లేదంటే తప్పుడు సమాచారం పోతుంది. వాళ్లు చెప్పేదే నిజమనుకునే అవకాశం ఉంది. మన తప్పు లేకపోతే మీడియా సమావేశం పెట్టి గట్టిగా చెప్పండి. అప్పుడే వాళ్లు చేసిన తప్పు వాళ్లకు ఎత్తి చూపించినట్టు అవుతుంది.
మనం ప్రజా పాలకులం. అంటే ప్రజలకు సేవకులం అని అర్ధం. మన డెఫినిషన్లో పాలన అంటే సేవ అనే అర్ధం. ప్రతి అధికారి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని, ఈ పథకాల ద్వారా మిగిలిన వారందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఏపీ అగ్రిమిషన్ వైస్చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రభుత్వ సలహాదారు ఐ తిరుపాల్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్(ఎఫ్ఏసీ) వై మధుసూధన్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, బీసీ, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, హేండ్లూమ్స్ అండ్ టెక్ట్స్టైల్స్ ముఖ్య కార్యదర్శి కె సునీత, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, హేండ్లూమ్స్ అండ్ టెక్ట్స్టైల్స్ కమిషనర్ ఎం ఎం నాయక్, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ జి రేఖారాణి, సెర్ప్ సీఈఓ ఏ ఎం డి ఇంతియాజ్, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక కార్యదర్శి బీ ఎం దీవాన్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ షన్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment